TRS MLC Kavitha : నీళ్లు కాదు నిప్పులొస్తాయన్న ఎమ్మెల్సీ కవిత
TRS MLC Kavitha ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో సిబిఐ నోటీసులు, విచారణ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఆదివారం సిబిఐ అధికారుల సుదీర్ఘ విచారణ తర్వాత కవిత నోరు విప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. తెలంగాణ ఆడపిల్లల కళ్ల నుంచి నీళ్లు రావు.. నిప్పులు వస్తాయన్నారు. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు ముందుకు వెళ్లాలి. తెలంగాణ ఉద్యమం తరహాలో కొత్త ఉద్యమాన్ని ప్రారంభిద్దామని తెలంగాణ జాగృతి కార్యకర్తలకు కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో ముషీరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కవిత పాల్గొని ప్రసంగించారు.
TRS MLC Kavitha దేశంలో కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఏజెన్సీలతో దాడులు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా దాడులు చేస్తున్నారని దాడులకు భయపడేదన్నారు. విచారణ పేరుతో సమయాన్ని వృధా చేస్తున్నారని మనకు మిగిలిన సమయంలో డబుల్, ట్రిపుల్ పని చేయాలని, ఎక్కడా వెనక్కి తగ్గొద్దన్నారు.
ప్రజల శక్తి, వారి ప్రేమ ఏంటో తెలిసిన వాళ్ళు తెలంగాణ ప్రజలని, ప్రజలను ఒక శక్తిగా మలిచినటువంటి వాళ్లమని ప్రతి చోట జాగృతి కార్యక్రమాలను అమలు చేయాలన్నారు. రెస్ట్ తీసుకునేది లేదని, రిలాక్స్ అయ్యేది లేదన్నారు. అన్ని రంగాల్లో సుస్థిర స్థానాల్లో ఉన్న దేశం అనేక ఇండెక్సుల్లో కిందకు పడిపోయిందన్నారు. ఇటువంటి దుస్థితిని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని, ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉందని, ఈ లోపు తెలంగాణ సత్తా చూపిద్దామన్నారు.
తెలంగాణ భాష, పండుగల మీద జరుగుతున్న వివక్షను ఉద్యమంలో భాగంగా ప్రజలకు వివరించామని, ఆనాడు బతుకమ్మ ఎత్తుకోవాలంటే సిగ్గుపడేవారని, ఇప్పుడు బతుకమ్మ పండుగ అంటే సంతోషంగా జరుపుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ సంబరాల్లో అనేక మంది యువకులు, కళాకారులు పాల్గొంటున్నారని, స్కూల్ పాఠ్యాంశాల్లో బతుకమ్మ చేరిందన్నారు. సంస్కృతి, సంప్రదాయాలకు చోటు లభించింని రాష్ట్రం సాధించిన తర్వాత తెలంగాణ ఆకాంక్షలు నెరవేర్చుకున్నామని కవిత చెప్పారు.
యువతీయువకులు ఈ దేశం గురించి ఆలోచించాలి అని కవిత సూచించారు. తెలంగాణ కోసం గొంతెత్తి మన హక్కుగా అడిగామని దేశంలో నేడు ఎలాంటి పరిస్థితి ఉందనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. హక్కులను కోల్పోతున్నామన్న విషయం తెలియకుండా ఉన్నారని. మేధావులు మాట్లాడటం మానేశారని కవులు గళమెత్తడం మానేశారని రచయితలు పుస్తకాలు రాయడం మానేశారని,.అందరూ నిరాశ నిస్పృహల్లో ఉన్నారని, కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రచయితలు తమకు వచ్చిన అవార్డులను కేంద్రానికి విసిరికొట్టారని గుర్తు చేశారు.
తెలంగాణ జాగృతి నుంచి ప్రతి రాష్ట్రానికి వెళ్లి దేశ వ్యాప్తంగా అనేక అంశాలపట్ల జాగృతం చేయాల్సిన సందర్భం వచ్చిందన్నారు. ఆ అవసరం కనబడుతుందన్నారు. ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ ప్రభుత్వం కూల్చేస్తుంటే, పెద్ద పెద్ద పత్రికలు ప్రజలను తప్పుదోవ పట్టించే వార్తా కథనాలు రాస్తున్నాయని, ప్రజాస్వామ్యాన్ని కేంద్రం అపహాస్యం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో చేసిందే దేశంలో చేయాలని ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడినప్పుడే ఆ వ్యవస్థ మనల్ని కాపాడుకుంటుందన్నారు. కేంద్రం తప్పులను దేశ ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉందని, బీజేపీ తప్పులను ఎత్తి చూపితే దాడులు చేస్తున్నారని, మీడియాను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని ప్రజలకు నష్టం కలిగించే విధంగా కేంద్రం వ్యవహరిస్తోందని కవిత మండిపడ్డారు.
ప్రజాసమూహాన్ని చైతన్య పరచాలంటే భావజాల వ్యాప్తి అవసరం అని కవిత అన్నారు. సమీకరించు, బోధించు, పోరాడు అని అంబేద్కర్ చెప్పారు. ఇదే సిద్ధాంతాన్ని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమం సందర్భంలో అనేకసార్లు చెప్పారు. ఇవాళ ఆలోచించాల్సిన సమయం, సందర్భం వచ్చిందన్నారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాలను ఎదురించాలని. తెలంగాణ చైతన్యాన్ని దేశ వ్యాప్తంగా రగిలించాలన్నారు. ఆ శక్తి, సత్తా తెలంగాణ జాగృతికి ఉందని, దేశ వ్యాప్తంగా తెలంగాణ కార్యాచరణను అమలు చేయాలన్నారు.
దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి కవులను, కళాకారులను, రచయితలను, విద్యార్థులను, మహిళలను ఏకం చేస్తాం, రైతులు, కార్మికులతో మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో చర్చలు పెడుతామన్నారు. అలాంటి చారిత్రాత్మక అవసరం ఉందన్నారు. తెలంగాణ జాగృతి ఒక ప్రబలమైన శక్తిగా ఉందని ప్రతి గ్రామంలో కార్యకర్తలు, నాయకులు ఉన్నారని ప్రపంచంలో 18 దేశాల్లో కమిటీలు పని చేస్తున్నాయని గుర్తు చేశారు.