Rahane Dhoni: ధోనీ చెప్పినందుకే రహానేకు టీమిండియాలో ఛాన్స్!
Rahane Dhoni: ధోనీ చెప్పినందుకే రహానేకు టీమిండియాలో ఛాన్స్ దక్కినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అతడు ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లో ఉన్న విషయం తెలిసిందే.
Rahane Dhoni: ఈ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో అజింక్య రహానేకు చోటు దక్కడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఐపీఎల్లో ఐదు మ్యాచ్ లలో మెరుపు ఇన్నింగ్స్ ఆడినంత మాత్రాన ఏకంగా ఇండియన్ టీమ్ లోకి, అది కూడా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో చోలు కల్పిస్తారా అన్న విమర్శలు కూడా వచ్చాయి.
అయితే కేవలం ఐపీఎల్ పర్ఫార్మెన్సే కాదు.. శ్రేయస్, పంత్ లాంటి ప్లేయర్స్ గాయాలతో దూరం కావడం వల్ల సీనియర్ అయిన రహానే వైపు సెలక్టర్లు చూడాల్సి వచ్చిందన్న వార్తలూ వచ్చాయి. ఇక తాజాగా రహానే ఎంపికలో ధోనీ పాత్ర ఉందన్న వార్త మరింత ఆసక్తి రేపుతోంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన రిపోర్టు ప్రకారం.. టీమిండియా మేనేజ్మెంట్, సెలక్టర్లు.. ధోనీని సంప్రదించిన తర్వాతే రహానేకు జట్టులో చోటు కల్పించారట.
ప్రస్తుతం ఐపీఎల్లో రహానే ఆడుతున్న సీఎస్కే కెప్టెన్ గా ఉన్న ధోనీ నుంచి సెలక్టర్లు కీలకమైన సమాచారం అందుకున్న తర్వాతే అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఆ రిపోర్టు వెల్లడించింది. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరై చాలా కాలమే అవుతున్నా.. ఇప్పటికీ అతనంటే టీమ్ మేనేజ్మెంట్, సెలక్టర్లకు ఎంతో గౌరవం. ధోనీ మాటలకు ఇప్పటికీ ఎంతో విలువుంది అనడానికి రహానే ఎంపికే నిదర్శనం.
అటు అజింక్య కూడా ఏడు రంజీ ట్రోఫీ మ్యాచ్ లలో 634 పరుగులు చేసి ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఐపీఎల్లో అయితే ఊహకందని రీతిలో ఆడుతున్నాడు. ఏకంగా 199 స్ట్రైక్ రేట్ తో 209 రన్స్ చేశాడు. ఈ ఫామ్, ఇంగ్లండ్ కండిషన్స్ లో అతని అనుభవం కూడా పనికొస్తుందని భావించిన సెలక్టర్లు డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే జట్టులో చోటు కల్పించారు. రహానే ఎంపికను గవాస్కర్, రవిశాస్త్రిలాంటి మాజీ క్రికెటర్లు కూడా స్వాగతించారు.
సంబంధిత కథనం