Jacqueline Fernandez ED case: మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్
Jacqueline Fernandez ED case: మనీ లాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరును చేర్చనున్నట్టు ఈడీ నిర్ణయించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 17: కోట్లాది రూపాయల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను నిందితురాలిగా చేర్చాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం నిర్ణయం తీసుకుంది.
బుధవారం ఢిల్లీలోని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్ఎ) ప్రత్యేక కోర్టు ముందు ఈడీ ఈ కేసులో తాజా (సప్లిమెంటరీ) ఛార్జ్ షీట్ దాఖలు చేస్తుందని భావిస్తున్నారు.
ఈ కేసులో 36 ఏళ్ల జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చాలాసార్లు ప్రశ్నించింది. శ్రీలంక జాతీయురాలైన ఈ నటి 2009లో హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది.
ఏప్రిల్లో మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు చెందిన రూ. 7.27 కోట్ల నిధులను తాత్కాలికంగా అటాచ్ చేసింది. ఈ నిధులను ‘క్రైమ్ ప్రొసీడ్స్’గా ఈడీ పేర్కొంది.
‘సుకేష్ చంద్రశేఖర్ దోపిడీతో సహా నేర కార్యకలాపాల ద్వారా సంపాదించిన సొమ్ము నుంచి జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు రూ. 5.71 కోట్ల విలువైన వివిధ బహుమతులు ఇచ్చాడు. చంద్రశేఖర్ తన చిరకాల సహచరురాలు, ఈ కేసులో సహ నిందితురాలిగా ఉన్న పింకీ ఇరానీని ఆమెకు ఈ బహుమతులను అందజేయడానికి పెట్టాడు’ అని ఈడీ వెల్లడించింది.
‘ఈ బహుమతులతో పాటు, చంద్రశేఖర్ ఫెర్నాండెజ్ సన్నిహిత కుటుంబ సభ్యులకు 1,72,913 యూఎస్ డాలర్లు (ప్రస్తుత మారకం రేటు ప్రకారం సుమారు రూ. 1.3 కోట్లు), 26740 ఆస్ట్రేలియన్ డాలర్లు (సుమారు రూ. 14 లక్షలు) కూడా అందించాడు. అంతర్జాతీయ హవాలా ఆపరేటర్ అయిన అవతార్ సింగ్ కొచ్చర్ అనే సహ నిందితుడి ద్వారా సమకూర్చాడు..’ అని ఈడీ తెలిపింది.
వెబ్ సిరీస్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ రాసేందుకు అడ్వాన్స్గా ఫెర్నాండెజ్ తరపున స్క్రిప్ట్ రైటర్కు రూ. 15 లక్షల నగదును చంద్రశేఖర్ డెలివరీ చేసినట్లు తమ దర్యాప్తులో తేలిందని ఏజెన్సీ తెలిపింది.
ఫోర్టిస్ హెల్త్కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదితి సింగ్తో సహా ఉన్నత స్థాయి వ్యక్తులను మోసం చేయడం ద్వారా చంద్రశేఖర్ అక్రమంగా సంపాదించి ఫెర్నాండెజ్కు బహుమతులు కొనుగోలు చేయడానికి ఉపయోగించాడని ఈడీ ఆరోపించింది.
కేంద్ర హోం సెక్రటరీగా, లా సెక్రటరీగా చంద్రశేఖర్ ఫోన్లో నటించి అదితి సింగ్తో పాటు ఆమె సోదరిని బెదిరించినట్టు ఆరోపణలు వచ్చాయి.