Food Delivery On Horse : పెట్రోల్ కష్టాలు...! హైదరాబాద్ లో గుర్రంపై పుడ్ డెలివరీ - వీడియో వైరల్
03 January 2024, 10:24 IST
- Food Delivery On Horse in Hyderabad: ట్యాంకర్లు చేపట్టిన సమ్మె కారణంగా హైదరాబాద్ తో పాటు చాలా నగరాల్లో పెట్రోల్ కష్టాలు తలెత్తాయి. అయితే పెట్రోల్ దొరకకపోవడంతో జొమాటో డెలివరీ బాయ్ ఏకంగా గుర్రంపై ఫుడ్ డెలివరీ చేయటం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ దృశ్యాలు తెగ వైరల్ అవుతున్నాయి.
గుర్రంపై పుడ్ డెలివరీ
Food Delivery On Horse in Hyderabad: హిట్ అండ్ రన్ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా మంగళవారం పెట్రోల్, ఆయిల్ ట్యాంకర్ల డ్రైవర్లు సమ్మెకి దిగారు. దీంతో చాలా నగరాల్లో పెట్రోల్, డీజిల్ కష్టాలు తలెత్తాయి. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనమిచ్చాయి. ఒకేసారి పెద్ద ఎత్తున వాహనదారులు బంకులకు రావటంతో… కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. చాలా బంకుల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే ఓ పుడ్ డెలివరీ బాయ్ చేసిన పని అందరి దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతన్నాయి.
గుర్రంపై పుడ్ డెలివరీ….
ట్రకులు, ట్యాంకర్లు చేపట్టిన ధర్నా కారణంగా హైదరాబాద్ నగరంలో మంగళవారం భారీగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ఈ ప్రభావం ఫుడ్ డెలివరీ చేసే బాయ్స్ పై పడింది. ఈ క్రమంలో ఓ యువకుడు వెరైటీగా ఆలోచన చేసి…. అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు. ఏకంగా గుర్రంపై స్వారీ చేస్తూ… పుడ్ డెలివరీ చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు… హైదరాబాద్ లోని చంచల్ గూడ జైలు వద్ద దర్శనమిచ్చాయి. ఫుడ్ ఆర్డర్ ను డెలివరీ చేయడానికి వెళ్తున్నప్పుడు కొందరు వ్యక్తులు వీడియో తీశారు. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెట్రోల్ కోసం 3 గంటలు వేచి చూశానని… కానీ అందుబాటులో లేకపోవడంతో బైక్ ను బయటికి తీయలేకపోయానని చెప్పారు. ఫుడ్ డెలివరీ చేయడానికి గుర్రాన్ని రోడ్డు మీదికి తేవాల్సి వచ్చిందని అతను చెప్పుకొచ్చాడు.
ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు… డెలివరీ బాయ్ పై తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు నీది ఏం ఐడియా గురు అంటూ కామెంట్స్ చేశారు. "మన హైదరాబాదీతో అట్లా ఉంటది మరీ' అంటూ మరో నెటిజన్ రాసుకొచ్చాడు.
డ్రైవర్ల ఆందోళన విరమణ
మరోవైపు ట్రాన్స్పోర్ట్ సంఘాల సమ్మెపై కేంద్రం చర్చలు జరిపింది. ఆలిండియా మోటార్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఏఐఎంటీసీ) జరిపిన చర్చలు ఎట్టకేలకు మంగళవారం రాత్రి కొలిక్కి వచ్చాయి. కొత్త చట్టాన్ని ఇప్పటికిప్పుడే అమలు చేయడం లేదని కేంద్రం తరఫున హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ట్రాన్స్పోర్ట్ సంఘాలకు హామీ ఇచ్చారు.
ఏఐఎంటీసీతో లోతుగా చర్చించిన తర్వాత నిర్ణయం అమలు చేసేలా అంగీకారం కుదిరిన్నట్టు సంఘం చైర్మన్ మల్కిత్సింగ్ బల్ తెలిపారు. దాంతో సమ్మె విరమిస్తున్నట్టు సంఘం ప్రకటించారు.
రోడ్డు ప్రమాదంలో మరణానికి బాధ్యుడైన డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా పారిపోయేతే పదేళ్ల దాకా కఠిన కారాగార శిక్ష, రూ.7 లక్షల దాకా జరిమానా విధించేలా భారత న్యాయ సంహితలో కొత్తగా చేర్చిన సెక్షన్లపై లారీలు, ట్రక్కుల డ్రైవర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనల రద్దు డిమాండ్తో సోమవారం నుంచి ట్రక్కు డ్రైవర్లు సమ్మెకు దిగారు.మంగళవారం నాటికి సమ్మె ప్రభావందేశమంతటా విస్తరించింది. పెట్రోల్, డీజిల్ కోసం వాహనదారులంతా ఒక్కసారిగా రోడ్డెక్కడంతో అన్ని రాష్ట్రాల్లోనూ పరిస్థితి చేయి దాటిపోయింది. దీంతో కేంద్రం దిగొచ్చి చర్చలు జరిపింది.