Wasim Jaffer on Suryakumar: సూర్యకుమార్ యాదవ్.. గతేడాది టీ20ల్లో ఇరగదీసిన బ్యాటర్. ఈ ఫార్మాట్ లో గతేడాది అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్. ఆ పర్ఫార్మెన్స్ తోనే అతడు వన్డేలు, టెస్టుల్లోనూ జట్టులో చోటు సంపాదించాడు. కానీ వన్డేల్లో చాలానే అవకాశాలు వస్తున్నా.. సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. మరీ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో అయితే ఆడిన మూడు వన్డేల్లోనూ తొలి బంతికే ఔటయ్యాడు.
ఈ నేపథ్యంలో అతనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వన్డేల్లో సూర్య కంటే సంజూ శాంసన్ కు అవకాశం ఇవ్వడం ఉత్తమమని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అనడం విశేషం. సంజూకి వన్డేల్లో మంచి రికార్డు ఉంది. ఇప్పటి వరకూ అతడు 11 వన్డేలు ఆడి 66 సగటుతో 330 పరుగులు చేయడం విశేషం. మరోవైపు సూర్య మాత్రం 24 వన్డేల్లో కేవలం 24 సగటుతో 433 రన్స్ మాత్రమే చేశాడు.
ఆస్ట్రేలియా చేతిలో ఇండియా సిరీస్ ఓడిపోయిన తర్వాత క్రికిన్ఫోతో మాట్లాడిన జాఫర్.. సూర్యపై తనకు కూడా సానుభూతి ఉన్నా.. టీమ్ ప్రస్తుతం మరో బ్యాటర్ వైపు చూడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశాడు. అందుకే వన్డేల్లో సంజూ శాంసన్ లాంటి ప్లేయర్ వైపు చూడొచ్చని, సూర్యన అలాగే ఉంచి శాంసన్ కు కొన్ని అవకాశాలు ఇస్తే బెటరని అభిప్రాయపడ్డాడు.
"సూర్యపై నాకు సానభూతి ఉంది. నిజానికి 11వ నంబర్ బ్యాటర్ కు కూడా ఇలాంటి పరిస్థితి రాదు. వరుసగా మూడుసార్లు గోల్డెన్ డక్ కావడం నిజంగా నమ్మశక్యం కానిది. అతనికి మరోసారి ఇలా జరగకూడదని కోరుకుంటున్నా. ఇది కేవలం అతని దురదృష్టం. కానీ ఇండియన్ టీమ్ మరో ప్లేయర్ వైపు చూడాలి. సూర్య మంచి క్వాలిటీ ప్లేయర్. అతడు గాడిలో పడతాడు. కానీ టీమ్ మాత్రం సూర్యను అలాగే ఉంచి సంజూ శాంసన్ లాంటి ప్లేయర్ ను తీసుకురావాలి. ఐపీఎల్ తో సూర్య మళ్లీ గాడిలో పడే అవకాశం ఉంది. కానీ సంజూ శాంసన్ కు వన్డేల్లో అవకాశం ఇవ్వడం ఉత్తమం" అని జాఫర్ అభిప్రాయపడ్డాడు.
2019 తర్వాత తొలిసారి స్వదేశంలో ఇండియా వన్డే సిరీస్ కోల్పోయిన విషయం తెలిసిందే. మూడు వన్డేల్లోనూ టాపార్డర్ బ్యాటర్లు నిరాశ పరిచారు. సూర్య తన ఖాతానే తెరవకపోగా.. రోహిత్, కోహ్లిలాంటి వాళ్లు కూడా అంచనాలకు తగినట్లు రాణించలేదు. దీంతో మూడు వన్డేల సిరీస్ ను ఆస్ట్రేలియా 2-1తో గెలిచింది.
సంబంధిత కథనం