Gambhir Team for T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం గంభీర్ ఎంచుకున్న టీమ్ ఇదే.. షమీకి చోటు.. కార్తిక్‌కు నో ఛాన్స్-gautam gambhir picks his india playing xi for t20 world cup ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Gautam Gambhir Picks His India Playing Xi For T20 World Cup

Gambhir Team for T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం గంభీర్ ఎంచుకున్న టీమ్ ఇదే.. షమీకి చోటు.. కార్తిక్‌కు నో ఛాన్స్

Maragani Govardhan HT Telugu
Oct 21, 2022 09:14 PM IST

Gambhir Team for T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం గౌతమ్ గంభీర్ తన జట్టును ఎంచుకున్నాడు. అందులో భువనేశ్వర్ కుమార్ స్థానంలో షమీకి స్థానం కల్పించగా.. దినేశ్ కార్తిక్ స్థానంలో పంత్‌కు అవకాశమిచ్చాడు.

గౌతమ్ గంభీర్
గౌతమ్ గంభీర్ (Ayush Sharma)

Gambhir Team for T20 World Cup: ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా అన్నీ అస్త్రాలను సిద్ధం చేసుకుంది. గతేడాది చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో పరాభవానికి ప్రతీకారం తీర్చుకునేందుకు తహతహలాడుతోంది. ఆదివారం నాడు పాక్‌తో అరంగేట్రం అమీ తుమీ తేల్చుకోనుంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమైనప్పటికీ అతడి స్థానంలో మహమ్మద్ షమీని తీసుకుంది. దీంతో పలువురు మాజీల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాత్రం షమీని వెనుకేసుకొచ్చాడు. టీ20 ప్రపంచకప్ కోసం తన ఎంచుకున్న జట్టులో షమీకి స్థానాన్ని కల్పించాడు. అంతేకాకుండా భువికి అవకాశమివ్వకపోవడం గమనార్హం. దినేశ్ కార్తిక్‌కు బదులు రిషబ్ పంత్‌కు అవకాశం కల్పించాడు.

"నా అభిప్రాయం ప్రకారం భారత్ ముగ్గురు పేసర్లతో ఆడాలి. భువనేశ్వర్ కుమార్ స్థానంలో షమీని ఆడించాలి. మిగిలిన ఇద్దరు పేసర్లుగా అర్ష్‌దీప్ సింగ్, హర్షల్ పటేల్‌ను తీసుకుంటే బెటర్. యజువేంద్ర చాహల్, అక్షర్ పటేల్ లాంటి ఇద్దరు స్పిన్నర్లు ఉంటే మంచిది. హార్దిక్ పాండ్య నాలుగో సీమర్‌గా పనికొస్తాడు. ఆరంభ, డెత్ ఓవర్లలో షమీ బంతితో మాయ చేయగలడు. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడు." అని గంభీర్ స్పష్టం చేశాడు.

దినేశ్ కార్తీక్‌కు బదులు రిషభ్ పంత్‌ను ఎంచుకున్నాడు గంభీర్. " బ్యాటర్‌ కేవలం 10 బంతులు ఆడేందుకు మాత్రమే తీసుకోకూడదు. ఎక్కువ సేపు ఆడే బ్యాటర్‌ను తీసుకోవాలి. కార్తిక్ ఆ పాత్ర పోషించలేడని అనుకుంటున్నా. అతడు 3 లేదా 4 ఓవర్లు ఆడటానికి మాత్రమే వస్తాడు. డెత్ ఓవర్లలో భారత్ త్వరగా రెండు వికెట్లు కోల్పోయినట్లయితే హార్దిక్‌ను పంపే బదులు రిషభ్ పంత్ అవసరం అవుతాడు" అని గంభీర్ తెలిపాడు.

గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సూపర్-12 దశలోనే నిష్క్రమించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ సారి పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని టైటిల్ దిశగా ప్రయాణించాలని తహ తహలాడుతోంది.

WhatsApp channel

సంబంధిత కథనం