Indian student shot dead in USA : అమెరికాలో మరో భారత విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు! ఓహాయోలోని ఓ కారులో జరిగిన కాల్పుల ఘటనలో.. 26ఏళ్ల ఆదిత్య అద్లాఖా మృతిచెందాడు.
దిల్లీకి చెందిన ఆదిత్య.. వైద్య విద్య కోసం కొన్నేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్ సిస్సినాటీ మెడికల్ స్కూల్లోని మాలిక్యులర్ అండ్ డెవలప్మెంటల్ బయోలాజీ ప్రోగ్రామ్లో 4వ ఏడాది చదువుకుంటున్నాడు.
కాగా.. ఈ నెల 9న.. వెస్టెర్న్ హిల్స్ వయ్డక్ట్ ప్రాంతంలో ఉదయం 6 గంటల 20 నిమిషాలకు కాల్పుల శబ్దాలు వినిపించాయి. ఘటనస్థలానికి వెళ్లిన పోలీసులు.. క్రాష్ అయిన ఉన్న ఓ కారును చూశారు. అందులో ఆదిత్యను గుర్తించారు. అతనిపై కాల్పులు జరిగినట్టు తెలుసుకున్నారు. కానీ అతను ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్టు గుర్తించిన పోలీసులు.. ఆదిత్యను వెంటనే యూసీ మెడికల్ సెంటర్కు తీసుకెళ్లారు. రెండు రోజుల పాటు ఐసీయూలో ఉన్న ఆదిత్య.. ఆ తర్వాత ప్రాణాలు విడిచాడు.
Aaditya Adlakha USA : దర్యాప్తులో భాగంగా పోలీసులు కొన్ని విషయాలను వెల్లడించారు. ఆదిత్య డ్రైవ్ చేస్తున్న వెహికిల్పై దుండగులు అనేకమార్లు దాడి చేశారని చెప్పారు. డ్రైవింగ్ సీటువైపు ఉన్న విండోపై 3 బుల్లెట్ హోల్స్ని గుర్తించినట్టు తెలిపారు.
కాగా.. ఆదిత్యపై కాల్పులు జరిపింది ఎవరు? ఎందుకు ఈ పని చేశారు? అన్న వివరాలు తెలియరాలేదు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసుల వెల్లడించారు.
ఆదిత్య.. దిల్లీలోని రామ్జాస్ కాలేజ్ ఆఫ్ యూనివర్సిటీ నుంచి 2018లో జియోలాజీలో డిగ్రీ పొందాడు. 2020లో ఎయిమ్స్ నుంచి మాస్టర్స్ పూర్తి చేశాడు. పై చదువుల కోసం అమెరికాకు వెళ్లి, ఇలా ప్రాణాలు కోల్పోయాడు.
Indian student shot dead : ఈ ఘటనపై ఆదిత్య ప్రస్తుతం చదువుకుంటున్న వర్సిటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించింది.
"ఆదిత్య చాలా మంచి మనిషి. ఇంటెలిజెంట్ అండ్ షార్ప్. అతని ఆకస్మిక మరణం బాధకలిగించింది. అతని మరణంపై వర్సిటీ విద్యార్థులు దిగ్భ్రాంతిలో ఉన్నారు." అని వర్సిటీ డీన్ ఆండ్రూ ఫెలక్ తెలిపారు.
Indian student killed in USA : అమెరికాలో గన్ కల్చర్ అత్యంత ఆందోళనకరంగా మారింది. కాల్పుల ఘటనలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా.. దుండగుల కాల్పులో ప్రాణాలు విడుస్తున్న భారత విద్యార్థుల సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. అక్కడి పరిస్థితుల నేపథ్యంలో, అమెరికాలో తమ బిడ్డల కోసం ఇండియాలో ఉంటున్న తల్లిదండ్రులు భయపడిపోతున్నారు.
సంబంధిత కథనం