Delhi Sultanpuri Accident: వారిని ఉరి తీయాలి: సీఎం కేజ్రీవాల్
Delhi Sultanpuri Accident: సుల్తాన్పురి యాక్సిడెంట్ ఘటనపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. దోషులకు మరణ శిక్ష విధించాలంటూ డిమాండ్ చేశారు. పూర్తి వివరాలివే..
Delhi Sultanpuri Accident: ఓ యువతిని ఢీకొట్టిన కారు అత్యంత వేగంతో కిలోమీటర్ల పాటు ఆమెను లాక్కెళ్లింది. ఈ ఘటనలో 20 ఏళ్ల ఆ యువతి తీవ్ర గాయాలపాలై మృతి చెందారు. కారులోని వారు మద్యం సేవించి ఇష్టారాజ్యంగా నడపటంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కొత్త సంవత్సరం తొలి రోజున దేశ రాజధాని ఢిల్లీలోని సుల్తాన్పురి - కంఝావలా మధ్య జరిగిన ఈ ఘటన (Sultanpuri - Kanjhawala Accident) హృదయాలను కలచివేసింది. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. సోమవారం (జనవరి 2) స్పందించారు. ఆ యువతి చావుకు కారణమైన ఆ నిందితులకు ఉరిశిక్ష పడాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా కారును నడిపిన వారికి మరణ శిక్షే సమంజసమని అభిప్రాయపడ్డారు. ఈ ఘటన ఎలా జరిగిందంటే..
ఎవరైనా శిక్ష పడాల్సిందే..
ఆ యువతి మరణానికి కారణమైన నిందితులు ఎవరైనా సరే శిక్ష పడాల్సిందేనని సీఎం కేజ్రీవాల్ అన్నారు. “కంఝావలాలో మన సోదరికి జరిగిన ఘటన చాలా సిగ్గుచేటు. దోషులకు కఠిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నాను” అని కేజ్రీవాల్ హిందీలో ట్వీట్ చేశారు. అనంతరం ఓ మీడియా సమావేశంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. “ఇది ఎవరి కూతురికైనా జరగొచ్చు. నిందితులు ఎంత పలుకుబడి ఉన్న వారైనా, రాజకీయాలతో సంబంధం ఉన్న వారైనా సరే.. వారికి ఉరి శిక్ష పడాలి” అని కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఈ అమానవీయ ఘటన తనను ఎంతో కలచి వేస్తోందని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్య తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించారు.
ప్రజల ఆందోళన
కారు కిలోమీటర్ల పాటు ఈడ్చుకెళ్లడం వల్ల యువతి మృతి చెందిన ఈ ఘటనపై ఢిల్లీ ప్రజలు ఆందోళన నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ భారీ సంఖ్యలో జనాలు సుల్తాన్పురి పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు.
అసలేం జరిగిందంటే..!
Delhi Sultanpuri - Kanjhawala Accident: ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీలోని సుల్తాన్పురి ప్రాంతంలో స్కూటీని వేగంగా వస్తున్న ఓ కారు ఢీకొట్టింది. దీంతో స్కూటీపై నుంచి కింద పడిన యువతి కారు కింది భాగంలో చిక్కుకుంది. అయినా కారును వేగంగానే నడిపారు నిందితులు. కిలోమీటర్ల పాటు ఆ కారు ఆ యువతిని లాక్కెళ్లింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. శరీర భాగాలు ఛిద్రమయ్యాయి. తీవ్ర గాయపాలైన ఆమె మృతి చెందారు. కంఝావలా ప్రాంతంలో ఆ యువతి మృత దేహం పడింది. నిందితులు మద్యం సేవించి కారును నడిపినట్టు తెలుస్తోంది. ఈ ఘటన సీసీ టీవీ కెమెరాల్లోనూ రికార్డ్ అయింది. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అయితే, ఆ యువతిపై లైంగిక వేధింపులు చేశారని ఆమె కుటుంబం అనుమానం వ్యక్తం చేస్తోంది. “ఇది రోడ్డు ప్రమాదం కాదు. నా కూతురు శరీరంపై దుస్తులు లేవు. ఇది ఎలాంటి ప్రమాదం. ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ జరగాలని మేం కోరుతున్నాం” అని మృతురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ విషయంపై ఢిల్లీ పోలీసులకు సమన్లు జారీ చేసింది. నిజాలను నిగ్గు తేల్చాలని సూచించింది.