Yadadri Power Plant : వచ్చే ఏడాదికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ రెడీ
27 November 2022, 22:17 IST
- Theramal Power Plant : నల్గొండ జిల్లా దామరచెర్ల మండలంలో రూ.29,992 కోట్ల అంచనా వ్యయంతో యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. అయితే దీనిని వచ్చే ఏడాది అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది.
ప్రతీకాత్మక చిత్రం
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్(Yadadri Power Plant) నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది పవర్ ప్లాంట్ అందుబాటులోకి రానుంది. పనులను సీఎం కేసీఆర్(CM KCR) నవంబర్ 28వ తేదీన పరిశీలిస్తారు. వచ్చే ఏడాది సెప్టెంబర్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించే అవకాశం ఉంది. 4,000 మెగావాట్ల పవర్ స్టేషన్.. ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయనున్న అతిపెద్ద థర్మల్ ప్లాంట్ గా నిలవనుంది.
నల్గొండ(Nalgonda) జిల్లా దామరచెర్ల మండలంలో రూ.29,992 కోట్ల అంచనా వ్యయంతో ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే ఇకపై తెలంగాణ(Telangana)కు విద్యుత్ లోటు ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. 2023 డిసెంబర్లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు(Assembly Elections) జరగనున్నందున, ఎన్నికలకు ముందే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రారంభించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆసక్తిగా ఉంది.
ప్లాంట్ నిర్మాణ కాంట్రాక్టును భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) చేజిక్కించుకుంది. పవర్ ప్లాంట్(Power Plant)లో ఒక్కొక్కటి 800 మెగావాట్ల ఐదు యూనిట్లు ఉంటాయి. 2023 సెప్టెంబర్లో మొదటి యూనిట్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ (టీఎస్ జెన్కో) అధికారులు చెబుతున్నారు. రెండో యూనిట్ను అదే ఏడాది డిసెంబర్లో, మిగిలిన రెండు యూనిట్లను 2024లో ప్రారంభించాలని భావిస్తున్నారు.
ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని జెన్కో తెలిపింది. ఇప్పటికే 62 శాతం పనులు పూర్తయ్యాయి. ఫేజ్ 1 మొదటి రెండు యూనిట్లలో పూర్తయిన పని శాతం ఎక్కువగా ఉంది. తెలంగాణ(Telangana) రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేపట్టిన మూడో థర్మల్ పవర్ ప్లాంట్ ఇది. జెన్కో రికార్డు స్థాయిలో 46 నెలల్లో 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్తగూడెం(Kothagudem) థర్మల్ ప్లాంట్ను నెలకొల్పింది. ఈ ప్రాజెక్ట్ 2019లో ప్రారంభించారు. తదనంతరం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బయ్యారం సమీపంలో 1080 మెగావాట్ల భద్రాద్రి ప్లాంట్(Bhadradri Plant) వచ్చింది.
ఇదిలా ఉండగా, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(NGT) ఉత్తర్వులు నిర్మాణ పనులపై ప్రభావం చూపబోవని జెన్కో అధికారులు తెలిపారు. బొగ్గు అనుసంధానం, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్కు ప్రాజెక్టు స్థలం దూరం వంటి అంశాల్లో అస్పష్టత ఉందని పేర్కొంటూ ఎన్జీటీ గత నెలలో ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతిని నిలిపివేసింది. నిపుణుల అంచనాల కమిటీ ద్వారా ప్రాజెక్ట్ను తిరిగి అంచనా వేసేందుకు, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుండి తాజా క్లియరెన్స్ పొందేందుకు జెన్కోకు NGT తొమ్మిది నెలల గడువు ఇచ్చింది.