Parliament Budget Sessions: పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు నేటి నుంచే: ప్రతిపక్షాల కీలక అస్త్రాలు ఇవే-parliament budget sessions second leg will begin today check full details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Parliament Budget Sessions Second Leg Will Begin Today Check Full Details

Parliament Budget Sessions: పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు నేటి నుంచే: ప్రతిపక్షాల కీలక అస్త్రాలు ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 13, 2023 08:54 AM IST

Parliament Budget Sessions: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో విడత నేడు మొదలుకానుంది. కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు పలు అంశాలను లేవనెత్తి అధికార బీజేపీని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యాయి.

Budget Session: పార్లమెంటులో ‘అదానీ’పై చర్చ జరగాల్సిందే: విపక్షాల డిమాండ్
Budget Session: పార్లమెంటులో ‘అదానీ’పై చర్చ జరగాల్సిందే: విపక్షాల డిమాండ్ (HT_Photo)

Parliament Budget Sessions: పార్లమెంటు సమావేశాలకు మరోసారి వేళయింది. రెండో విడత బడ్జెట్ సమావేశాలు (Budget Session Second Leg) సోమవారం (మార్చి 13) మొదలుకానున్నాయి. ఈ సమావేశాల్లో కీలకమైన ఆర్థిక బిల్లులను ఆమోదించడమే లక్ష్యమని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు అదానీ గ్రూప్ అవకతవకల ఆరోపణలు (Adani Group Crisis), సీబీఐ, ఈడీతో పాటు కేంద్ర దర్యాప్తు సంస్థల వ్యవహారం సహా మరిన్ని అంశాలపై లోక్‍సభ, రాజ్యసభ వేదికగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు సన్నద్ధమయ్యాయి. తొలి విడతను కుదిపేసిన అదానీ అంశం.. రెండో విడత బడ్జెట్ సమావేశాల్లోనూ కొనసాగే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ ఇటీవల విదేశాల్లో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్లు ఇచ్చే ఛాన్స్ ఉంది. పూర్తి వివరాలు ఇవే.

ట్రెండింగ్ వార్తలు

సీబీఐ, ఈడీ, ఐటీ అంశాలపై..

Parliament Budget Sessions: సీబీఐ, ఈడీలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తున్న ప్రతిపక్షాలు.. రెండో విడత బడ్జెట్ సమావేశాల్లో దీన్ని ప్రధానంగా లేవనెత్తే అవకాశం ఉంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా అరెస్టు, బీఆర్ఎస్ ఎంపీ కవిత విచారణ, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యుల విచారణ సహా చాలా పరిణామాలు జరిగిన నేపథ్యంలో ఈ అంశం కీలకంగా మారే ఛాన్స్ ఉంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను ప్రతిపక్ష నేతలపై బీజేపీ ప్రభుత్వం ఉసిగొలుపుతోందని విపక్షాల ఎంపీలు ఆందోళన చేసే అవకాశం ఉంది. జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు జరిగిన తొలి విడత సమావేశాల్లో కేంద్ర బడ్జెట్, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ మినహా ఇతర ఏ అంశంపై సరైన చర్చ జరగలేదు. రెండో విడతలో సీబీఐ, ఈడీ అంశం.. లోక్‍సభ, రాజ్యసభలను కుదిపేసేలా కనిపిస్తోంది.

అదానీ అంశంపై మళ్లీ..

Parliament Budget Sessions: అదానీ గ్రూప్‍పై వస్తున్న ఆరోపణలను కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు మరోసారి పార్లమెంటులో లేవనెత్తనున్నాయి. మోదీ ప్రభుత్వం సమాధానం చెప్పే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామని కాంగ్రెస్ ప్రధాన నేత రాహుల్ గాంధీ ఇటీవలే చెప్పారు. దీంతో అదానీ అంశంపై రచ్చ కొనసాగేలా కనిపిస్తోంది. అదానీ గ్రూప్‍లో ఆర్థిక అవకతవకలు ఉన్నాయంటూ హిండెన్‍బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడైనప్పటి నుంచి.. మోదీకి, అదానీకి ఉన్న సంబంధం గురించి కాంగ్రెస్ ఆరోపణలు గుప్పిస్తోంది. బడ్జెట్ తొలి విడత సమావేశాలను ఈ అంశమే ఎక్కువగా కుదిపేసింది.

Parliament Budget Sessions: నిరుద్యోగం, ఆర్థిక వృద్ధి మందగమనం, వంట గ్యాస్ ధరల పెంపు, ద్రవ్యోల్బణం సహా మరిన్ని అంశాలపై విపక్షాలకు చెందిన ఎంపీలు.. ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు.

రాహుల్‍పై బీజేపీ

Parliament Budget Sessions: కేంబ్రిడ్జి యూనివర్సిటీ సహా బ్రిటన్‍లో ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా భారత్‍లో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేస్తోందని ఆరోపించారు. అమెరికా జోక్యాన్ని కూడా ప్రస్తావించారు. పెగాసస్ అంశాన్ని మరోసారి లేవనెత్తారు. దీంతో రాహుల్ గాంధీపై బీజేపీ ఆగ్రహంగా ఉంది. పార్లమెంటు వేదికగా బీజేపీ.. రాహుల్ గాంధీ కౌంటర్లు ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ వ్యాఖ్యలపైనే కాంగ్రెస్‍పై ఎదురుదాడికి దిగే అవకాశం కనిపిస్తోంది.

పెండింగ్‍లో 35 బిల్లులు

Parliament Budget Sessions: పార్లమెంటు రెండో విడత బడ్జెట్ సమావేశాలు ఏప్రిల్ 6వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ప్రస్తుతం పార్లమెంటులో 35 బిల్లులు పెండింగ్‍లో ఉన్నాయి. రాజ్యసభలో 26, లోక్‍సభలో 9 పెండింగ్‍లో ఉన్నాయి.

WhatsApp channel