Old Parliament building name: ఇక నుంచి పార్లమెంటు నూతన భవనంలోనే ఉభయ సభల కార్యకలాపాలు జరగనున్నాయి. పార్లమెంటు భవనంలోని సెంట్రల్ హాల్ లో మంగళవారం ఉభయ సభల సంయుక్త సమావేశం జరిగింది. అనంతరం, ర్యాలీగా ఎంపీలు, కూటములవారీగా పాత భవనం నుంచి కొత్త భవనానికి వచ్చారు. బీజేపీ సభ్యులు ప్రధాని మోదీ నాయకత్వంలో పాదయాత్ర చేస్తూ కొత్త భవనానికి వచ్చారు.
ఇప్పటివరకు పార్లమెంటు ఉభయ సభల కార్యకలాపాలు జరిగిన భవనానికి ప్రధాని మోదీ కొత్త పేరు పెట్టారు. ఇకపై ఆ భవనాన్ని సంవిధాన్ సదన్ (Samvidhan Sadan -Constitution House - రాజ్యాంగ భవనం) గా సంబోధించాలని ఆయన సూచించారు. ఈ భవనానికి బ్రిటిష్ ఆర్కిటెక్ట్ లు సర్ ఎడ్విాన్ ల్యూటెన్, హర్బర్ట్ బేకర్ లు రూపకల్పన చేశారు. ఈ భవన నిర్మాణం 1927 లో పూర్తయింది. భారతదేశ చరిత్రలో ఎన్నో మరపురాని ఘట్టాలకు ఈ భవనం వేదికైంది. భారత రాజ్యాంగం ఆమోదం పొందింది ఈ భవనంలోనే. ‘కొత్త భవనంలోకి వెళ్లినంత మాత్రాన ఈ భవనం విశిష్టత తగ్గిపోదు. ఇకపై ఈ భవనాన్ని పాత పార్లమెంటు భవనం అని పిలవకూడదు. ఇక నుంచి ఈ విశిష్ట భవనాన్ని సంవిధాన్ సదన్ (Samvidhan Sadan -Constitution House - రాజ్యాంగ భవనం) గా సంబోధించాలి’’ అని మోదీ పిలుపునిచ్చారు. ఈ భవనాన్ని భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేలా కాపాడుకోవాలన్నారు.