Crime | దుండగుల కాల్పుల్లో ప్రముఖ సింగర్ దుర్మరణం
పంజాబ్లోని మాన్స జిల్లాలో ప్రముఖ సింగర్ సిద్ధూపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన మరణించారు.
Sidhu Moose Wala | పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా.. ఆదివారం జరిగిన కాల్పుల్లో దుర్మరణం చెందారు. మాన్స జిల్లాలోని జవాహర్కే గ్రామంలో ఈ ఘటన జరిగింది. 424మందికి పంజాబ్ పోలీసులు.. భద్రతను ఉపసంహరించిన మరుసటి రోజే ఈ ఘటన చోటుచేసుకోవడం సర్వత్రా ఆందోళనకరంగా మారింది.
సిద్ధూ ప్రయాణిస్తున్న వాహనంపై దుండగులు బుల్లెట్ల వర్షం కురిపించారు. రక్తపు మడుగులో పడి ఉన్న సింగర్ని తక్షణమే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనలో మరో ఇద్దరు కూడా గాయపడినట్టు సమాచారం.
2022 పంజాబ్ ఎన్నికల్లో.. కాంగ్రెస్ టికెట్ మీద మాన్స నియోజకవర్గం నుంచి పోటీ చేశారు సిద్ధూ. కానీ ఆప్ అభ్యర్థి విజయ్ సింగ్లా చేతిలో దారుణంగా ఓడిపోయారు.
సిద్ధూ పూర్తిపేరు.. సుభ్దీప్ సింగ్ సిద్ధూ. 1993 జూన్ 17న.. మూసేవాల గ్రామంలో ఆయన జన్మించారు. తన పాటలు, ర్యాప్లతో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
కాగా.. ఇటీవలే ఆయన వార్తల్లో నిలిచారు. ఆప్ ప్రభుత్వంపై వివాదాస్పద పాట 'స్కేప్గోట్' పాడి వార్తలకెక్కారు. ఆప్ మద్దతుదారులను దేశద్రోహులుగా ఆ పాటలో అభివర్ణించారు.
భద్రతను ఎందుకు తొలగించారు?
వీఐపీ కల్చర్కు స్వస్తి చెప్పాలన్న కారణంతో 424మందికి భద్రతను తొలగించింది ముఖ్యమంత్రి భగవంత్ మన్ ప్రభుత్వం. వీరిలో పలువురు మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి చరణ్జీత్ సింగ్ కుటుంబసభ్యులు కూడా ఉన్నారు.
అంతకుముందు.. 184మంది మంత్రులు, ఎమ్మెల్యేల భద్రతను తొలగించింది ప్రభుత్వం. దాని కన్నా ముందు 122మంది మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల భద్రతను కూడా తీసిపడేసింది.
సంబంధిత కథనం
టాపిక్