Sidhu Moose Wala | ‘సిద్ధూ’ మరణంతో పంజాబ్​ రాజకీయాల్లో ప్రకంపనలు.. -punjab dgp calls sidhu moose wala s murder a result of inter gang rivalry ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sidhu Moose Wala | ‘సిద్ధూ’ మరణంతో పంజాబ్​ రాజకీయాల్లో ప్రకంపనలు..

Sidhu Moose Wala | ‘సిద్ధూ’ మరణంతో పంజాబ్​ రాజకీయాల్లో ప్రకంపనలు..

HT Telugu Desk HT Telugu
May 29, 2022 10:04 PM IST

Sidhu Moose Wala | సిద్ధూ మూసేవాలా దారుణ హత్యతో పంజాబ్​ ఉలిక్కిపడింది. ఈ ఘటనతో ప్రభుత్వంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

సిద్ధూ మూసేవాలా
సిద్ధూ మూసేవాలా (ANI)

Sidhu Moose Wala | ప్రముఖ సింగర్​ సిద్ధూ మూసేవాలాను దుండగులు కాల్చి చంపిన ఘటన పంజాబ్​లో తీవ్ర కలకలం సృష్టించింది. పంజాబ్​ ప్రభుత్వం.. అనేకమందికి భద్రతను తొలగిస్తున్న నేపథ్యంలో సిద్ధూ మరణ వార్త తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ఈ క్రమంలోనే ఆప్​ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పంజాబ్​లో శాంతిభద్రతలు కుప్పకూలినట్టు ఆరోపించారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​. నేరస్థులు.. చట్టాలకు భయపడే పరిస్థితులు రాష్ట్రంలో లేవని అన్నారు. సీఎం భగవంత్​ మన్​ ప్రభుత్వం విఫలమైందని, వారి పాలనలో పంజాబ్​లో ఎవరికి భద్రత లేదని మండిపడ్డారు.

"సిద్ధూ దారుణ హత్యకు గురైన ఘటన షాక్​గా ఉంది. అతని కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకూలాయి. నేరస్థులు భయపడటం లేదు," అని అమరీందర్​ సింగ్​ ట్వీట్​ చేశారు.

పంజాబ్​ మాజీ డిప్యూటీ సీఎం సుఖ్​జిందర్​ సింగ్​ సైతం ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 'పంజాబ్​ డీజీపీని అరెస్ట్​ చేయాలి. ఈ వ్యవహారంలో కేంద్రం తక్షణమే స్పందించాలి. ఇది శాంతిభద్రతలకు సంబంధించిన విషయం,' అని అన్నారు.

గ్యాంగ్​స్టర్​ పనేనా?

పంజాబీ సింగర్​ సిద్ధూ మూసేవాలా.. ఆదివారం జరిగిన కాల్పుల్లో దుర్మరణం చెందారు. మాన్స జిల్లాలోని జవాహర్కే గ్రామంలో ఈ ఘటన జరిగింది. 424మందికి పంజాబ్​ పోలీసులు.. భద్రతను ఉపసంహరించిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం సర్వత్రా ఆందోళనకరంగా మారింది.

Sidhu Moose Wala death | సిద్ధూ ప్రయాణిస్తున్న వాహనంపై దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. రక్తపు మడుగులో పడి ఉన్న సింగర్​ని తక్షణమే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా గాయపడినట్టు సమాచారం.

కాగా.. ఈ ఘటనపై పంజాబ్​ పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. గ్యాంగ్​స్టర్ల కక్షల్లో భాగంగానే ఈ హత్య జరిగిందని అనుమానిస్తున్నట్టు పంజాబ్​ డీజీపీ వీకే భార్వా వెల్లడించారు. లారెన్స్​ బిష్ణోయి బృందం, కెనడాకు చెందిన సింగర్​ గోల్డి బ్రార్​.. సిద్ధూ హత్యలో కీలకం వ్యవహరించినట్టు తెలుస్తోందని అన్నారు.

ఆదివారం సాయంత్రం 5:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు వెల్లడించారు. కాగా.. సిద్ధూకు శనివారం వరకు నలుగురు భద్రతా సిబ్బంది ఉండేవారని.. వారిలో ఇద్దరిని తగ్గించినట్టు అంగీకరించారు. కానీ ఘటన జరిగినప్పుడు.. ఇద్దరు బాడీగార్డులను తన వెంటనే తీసుకెళ్లేందుకు సిద్ధూ నిరాకరించారని పేర్కొన్నారు. బుల్లెట్​ ప్రూఫ్​ కారును కూడా తీసుకెళ్లలేదని స్పష్టం చేశారు.

రెండు కార్లు.. సిద్ధూ వాహనాన్ని అడ్డగించి, 30రౌండ్లకుపైగా బుల్లెట్ల వర్షాన్ని కురిపించినట్టు సమాచారం.

'ఎవరిని విడిచిపెట్టము..'

Sidhu Moose Wala latest news | సిద్ధూ మూసేవాలా దారుణ హత్యపై పంజాబ్​ సీఎం భగవంత్​ మన్​ స్పందించారు. ఘటనతో తాను షాక్​కు గురైనట్టు వెల్లడించారు. ఘటనకు బాధ్యులను ఎవరిని విడిచిపెట్టమని హామీనిచ్చారు. అందరు శాంతిగా ఉండాలని పిలుపునిచ్చారు.

ప్రముఖుల నివాళి..

2022 పంజాబ్​ ఎన్నికల్లో.. కాంగ్రెస్​ టికెట్​ మీద మాన్స నియోజకవర్గం నుంచి పోటీ చేశారు సిద్ధూ. కానీ ఆప్​ అభ్యర్థి విజయ్​ సింగ్లా చేతిలో దారుణంగా ఓడిపోయారు.

సిద్ధూ పూర్తిపేరు.. సుభ్​దీప్​ సింగ్​ సిద్ధూ. 1993 జూన్​ 17న.. మూసేవాలా గ్రామంలో ఆయన జన్మించారు. తన పాటలు, ర్యాప్​లతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.

సిద్ధూకు అనేకమంది నివాళులర్పించారు. కాంగ్రెస్​ నేతలు సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని పలువురు బీజేపీ నేతలు ప్రార్థించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్