శరన్నవరాత్రులలో ఆరో రోజున అమ్మవారిని మహాలక్ష్మీ దేవి అలంకారంలో అర్చించుకుంటే ఐశ్వర్యప్రదమని భక్తుల ప్రగాఢ విశ్వాసం అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. కనుక మనందరం కూడా శ్రీ మహాలక్ష్మీ దేవి రూపంలో అమ్మవారిని మనసారా కొలుచుకుందామని చిలకమర్తి తెలిపారు.
శ్రీ మహాలక్ష్మీదేవి ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా చతుర్భుజాలతో ఒక హస్తం అభయముద్రతో, రెండు హస్తాలలో కమలాలతో, ఒక హస్తంతో కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాస్తూ ఉంటారు. మనం కూడా ఆ దివ్యమంగళ స్వరూపాన్ని హృదయంలో స్థాపించుకుని అర్చించుకుందామని చిలకమర్తి చెప్పారు. భక్తులను గజలక్ష్మి రూపేణ పాలిస్తుంది. శ్రీ మహాలక్ష్మీ అవతారంలో అమ్మవారిని ఎర్ర కమలాలతో కొలిస్తే సర్వశ్రేష్టం అని చిలకమర్తి తెలిపారు. శ్రీ మహా కాళి మహాలక్ష్మీ మహా సరస్వతులలో ఈమె మధ్య శక్తి.
అయిన శ్రీ మహాలక్ష్మీ తన భక్తులను ఎన్నడూ నిరాశపరచదు. సర్వమంగళాలను, అష్టశ్వర్యాలను ప్రసాదిస్తుంది. 'యాదేవి సర్వ భూతేషు లక్ష్మి రూపేణ ణ సంస్థితా' అని స్తుతిస్తూ ఎర్రని పుష్పాలతో శ్రీ మహాలక్ష్మీ దేవిని శ్రీ సూక్తసహితంగా సకల ఉపచారాలు జరిపించి, అర్చించుకుని, పూర్ణాలు, క్షీరాన్నం, వడపప్పు, పానకం అమ్మవారికి నివేదించుకుందామని చిలకమర్తి తెలిపారు. అమ్మవారికి పూజలు చేస్తే భక్తులకు దేనికీ కొదవ ఉండదు. అష్టలక్ష్మీ స్తోత్రం, కనకధారా స్తోత్రం పారాయణం చేసుకుంటే ఎంతో శుభప్రదం అని ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి తెలిపారు. ఈరోజున గులాబీ వర్ణం ధరిస్తే మంచిదని చెప్పారు.