Fight In Marriage: చుక్కేసి.. ముక్కకోసం ఘర్షణ.. పెళ్లి భోజనం వద్ద గొడవతో ఇరు వర్గాలపై కేసులు-clash for meat after drinking alcohol dispute in jagityal wedding ceremony ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Fight In Marriage: చుక్కేసి.. ముక్కకోసం ఘర్షణ.. పెళ్లి భోజనం వద్ద గొడవతో ఇరు వర్గాలపై కేసులు

Fight In Marriage: చుక్కేసి.. ముక్కకోసం ఘర్షణ.. పెళ్లి భోజనం వద్ద గొడవతో ఇరు వర్గాలపై కేసులు

HT Telugu Desk HT Telugu

Fight In Marriage: జగిత్యాల జిల్లా ఆత్మకూరులో జరిగిన పెళ్లి విందులో మాంసం కోసం రెండు వర్గాల వారు కొట్లాటకు దిగారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు చెందిన 16మందిపై కేసు నమోదు చేశారు.

పోలీస్ స్టేషన్‌ వద్ద గాయపడిన వధువు బంధువులు

Fight In Marriage: పెళ్లి వేడుకల్లో Marriage Function ఘర్షణకు దిగి, పరస్పరం గాయపరచుకున్న 16మందిపై జగిత్యాల jagityal పోలీసులు కేసు నమోదు చేశారు. జగిత్యాల జిల్లా ఆత్మకూరు లో ఘటన జరిగింది.

వివాహ భోజనంబు..వింతైన వంటకంబు.. వియ్యాల వారి విందు... వివాదంగా మారెనంటా…. ఫూటుగా చుక్కేసి, విందులో ముక్క కోసం ఘర్షణపడడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గొడవ కాస్త ఠాణా మెట్లెక్కడంతో వదువరుల బంధువులు 16 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివాహ విందు భోజనం వివాదాస్పదంగా మారిన ఘటన జగిత్యాల జిల్లా మెట్ పల్లి Metpally మండలం ఆత్మకూరులో చోటు చేసుకుంది.

పెళ్ళింట ఘర్షణ

ఆత్మకూరు కు చెందిన యువతికి వేములవాడ కు చెందిన అబ్బాయితో వధువు ఇంటివద్ద అంగరంగ వైభవంగా వివాహం Marriage జరిగింది. పెళ్ళికి హాజరైన వదువరుల బంధు మిత్రులందరికీ వదువు కుటుంబ సభ్యులు విందు భోజనం ఏర్పాటు చేశారు.

మటన్ కర్రీ Mutton, బగారా రైస్ తో అతిథులకు మర్యాదలో ఏమాత్రం లోటు రాకుండా చర్యలు చేపట్టారు. కానీ మద్యం మత్తులో కొందరు సృష్టించిన గొడవ ఘర్షణకు దారి తీసి పెళ్ళింట రణరంగమయ్యింది.

చుక్కేసి(మద్యం సేవించి) వచ్చిన వరుడి తరుపు బంధువులు భోజనం చేసేందుకు సిద్దం కాగా మటన్ కర్రీ అయిపోయిందని వధువు బంధువులు చెప్పడంతో వరుడి బంధువులు మద్యం మత్తులో ముక్క లేకుంటే బుక్క దిగదని గొడవ చేశారు. వంట పాత్రలను, టెబుళ్ళను ఎత్తేసి వడ్డించే వారిపై దాడికి దిగారు.

దీంతో వధూవరుల బంధువులు పరస్పరం ఘర్షణ పడడంతో వధువు బంధువులు ఇద్దరికి రక్తగాయాలయ్యాయి. వివాహ విందు భోజనం రణరంగంగా మారింది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి, మూడుముళ్ళ బంధంతో ఏడడుగులు నడిచి ఆలుమగలుగా మారిన నవదంపతులను వేములవాడకు పంపించారు.

16మందిపై కేసు నమోదు..

విందు భోజనం వద్ద ఇరువర్గాలు ఘర్షణపడడంతో మెట్ పల్లి పోలీసులు 16 మందిపై కేసు నమోదు చేశారు. అమ్మాయి బంధువు దుద్దుల తిరుపతి పిర్యాదు మేరకు వేములవాడ కు చెందిన అబ్బాయి బంధువులు ఏడుగురిపై, అబ్బాయి బంధువు వేములవాడకు చెందిన నరాల రాజు ఫిర్యాదుతో ఆత్మకూరు కు చెందిన అమ్మాయి తరఫున బంధువులు 9 మంది కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు.

మద్యం మత్తులో ముక్క కోసం గొడవపడి పరస్పరం కొట్టుకుని కటకటాలు లెక్కించే పరిస్థితి ఏర్పడడంతో వధువరుల పేరెంట్స్ కాంప్రమైజ్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. మొత్తానికి మద్యం మత్తులో మటన్‌ కోసం కొట్లాటకు దిగి గాయపడి, పోలీస్ స్టేషన్‌ ముందు పడిగాపులు పడాల్సి వచ్చింది.

(రిపోర్టింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాsa ప్రతినిధి)

సంబంధిత కథనం