AP Politics: వేడెక్కుతున్న ఏపీ రాజకీయం.. రంగంలోకి ఫిక్సర్స్‌ నిజమేనా..?-key developments in the viveka murder case efforts to reduce the severity of the case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Politics: వేడెక్కుతున్న ఏపీ రాజకీయం.. రంగంలోకి ఫిక్సర్స్‌ నిజమేనా..?

AP Politics: వేడెక్కుతున్న ఏపీ రాజకీయం.. రంగంలోకి ఫిక్సర్స్‌ నిజమేనా..?

HT Telugu Desk HT Telugu
Apr 17, 2023 12:43 PM IST

AP Politics: నాలుగేళ్లుగా నలుగుతున్న వివేకా హత్య కేసు దర్యాప్తు క్లైమాక్స్‌కు చేరడంతో ఏపీలో రాజకీయంగా వేడి పెరిగింది. కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి తండ్రిని సిబిఐ అరెస్ట్‌ చేయడంతో తర్వాత ఏం జరుగనుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ

AP Politics: వైఎస్ భాస్కర్‌ రెడ్డి అరెస్ట్‌తో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ఆదివారం ఉదయం పులివెందుల భాకరాపురంలో భాస్కర్‌ రెడ్డి అరెస్ట్‌ తర్వాత పరిణామాలు వేగంగా మారిపోయాయి. సోమవారం ముఖ్యమంత్రి అనంతపురం పర్యటనకు వెళ్లాల్సి ఉంది. తాజా పరిణామాలు, సిబిఐ దూకుడుతో ముఖ్యమంత్రి తన పర్యటన రద్దు చేసుకున్నారు. కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి అరెస్ట్‌ అనివార్యమైతే రాజకీయంగా అది వైఎస్సార్సీపీకి ఇబ్బందికరం అవుతుంది.

వివేకా హత్య కేసులో దర్యాప్తు అధికారిని సుప్రీం కోర్టు ఉత్తర్వులతో మార్చడంతో ఊపిరి తీసుకున్న వైసీపీ నాయకులకు ఆ సంతోషం ఎక్కువ రోజులు మిగల్లేదు. వివేకా హత్య కేసు లో అభియోగాలు ఎదుర్కొంటున్న నిందితులు హత్యకు ముందు తర్వాత భాస్కర్‌ రెడ్డి నివాసంలో ఉన్నట్లు సాంకేతిక ఆధారాలను సిబిఐ సేకరించింది. హత్య తర్వాత మృతదేహానికి ఉన్న గాయాలను కడిగేసి కట్లు వేసి గుండెపోటుగా ప్రచారం చేయడం వెనుక కీలక పాత్ర పోషించింది ఎవరనేది దర్యాప్తులో వెల్లడైంది. ఈ పరిణామాలు అన్నింటిలో ఎంపీ అవినాష్ రెడ్డి కుటుంబంపై ఆరోపణలు రావడంతో రాజకీయంగా దుమారం రేగింది.

వివేకా హత్య కేసు దర్యాప్తు ఏకపక్షంగా సాగుతోందని అవినాష్‌ రెడ్డి మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. హత్యకు పాల్పడిన నిందితుల్లో ఒకరి వాంగ్మూలం ఆధారంగా కేసు విచారణ జరుగుతోందని, వివేకా మరో మహిళను వివాహం చేసుకోవడం, ఆస్తుల వ్యవహారం నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని అవినాష్ ఆరోపిస్తున్నారు. వివేకా కుమార్తె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌ రెడ్డి పాత్రను విచారించాలని పలు సందర్బాల్లో పేర్కొన్నారు. తాజాగా హైర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌లో సైతం సునీతకు వివేకా రెండో భార్యకు మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలో హత్య జరిగి ఉంటుందని ఆరోపించారు. వివేకా హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ముందస్తు బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

వివేకా హత్యకు సునీతతో రెండో భార్యకు తలెత్తిన విభేదాలే కారణమని అవినాష్ రెడ్డి ఆరోపించారు. రెండో భార్య షమీమ్‌కు ఆర్ధిక భరోసా కల్పించేందుకు వివేకా నిర్ణయించడం, కుమారుడికి హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్లో అడ్మిషన్ ఇప్పించడం, స్కూల్‌ పరిసర ప్రాంతాల్లో విల్లాను కొని ఆ కుటుంబాన్ని అక్కడకు తరలించడం వంటివి చేయాలని నిర్ణయించుకోవడంతో సునీత కక్ష పెంచుకున్నారని అవినాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆర్ధిక లావాదేవీల నేపథ్యంలోనే హత్య జరిగిందని, అందులో తమ ప్రమేయం ఏమి లేదని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అవినాష్ పేర్కొన్నారు.వివేకా కుమార్తె సిబిఐ, స్థానిక ఎమ్మెల్సీ, ప్రతిపక్ష నాయకుడి సహాయంతో వివేకా హత్య కేసులో తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని అవినాష్ ఆరోపిస్తున్నారు

మైసూరు  నుంచి విజయవాడకు స్పెషల్ ఫ్లైట్ వచ్చినట్లు చూపుతున్న చిత్రం
మైసూరు నుంచి విజయవాడకు స్పెషల్ ఫ్లైట్ వచ్చినట్లు చూపుతున్న చిత్రం

రంగంలోకి ఫిక్సర్లు….?

మరోవైపు వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్‌ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయడంతో సమస్య నుంచి గట్టెక్కడానికి పొలిటికల్ ఫిక్సర్లను ఆశ్రయించారని జోరుగా ప్రచారం జరుగుతోంది. మైసూరు సమీపంలో చామనగిరి ప్రాంతానికి చెందిన బ్లాక్ స్టోన్ కాంట్రాక్టర్‌, ఆస్ట్రాలజర్‌ ఆదివారం ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చినట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

కర్ణాటకలో హై ప్రొఫైల్ ఆస్ట్రాలజర్‌గా గుర్తింపు పొందిన సదరు వ్యక్తిని తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ సహకారంతో విజయవాడ తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. హై ప్రొఫైల్ లాబీయిస్ట్‌‌గా పేరొందిన సదరు వ్యక్తి సహకారంతో ప్రస్తుత పరిణామాల నుంచి గట్టెక్కే ప్రయత్నాలు జరుగుతున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది.

ఏపీకి చెందిన ప్రముఖ కాంట్రాక్టు సంస్థకు చెందిన ఎండి ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. సదరు కాంట్రాక్టరు కుటుంబంలో తలెత్తిన వివాదాల నేపథ్యంలో గతంలో ఉన్న విభేదాలను పక్కన పెట్టి ముఖ్యమైన వారికి దగ్గరైనట్లు చెబుతున్నారు. ఈ కేసు వ్యవహారంలో మున్ముందు తలెత్తే పరిణామాల తీవ్రతతను గణనీయంగా తగ్గించేందుకు లాబీయిస్టుల సహకారంతో ప్రయత్నాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు.

మరోవైపు వివేకా హత్య కేసు నీరుగార్చే క్రమంలో కొంతమంది ప్రత్యేక విమానంలో ఆదివారం ఉదయం విజయవాడకు వచ్చి తిరిగి సాయంత్రం హైదరాబాద్ వెళ్లిపోయారంటూ ఫ్లైట్ రాడార్ చిత్రాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

IPL_Entry_Point