National Herald : నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో ఈడీ సోదాలు
National Herald ED : కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఇటీవలే ఈడీ విచారించిన విషయం తెలిసిందే. తాజాగా.. ఈ కేసులో భాగంగా.. నేషనల్ హెరాల్డ్ కార్యాలయంతో పాటు 12 ప్రాంతాల్లో ఈడీ మంగళవారం సోదాలు నిర్వహించింది!
National Herald ED : నేషనల్ హెరాల్డ్ కేసు దర్యాప్తులో భాగంగా.. ఢిల్లీలోని ఆ సంస్థకు చెందిన కార్యాలయం ‘హెరాల్డ్ హౌజ్’లో ఈడీ మంగళవారం సోదాలు నిర్వహించింది. ఇదే కేసుపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని విచారించిన కొన్ని రోజుల వ్యవధిలో.. ఈడీ ఈ చర్యలు చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నేషనల్ హెరాల్డ్ కార్యాలయంతో పాటు ఏజేఎల్(అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్)కు చెందిన 12 ప్రాంతాల్లో.. ఏకకాలంలో ఈడీ ఈ సోదాలు నిర్వహించినట్టు సమాచారం. సోదాల అనంతరం.. కేసులో భాగంగా.. ఆస్తుల వివరాలను ఈడీ అటాచ్ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
తాజా పరిణామాలపై కాంగ్రెస్ విరుచుకుపడింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలను ప్రస్తావించి.. ప్రభుత్వాన్ని విపక్షాలు ఇరకాటంలో పెడుతున్న వేళ.. ఈడీ జోరుగా పనులు చేస్తోందని మండిపడింది. ప్రజలకు సమాధానం ఇవ్వలేకే.. ఈడీని పంపించి.. నేతలను కేంద్రం బెదిరిస్తోందని ఆరోపించింది.
"కాంగ్రెస్ ఒక్కటే కాదు.. విపక్షాల నేతలు చిత్రహింసలకు గురవుతున్నారు. కాంగ్రెస్పై దాడి చేసేందుకే నేషనల్ హెరాల్డ్ హౌజ్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అధికార పక్షం విద్వేష రాజకీయాలను మేము ఖండిస్తున్నాము. మా గొంతుకను మీరు అణచివేయలేరు," అని కాంగ్రెస్ వెల్లడించింది.
నేషనల్ హెరాల్డ్ కేసులో రెండు నెలలుగా ఈడీ విచారణ జోరుగా సాగుతోంది. జూన్లో.. రాహుల్ గాంధీని దాదాపు 6రోజుల పాటు విచారించింది ఈడీ. ఇక జులైలో.. సోనియా గాంధీని రెండుసార్లు విచారించింది. ఇప్పుడు హెరాల్డ్ కార్యాలయంలో సోదాలు చేసింది.
అసలు నేషనల్ హెరాల్డ్ కేసు ఏంటి? గాంధీలను అరెస్ట్ చేస్తారా? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం