Kapu Reservations: ఇతరమార్గాల్లో కాపు రిజర్వేషన్లకు ప్రయత్నించాలని హైకోర్టు సూచన
Kapu Reservations: ఆంధ్రప్రదేశ్లో కాపు రిజర్వేషన్ల వ్యవహారంలో కోర్టులో వ్యాజ్యాలు దాఖలు చేయడం కంటే ఇతర మార్గాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం మేలని హైకోర్టు సూచించింది. కోర్టు వివాదాలతో జాప్యం జరగొచ్చని అభిప్రాయ పడింది.
Kapu Reservations: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేటాయించిన 10% కోటాలో కాపులకు 5% రిజర్వేషన్ అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ తరహా వ్యాజ్యాలను ఉపసంహ రించుకుని, ఇతర మార్గాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిటిషనర్లకు సూచించింది.
రిజర్వేషన్ల అమలు సున్నితమైన వ్యవహారమని, కోర్టులో వ్యాజ్యాలు పెండింగ్లో ఉన్నాయనే కారణంతో మొత్తంగా రిజర్వేషన్ అమలు విషయంలో ప్రభుత్వం ఆలస్యం చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారంలో సరైన సమయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నామని ధర్మాసనం తెలిపింది.
కాపులకు రిజర్వేషన్ అమలు చేయాలని దాఖలైన పిటిషన్లతో పాటు , రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యాల్లో లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ వ్యవహారంలో కౌంటర్దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వేసవి సెలవుల తర్వాత రిజర్వేషన్ అంశంపై విచారణ చేస్తామని ప్రకటించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని,పిటిషనర్లను ఆదేశించింది.
సుప్రీంకోర్టు సమర్థించింది….
ఈడబ్ల్యూఎస్ కోటాలో 10%లో కాపులకు 5% రిజర్వేషన్ అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ కాపు సంక్షేమసేన వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ మంత్రి హరిరామజోగయ్య హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్లో 5% కాపులకు కేటాయిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హయాంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని అమలు చేసేలా ఆదేశించాలని కోరారు. ఈ వ్యవహారంపై మరికొన్ని వ్యాజ్యాలు దాఖలయ్యాయి.
తాజా విచారణలో పిటిషనర్ తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలు వినిపించారు. గత ప్రభుత్వ హయాంలో ఈడబ్ల్యూఎస్లకు ఇచ్చిన 10% రిజర్వేషన్లలో 5 శాతాన్ని కాపులకు కేటాయిస్తూ యాక్ట్ 14/2019ని తీసుకొచ్చారని, కాపులకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ చేసిన చట్టం చెల్లుబాటవుతుందని సుప్రీంకోర్టుకు కూడా సమర్థించిందన్నారు. ఉద్యోగాల భర్తీ, విద్యాసంస్థల ప్రవేశాల్లో కాపులకు రిజర్వేషన్ కల్పించేలా మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు.
ఒకే సామాజికవర్గానికే 5 శాతం ఎలా…
మరోవైపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ఒకే సామాజిక వర్గానికి ఐదు వాతం రిజర్వేషన్లు ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఈడబ్ల్యూఎస్ 10 శాతం కోటాలో ఒక సామాజికవర్గానికే 5 శాతం రిజర్వేషన్ కల్పించడానికి వీల్లేదన్నారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ 14/2019ని సవాలు చేస్తూ 2019లో పిల్ వేశామని చెప్పారు.
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్ వాదనలు కౌంటర్ దాఖలు చేయడానికి సమయం కావాలని కోరారు. ఈ వ్యవహారంలో కీలకాంశాలు ఇమిడి ఉన్నందున లోతైన విచారణ జరపాల్సిన అవసరం ఉందని హైకోర్టు పేర్కొంది. వ్యాజ్యాన్ని వేసవి సెలవుల తర్వాత విచారించడానికి వాయిదా వేసింది.