2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఏన్డీఏను ఐక్యంగా, సమర్ధవంతంగా ఎదుర్కోవడం కోసం విపక్ష పార్టీలు ఏర్పాటు చేసుకున్న కూటమి పేరును ‘ఇండియా’ గా నిర్ధారించినట్లు సమాచారం. ‘ఇండియా (INDIA)’ అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్ క్లూజివ్ అలయన్స్ (Indian National Democratic Inclusive Alliance).
కాంగ్రెస్ నాయకత్వంలో 2004 లో యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్ ఏర్పడింది. ఈ కూటమి రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. తాజాగా, అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేను ఎదుర్కోవడం కోసం రూపు దిద్దుకుంటున్న విపక్ష కూటమికి ఇండియా (INDIA) అనే పేరు పెట్టినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ‘ఇండియా (INDIA)’ అంటే ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్ క్లూజివ్ అలయన్స్ (Indian National Democratic Inclusive Alliance). అయితే, ఈ పేరుకు సమావేశంలో ఇంకా ఆమోదం లభించలేదని, అయితే, చాలా భాగస్వామ్య పార్టీలు ఈ పేరును అంగీకరించాయని సమాచారం. బెంగళూరులో జరుగుతున్న విపక్షాల సమావేశంలోదేశ వ్యాప్తంగా ఉన్న 26 పార్టీలు పాల్గొంటున్నాయి. కూటమికి కొత్త పేరుతో పాటు, స్థూలంగా కూటమి విధి విధానాలను కూడా ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు.
‘విపక్ష కూటమి భారత్ ను ప్రతిబింబిస్తుంది. అందుకే ఇండియా అనే పేరు కూటమికి సరిగ్గా సరిపోతుంది. ఈ పేరు కూడా బీజేపీ ని బాధ పెడుతుంది’ అని ఆర్జేడీ ఒక ట్విటర్ పోస్ట్ లో పేర్కొంది. అయితే, కాసేపటికి ఆ ట్వీట్ ను డిలీట్ చేసింది. ‘‘2024 ఎన్నికలు టీమ్ ఇండియా కు టీమ్ ఎన్డీయే మధ్య జరగబోతున్నాయి’’ అని శివసేన ఉద్ధవ్ వర్గం నేత ప్రియాంక చతుర్వేది వ్యాఖ్యానించారు. దానికి స్పందనగా చక్ దే ఇండియా (Chak De! INDIA,) అంటూ టీఎంసీ ఎంపీ డెరెక్ ఓ బ్రీన్ ట్వీట్ చేశారు. ‘ఇండియా గెలవబోతోంది’ అని లోక్ సభ ఎంపీ మానికం టాగోర్ ట్వీట్ చేశారు.