Siricilla Kidnap : నిన్న ఎంగేజ్మెంట్… నేడు కిడ్నాప్…సిరిసిల్లలో దారుణం
Siricilla Kidnap రాజన్న సిరిసిల్ల జిల్లాలో గుళ్లో పూజలు చేయడానికి వెళ్లిన యువతిని కిడ్నాప్ చేయడం కలకలం రేపింది. తెల్లవారుజామున తండ్రితో కలిసి ఆలయంలో పూజలు చేస్తున్న యువతిని బలవంతంగా కిడ్నాప్ చేశారు. ప్రేమ పేరుతో యువతిని వేధించిన యువకుడే కిడ్నాప్కు పాల్పడినట్లు తండ్రి పోలీసుల్ని ఆశ్రయించాడు.
Siricilla Kidnap మరికొద్ది రోజుల్లో పెళ్లిపీటలపై ఎక్కాల్సిన యువతి తండ్రి కళ్లెదుటే కిడ్నాప్కు గురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం, మూడపల్లి గ్రామానికి చెందిన శాలిని అనే యువతి తన తండ్రితో కలిసి ఉదయం ఐదున్నర గంటలకు గ్రామంలోని హనుమాన్ ఆలయంలో పూజలు చేయడానికి వెళ్లింది. ఆలయంలో పూజలు నిర్వహిస్తుండగా కార్లో వచ్చిన యువకులు ఆమెను బలవంతంగా అపహరించారు. ఈ దృశ్యాలు ఆలయంలో ఉన్న సీసీ టీవీలో నమోదయ్యాయి.
మూడపల్లి గ్రామానికి చెందిన శాలినిని గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో వేధిస్తుండటంతో ఆమె తల్లిదండ్రులు పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో జ్ఞానేశ్వర్ అలియాస్ జాన్ అనే యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని జైలుకు కూడా పంపారు. అతనిపై పోస్కో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కొంత కాలం సైలెంట్గా ఉన్న నిందితుడు అదను చూసి యువతిని అపహరించాడు.
ఆలయంలో పూజలు చేస్తున్న సమయంలో ఎవరు లేకపోవడంతో యువతి తండ్రిపై స్నేహితులతో కలిసి దాడి చేసి ఆమెను అపహరించారు. నిందితుల నుంచి తప్పించుకోడానికి ఆమె ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించిన ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని పరారయ్యారు. యువతి అచూకీ లభించకపోవడంతో ఆమె తండ్రి పోెలీసులకు ఫిర్యాదు చేశాడు. అపహరణకు గురైన యువతికి సోమవారం మరో యువకుడితో నిశ్చితార్థం జరిగింది. త్వరలో వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
యువతిని అపహరించిన వారిలో ఇద్దరిని గుర్తించినట్లు యువతి తండ్రి చెబుతున్నారు. గతంలో తమ కుమార్తెను వేధించిన జాన్తో పాటు ప్రశాంత్ అనే యువకుడు తమపై దాడి చేశారని చెబుతున్నారు. మరో ఇద్దరు కారులోనే ఉన్నారని చెప్పారు. మరోవైపు యువతిని అపహరించిన వారి కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు. రెండు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. యువతిని అపహరించిన నిందితులు అఘాయిత్యానికి పాల్పడతారేమోనని యువతి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తమ బిడ్డను కాపాడాలని వేడుకుంటున్నారు. మరోవైపు యువతి అపహకరపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
టాపిక్