Etala Rajender : టిఆర్ఎస్ అసంతృప్త నేతలే ఈటల లక్ష్యం…?
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే తన టార్గెట్ కేసీఆర్ను గద్దె దించడమే అని ప్రకటించిన ఈటల ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఆపరేషన్ కమలం బాధ్యతను భుజాలపై తీసుకున్నారు. టీఆర్ఎస్ లో అసంతృప్తులకు వల వేయడమే కాదు, బలమైన నేతలను బయటకు లాగి కారు పార్టీని జిల్లా స్థాయిలో డీలా పరిచేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.
వరంగల్ జిల్లాలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావును బీజేపీలోకి ఆకర్షించడంలో ఈటల సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఎర్రబెల్లి సోదరుడి చేరికతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీజేపీకి మంచి జోష్ వచ్చింది. వరంగల్ తో పాటు, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లో సైతం టీఆర్ఎస్ అసంతృప్తులను బీజేపీ గూటికి చేర్చడమే లక్ష్యంగా ఈటల పావులు కదుపుతున్నారు.
హుజూరబాద్ ఎన్నికల సందర్భంగా ఈటలను ఓడిస్తామని, సవాళ్లు విసిరిన ఇతర నియోజక వర్గాలకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కౌంటర్ ఇచ్చేందుకు ఈటెల భారీ స్కెచ్ గీశారు. ఇందులో భాగంగా వరంగల్ ఈస్ట్ నన్నపనేని నరేందర్ కు చెక్ పెట్టేందుకే ప్రదీప్ రావును ఈటెల బీజేపీ పార్టీలోకి చేరేలా ఎత్తులు వేసినట్లు తెలుస్తోంది.
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా, ఈటలను ఎలాగైనా ఓడిస్తానని నియోజకవర్గంలోనే తిష్ట వేసుకొని కూర్చొని పోలింగ్ రోజు కూడా హడావిడి చేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్లకు ఈటల స్కెచ్ సిద్ధం చేసినట్లే అని సన్నిహితులు అంటున్నారు.
ఈటెల రాజేందర్కు బీజేపీ హై కమాండ్ నుంచి పూర్తి ఫ్రీ హ్యాండ్ లభించడంతో, టీఆర్ఎస్ సర్కారును టార్గెట్ చేయడమే కాకుండా, రాజకీయంగా దెబ్బతీసేందుకు రాజకీయ వ్యూహాలను రచిస్తున్నారు. నిజానికి టీఆర్ఎస్ పార్టీకి 2014 ఎన్నికల అనంతరం ఎక్కువగా తెలుగు దేశం, కాంగ్రెస్ పార్టీ నుంచి వలస వచ్చిన నేతలపైనే ఆధారపడింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. పదవులు అన్నీ టీడీపీ నుంచి వచ్చిన నేతలకే దక్కాయి. టీడీపీ సాంప్రదాయ ఓటు కూడా టీఆర్ఎస్ కు ట్రాన్స్ ఫర్ కావడంతో, పార్టీ అధినేత కేసీఆర్ కు వారికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే ఉద్యమకారులను టీఆర్ఎస్ పూర్తిగా విస్మరించిందనే అపప్రథ నుంచి మాత్రం కేసీఆర్ బయట పడలేకపోతున్నారు. దీన్నే ఈటల రాజేందర్ సహా బీజేపీ నేతలు తమకు అనుగుణంగా మలచుకుంటున్టానారు. ఈటెల రాజేందర్ కు ఉద్యమకారులు, తొలి తరం టీఆర్ఎస్ నేతలతో మంచి పరిచయాలు ఉన్నాయి. వారిని బీజేపీలో చేర్చుకొని కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టడమే ప్రస్తుతం ఈటల కర్తవ్యంగా కనిపిస్తోంది.
టాపిక్