Team India in Beach: సర్ఫింగ్ చేస్తూ.. బీచ్ వాలీబాల్ ఆడుతూ.. టీమిండియా ఫన్డే
Team India in Beach: సర్ఫింగ్ చేస్తూ.. బీచ్ వాలీబాల్ ఆడుతూ.. దుబాయ్లో హాయిగా గడిపింది టీమిండియా. ఆసియా కప్లో సూపర్ ఫోర్ స్టేజ్కు చేరుకున్న రోహిత్ సేన.. ఒక రోజు ప్రాక్టీస్కు గుడ్బై చెప్పింది.
Team India in Beach: క్రికెటర్లు ఎంత బిజీగా ఉన్నా.. అప్పుడప్పుడూ బ్యాట్, బాల్ పక్కన పెట్టి అలా సేదదీరడం ఎంతైనా అవసరమే. దీనివల్ల ఒత్తిడిని అధిగమించి నెక్ట్స్ మ్యాచ్కు ఫ్రెష్గా రెడీ అవుతారు. ప్రస్తుతం దుబాయ్లో ఉన్న ఇండియన్ టీమ్ కూడా అదే చేస్తోంది. ఆసియా కప్లో ఇప్పటికే పాకిస్థాన్, హాంకాంగ్లను ఓడించి సూపర్ ఫోర్కు క్వాలిఫై అయిన టీమ్.. ఒక రోజు మొత్తం బీచ్లో ఎంజాయ్ చేసింది.
సర్ఫింగ్ చేస్తూ.. బీచ్ వాలీబాల్ ఆడుతూ క్రికెటర్లంతా సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన వీడియోను శుక్రవారం (సెప్టెంబర్ 2) బీసీసీఐ తన ట్విటర్లో పోస్ట్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లితోపాటు మిగతా టీమంతా సముద్ర అలలతో ఆడుకుంటూ.. సర్ఫింగ్ బోర్డ్పై అలా అలా నీటిపై తేలియాడుతూ కనిపించారు.
రాహుల్, భువనేశ్వర్, అర్ష్దీప్లాంటి వాళ్లు కాస్త భయంభయంగానే ఈ సర్ఫింగ్ బోర్డులపైకి ఎక్కి సముద్రంలోకి వెళ్లారు. వాళ్ల వెనుక దుబాయ్ నగర అందాలు కూడా ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. ఇక స్పిన్నర్ యుజువేంద్ర చహల్ బీచ్లోని ఇసుకలో కూర్చొని తన టీమ్ చేస్తున్న సరదా ఫీట్లపై కామెంటరీ ఇచ్చాడు. అంతేకాదు అశ్విన్తో కలిసి ట్రైసైకిల్ పెడల్ బోట్లోనూ విహరించాడు.
ఆ తర్వాత టీమంతా రెండుగా విడిపోయి బీచ్ వాలీబాల్ కూడా ఆడారు. రాహుల్, కోహ్లిలాంటి వాళ్లు షర్ట్స్ విప్పేసి తమ సిక్స్ ప్యాక్ బాడీలను చూపించడం విశేషం. ఈ వీడియో వైరల్ అవుతోంది. గురువారం ప్రాక్టీస్ పక్కన పెట్టి టీమంతా దుబాయ్లో ఇలా సరదాగా గడిపారు. ఇప్పటికే సూపర్ ఫోర్కు చేరుకున్న ఇండియన్ టీమ్ ఆదివారం ఆ స్టేజ్లో తొలి మ్యాచ్ ఆడనుంది.
శుక్రవారం పాకిస్థాన్, హాంకాంగ్ మ్యాచ్ విజేతతో ఆదివారం ఇండియా తలపడనుంది. గ్రూప్ స్టేజ్లో ఈ రెండు టీమ్స్ను ఇండియా చిత్తు చేసిన విషయం తెలిసిందే. పాకిస్థాన్పై 5 వికెట్లతో, హాంకాంగ్పై 40 పరుగులతో విజయం సాధించింది. ఇండియా చేతిలో ఓడిన ఈ టీమ్స్.. ఇప్పుడు సూపర్ ఫోర్లో చివరి బెర్త్ కోసం తలపడనున్నాయి. ఇప్పటికే గ్రూప్ బి నుంచి ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక సూపర్ ఫోర్కు చేరిన విషయం తెలిసిందే.
శుక్రవారం జరగనున్న మ్యాచ్లో హాంకాంగ్ను పాకిస్థాన్ ఓడిస్తే.. వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 4) కూడా మరో ఇండోపాక్ వార్ జరుగుతుంది. సూపర్ ఫోర్ తొలి మ్యాచ్లో ఎ1, ఎ2లు తలపడాల్సి ఉంది. ఎ1 ఇండియా కాగా.. ఇప్పుడు ఎ2 కోసం పాక్, హాంకాంగ్ తలపడుతున్నాయి.