IND vs SA 3rd Odi Sanju Samson: సౌతాఫ్రికాతో జరుగుతోన్న నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా భారీ స్కోరు చేసింది. సంజూ శాంసన్తో పాటు తిలక్ వర్మ రాణించడంతో యాభై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. సంజూ శాంసన్ సెంచరీ చేయగా, తిలక్ వర్మ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సౌతాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ టీమ్ ఇండియాకు బ్యాటింగ్ అప్పగించాడు.
ఈ మ్యాచ్తోనే వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చిన రజత్ పాటిదర్తో (22 రన్స్) పాటు మరో ఓపెనర్ సాయిసుదర్శన్ (10 పరుగులు) తొందరగా ఔటై నిరాశపరిచారు. కెప్టెన్ రాహుల్ కూడా 21 పరుగులకే పెవిలియన్ చేరుకున్నాడు. సంజూ శాంసన్తో కలిసి తిలక్ వర్మ టీమ్ ఇండియాను ఆదుకున్నారు. ఈ క్రమంలో 66 బాల్స్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు సంజూ శాంసన్. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన అతడు హాఫ్ సెంచరీ తర్వాత దూకుడు పెంచాడు.
114 బాల్స్లో మూడు సిక్సర్లు, ఆరు ఫోర్లతో 108 రన్స్ చేసి ఔటయ్యాడు తిలక్ వర్మ 77 బాల్స్లో ఐదు ఫోర్లు, ఒక సిక్సర్తో 52 రన్స్ చేశాడు. వన్డేల్లో సంజూ శాంసన్కు ఇదే తొలి సెంచరీ కాగా...తిలక్ వర్మకు ఇదే ఫస్ట్ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం.
చివరలో రింకు సింగ్ 27 బాల్స్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 38 పరుగులు చేయడంతో టీమిండియా 296 రన్స్ చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో హెండ్రిక్స్ మూడు, బర్గర్ రెండు వికెట్లు తీసుకున్నారు. మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో టీమిండియా, సౌతాఫ్రికా 1-1 తో సమంగా ఉన్నాయి.