Extra Marital affair: ప్రియుడితో కలిసి భర్త హత్యకు భార్య స్కెచ్.. అంతా దొరికిపోయారు
30 December 2022, 9:15 IST
- Husband Murder in Hayathnagar: ప్రియుడి మోజులో పడింది. కట్టుకున్న వాడిని లేకుండా చేయాలని అనుకుంది. ప్లాన్ సక్సెస్ అయింది. విషయం బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంది. కానీ జరిగిన విషయాన్ని ఒకరితో పంచుకోవటంతో... నిందితులంతా బయటికి వచ్చారు.
హయత్ నగర్ లో దారుణం
Hayathnagar Crime News: వారిద్దరూ ఆర్టీసీ ఉద్యోగులు.. ! భార్య హయత్ నగర్ పరిధిలో విధులు నిర్వర్తిస్తుండగా, భర్త కూకట్ పల్లి బస్ డిపో పరిధిలో పని చేస్తున్నాడు. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో అక్రమ సంబంధం వ్యవహరం చిచ్చు రేపింది. హయత్ నగర్ లో పని చేస్తున్న భార్య.... అక్కడే పని చేస్తున్న మరో ఉద్యోగితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడి మోజులో పడి... ఏకంగా కట్టుకున్న వాడిని కాటికి పంపించేయాలని చూసింది. ఇంకేముంది ప్లాన్ ప్రకారం ఓ రోజు భర్తపై దాడి చేయించింది. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భర్త.. ప్రాణాలతో బయటపడ్డాడు. కేసు విచారణలో నిందితులు దొరకలేదు. కానీ కొద్దిరోజులకే భర్త చనిపోయాడు. అయితే ఒక్క ట్విస్ట్ తో కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. భర్త చనిపోయేందుకు కారణమైన భార్యతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణ ఘటన నగర శివారు ప్రాంతమైన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
ఏం జరిగిందంటే...
శంకర్ గౌడ్, రజితలు ఇద్దరూ ఆర్టీసీ కండక్టర్లు. వీరు హయత్నగర్లో నివాసం ఉండేవారు. రజిత హయత్ నగర్ డిపో-1లో పని చేస్తుండగా... అక్కడ పని చేసే ఆర్టీసీ కానిస్టేబుల్ రాజ్కుమార్ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధం వరకు వెళ్లింది. భర్త డ్యూటీకి వెళ్లగానే రాజ్ కుమార్... రజిత ఇంటికి వెళ్లేవాడు. భార్య ప్రవర్తనలో మార్పు గమనించిన భర్త.. భార్యను పలుమార్లు మందలించాడు. అయితే ప్రియుడి మోజులో ఉన్న రజిత... భర్తను లేకుండా చేయాలని భావించింది. అతను లేకుంటే ప్రియుడితో సంతోషంగా ఉండొచ్చని అనుకుంది. ఇందుకోసం ప్రియుడితో కలిసి ఓ మాస్టర్ ప్లాన్ వేసింది.ఈ ఏడాది మార్చి నెలలో రాత్రి డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న శంకర్పై.. కొందరితో దాడి చేయింది. ఇందులో ప్రియుడు కూడా ఉన్నాడు. ఈ దాడిలో శంకర్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఈ దాడి నుంచి భర్త గాయాలతో పడ్డాడు.
దాడి విషయం గురించి ఏం తెలియనట్టు... పోలీసులకు ఫిర్యాదు చేసింది భార్య. విచారణ జరిపిన పోలీసులకు...నిందితులెవరు దొరకలేదు. ఇక ఈ దాడిలో తగిలిన దెబ్బలతో భర్త మంచానికే పరిమితమయ్యాడు. అలా కొద్ది నెలల తర్వాత గుండెపోటుతో కన్నుమూశాడు. అయితే కుట్ర విషయం బయటికి రాకపోవడంతో ఊపిరి పీల్చుకుంది భార్య. అయితే ఇక్కడ ఒక్క చిన్న ట్విస్ట్ చోటు చేసుకుంది. భర్తపై దాడికి సంబంధించిన విషయాన్ని రజిత తన స్నేహితురాలితో పంచుకుంది. ఈ పరిణామమే విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చేందుకు కారణమైంది.
విషయం తెలుసుకున్న వ్యక్తి అతని సోదరుడికి చెప్పడం, ఆ సోదరుడు శంకర్ గౌడ్ సోదరుడికి చెప్పటంతో మొత్తం విషయం బయటకు వచ్చింది. దీంతో సదరు వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. కేసును తిరిగి ఓపెన్ చేసిన పోలీసులు.. రాజ్కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో ప్రశ్నించగా వివాహేతర సంబంధం బయటికి వచ్చింది. దాడి ఘటన అంతా వెలుగులోకి వచ్చేసింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు... భార్య కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.