Pakistan vs Hong Kong Asia cup 2022: పసికూనపై పాక్ ప్రతాపం.. భారత్‌తో మరోసారి క్రికెట్ సమరానికి సిద్ధం-pakistan won by 155 runs against hong kong in asia cup 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Pakistan Vs Hong Kong Asia Cup 2022: పసికూనపై పాక్ ప్రతాపం.. భారత్‌తో మరోసారి క్రికెట్ సమరానికి సిద్ధం

Pakistan vs Hong Kong Asia cup 2022: పసికూనపై పాక్ ప్రతాపం.. భారత్‌తో మరోసారి క్రికెట్ సమరానికి సిద్ధం

Maragani Govardhan HT Telugu
Sep 02, 2022 11:07 PM IST

Pakistan vs Hong Kong Asia cup 2022: హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 155 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఇది ఆ జట్టుకు టీ20ల్లో అత్యంత పెద్ద విజయం. మొత్తంగా చూసుకుంటే ఇంత భారీ తేడాతో గెలిచిన రెండో జట్టుగా పాక్ నిలిచింది.

హాంకాంగ్ పై పాక్ విజయం
హాంకాంగ్ పై పాక్ విజయం (AP)

Pakistan vs Hong Kong Asia cup 2022: దుబాయ్ వేదికగా హాంకాంగ్‌తో జరిగిన ఆసియా కప్ గ్రూప్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 155 పరుగులు తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. పసికూనపై ప్రతాపం చూపిన పాక్.. ఈ విజయంతో ఆదివారం నాడు మరోసారి టీమిండియాతో సమరానికి ఢీ కొట్టేందుకు సమయాత్తమైంది. తొలుత బ్యాటింగ్ చేసి 194 పరుగుల భారీ లక్ష్యాన్ని హాంకాంగ్ ముందుంచిన పాక్ అద్భుత విజయాన్ని అందుకుంది. లక్ష్యాన్ని ఛేదించలేక హాంకాంగ్ జట్టు 38 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆ జట్టులో ఒక్కరంటే ఒక్కరూ కూడా రెండంకెల స్కోరు నమోదు చేయకపోవడం గమనార్హం. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 4 వికెట్లతో విజృంభించగా.. మహమ్మద్ నవాజ్ 53 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. నసీమ్ షా 2, షాన్వాజ్ దహానీ ఓ వికెట్ తీశారు.

లక్ష్య ఛేదనలో హాంకాంగ్ జట్టు పేలవ ప్రదర్శనతో అబాసు పాలైంది. ఒక్కరంటే ఒక్క బ్యాటర్ కూడా రెండంకెల స్కోరును నమోదు చేయలేకపోయాడు. పాకిస్థాన్ బౌలర్ల ధాటికి హాంకాంగ్ బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు కట్టారు. మూడో ఓవర్ తొలి బంతికి మొదలన వికెట్ల పతనం 11 ఓవర్ నాలుగో బంతితో ముగిసింది. కేవలం 8 ఓవర్ల వ్యవధిలోనే మ్యాచ్ ముగిసిందంటే హాంకాంగ్ వికెట్ల పతనం ఎలా కొనసాగిందో అర్థం చేసుకోవచ్చు. బ్యాటర్లంతా అలా క్రీజులోకి వచ్చి ఇలా వెళ్లిపోవడం తమ వంతైంది. షాదాబ్ ఖాన్, నసీమ్ షా, మహమ్మద్ నవాజ్ హాంకాంగ్ బ్యాటర్లకు తమ పదునైన బంతులతో చుక్కలు చూపించారు.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. హాంకాంగ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. కెప్టెన్ బాబర్ ఆజం తక్కువ పరుగులకే వెనుదిరిగినప్పటికీ.. ఓపెనర్ రిజ్వాన్(78), వన్డౌన్ బ్యాటర్ ఫఖర్ జమాన్(53) అద్భుత అర్ధశతకాలతో పాకిస్థాన్‌కు భారీ స్కోరును అందించారు. చివర్లో ఖుష్దిల్(35) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి పాకిస్థాన్ 193 పరుగులు చేసింది. హాంకాంగ్ బౌలర్లలో ఇషాన్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు.

ఈ మ్యాచ్ విజయంతో సూపర్-4 దశకు చేరుకుంది పాకిస్థాన్. ఆదివారం నాడు మరోసారి టీమిండియాతో తలపడనుంది. ఇప్పటికే గ్రూప్ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమి పాలైన పాక్.. విజయం కోసం ఆత్రుతగా ఎదురుచూస్తోంది. మరోపక్క టీమిండియా ఇంకోసారి పాకిస్థాన్‌ను కసిగా ఓడించాలని భారత అభిమానులు ఉవ్విళ్ళూరుతున్నారు.

WhatsApp channel

సంబంధిత కథనం