Ind vs Pak turning point: పాకిస్థాన్‌కు పెనాల్టీ.. మ్యాచ్‌ను మలుపు తిప్పింది అదే-slow over rate penalty for pakistan in asia cup match against india ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ind Vs Pak Turning Point: పాకిస్థాన్‌కు పెనాల్టీ.. మ్యాచ్‌ను మలుపు తిప్పింది అదే

Ind vs Pak turning point: పాకిస్థాన్‌కు పెనాల్టీ.. మ్యాచ్‌ను మలుపు తిప్పింది అదే

Hari Prasad S HT Telugu
Aug 29, 2022 03:56 PM IST

Ind vs Pak turning point: పాకిస్థాన్‌ టీమ్‌కు పెనాల్టీ కొంప ముంచింది. ఆసియాకప్‌లో భాగంగా ఇండియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఆ పెనాల్టీయే ఇండియాకు అనుకూలంగా మారింది. ఇంతకీ ఏం జరిగింది?

పాకిస్థాన్ కొంప ముంచిన స్లో ఓవర్ రేట్ పెనాల్టీ
పాకిస్థాన్ కొంప ముంచిన స్లో ఓవర్ రేట్ పెనాల్టీ (AP)

Ind vs Pak turning point: ఆసియా కప్‌లో ఇండియా, పాకిస్థాన్‌ మ్యాచ్‌ ఊహించినట్లే నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగింది. చివరి ఓవర్‌ వరకూ రెండు టీమ్స్‌నూ గెలుపు ఊరించినా.. చివరికి ఇండియానే పైచేయి సాధించింది. మొదట పాకిస్థాన్‌ 148 రన్స్‌ టార్గెట్‌ విధించగా.. చేజింగ్‌లో చాలా కష్టపడింది టీమిండియా. అయితే మొదట విరాట్‌ కోహ్లి.. చివర్లో జడేజా, హార్దిక్‌ పాండ్యా మెరుపులు విజయం సాధించి పెట్టాయి.

అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ టీమ్‌కు విధించిన పెనాల్టీ ఇండియాకు కలిసి వచ్చింది. ఆ టీమ్‌ స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఈ పెనాల్టీ విధించారు. ఇంతకీ ఆ పెనాల్టీ ఏంటంటే.. ఇన్నింగ్స్‌ చివర్లో పవర్‌ ప్లేలో ఐదుగురు ఫీల్డర్లను 30 యార్డ్‌ సర్కిల్‌ బయట ఉంచే వీలున్నా.. పాకిస్థాన్‌కు మాత్రం నలుగురినే అనుమించారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ఆ మిగతా ఫీల్డర్‌ను సర్కిల్‌లోనే ఉంచాల్సి వచ్చింది.

ఐసీసీ నిబంధనల ప్రకారం.. నిర్ణీత సమయంలోపు చివరి ఓవర్‌ ప్రారంభించలేకపోతే ఆ టీమ్‌కు ఐదుగురు బదులు నలుగురు ఫీల్డర్లనే సర్కిల్‌ బయట ఉంచే అవకాశం ఇస్తారు. ఇది ఆదివారం నాటి మ్యాచ్‌లో ఇండియాకు కలిసి వచ్చింది. పాక్‌ చివరి మూడు ఓవర్లను సర్కిల్‌ బయట నలుగురు ఫీల్డర్లతోనే వేయాల్సి వచ్చింది. దీంతో 18వ ఓవర్లో నసీమ్‌ షా బౌలింగ్‌లో జడేజా ఓ ఫోర్, సిక్స్‌ కొట్టాడు.

ఇక 19వ ఓవర్లో హార్దిక్‌ అయితే మూడు ఫోర్లు బాదాడు. సర్కిల్‌ బయట ఒక ఫీల్డర్‌ తక్కువగా ఉండటంతో బౌండరీలు బాదడానికి ఈ ఇద్దరికీ మంచి గ్యాప్‌ దొరికింది. ఆ రెండు ఓవర్లలో వచ్చిన ఈ బౌండరీలు మ్యాచ్‌ను మలుపు తిప్పాయి. ఐసీసీ కొత్త నిబంధనలు స్లో ఓవర్‌ రేట్‌కు ఇలాంటి కఠినమైన పెనాల్టీని విధిస్తోంది. ఈ ఏడాది జనవరి 16 నుంచీ ఈ కొత్త రూల్‌ అమల్లోకి వచ్చింది.

WhatsApp channel

సంబంధిత కథనం