Nalgonda Politics : నల్గొండ అడ్డాలో 'లడ్డూ' పాలిటిక్స్ - అంత ధర పలికారా..? పలికించారా..?
28 September 2023, 21:41 IST
- Laddu Auction in Nalgonda: వినాయక లడ్డూ వేలం సాక్షిగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఆసక్తికర రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ఏకంగా రూ. 36 లక్షలకు వేలం పాట పడగా… తెర వెనక సదరు నేతనే ఇదంతా చేయించారనే టాక్ వినిపిస్తోంది.
. నల్లగొండలో ఆసక్తికర రాజకీయం
Vinayaka Laddu Politics in Nalgonda: వినాయక చవితి సందర్భంగా నల్లగొండ జిల్లాలో ఆసక్తికరమైన రాజకీయాలు చోటు చేసుకున్నాయి. గణేష్ మండపాలు నెలకొల్పడం నుంచి వినాయక విగ్రహాలను ఇవ్వడం వరకు జోరుగా రాజకీయం జరిగింది. జిల్లా కేంద్రంలోని పాతబస్తీలో ఒకటో నెంబరు గణేష్ మండపానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. నిమజ్జనానికి శోభాయాత్ర ఇక్కడి నుంచే మొదలవుతుంది. రాజకీయ నాయకుల, ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు అంతా ఇక్కడ పూజలు చేయడం ఆనవాయితీ.
నల్లగొండ పాతబస్తీలోని ఒకటో నెంబరు మండపంలో విగ్రహ ఏర్పాటు కోసం దాతల నడుమ పోటీ ఉంటుంది. ఈ సారి సుమారు పధ్నాలుగు మంది దాతలు పోటీ పడడంతో డ్రా తీశారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, బీఆర్ఎస్ రెబల్ నాయకుడు పిల్లి రామరాజు యాదవ్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా.. వివిధ పార్టీలకు చెందిన పధ్నాలుగు మంది పోటీ పడితే డ్రా తీయడంతో.. ఈ సారి విగ్రహ దాతగా ఎంపీ కోమటిరెడ్డి పేరు డ్రాలో వచ్చింది. దీంతో లడ్డూను దక్కించుకేనేందుకు పోటీ ఏర్పడింది. అంతేకాదు.. గణేష్ ను చేతిలోని లడ్డూకూ ఎంతో ప్రాముఖ్యం ఉంటుంది. ప్రతీ ఏటా పాటలో ఈ లడ్డూను దక్కించుకోవడానికి పోటీ ఉంటుంది.
బాలాపూర్ లడ్డూ ధరను మించి..
తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ లోని బాలాపూర్ గణేష్ లడ్డూకు పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. ఏటేటా ఇక్కడి లడ్డూ వేలం పాటలో లక్షల్లో ధర పలుకుతుంది. ఈ సారి కూడా బాలాపూర్ లడ్డూ రూ.27లక్షలకు దక్కించుకున్నారు. అయితే.. ఇది ఎంత మాత్రం రికార్డు ధర కాదని నల్లగొండ పాతబస్తీ గణేష్ నిరూపించారు. ఇక్కడ జరిగిన లడ్డూ వేలం పాటలో ఏకంగా రూ.36 లక్షలకు కరణ్ జయరాజ్ అనే భక్తుడు దక్కించుకున్నారు. ఇంత ధర పలకడం ఇదే తొలిసారి కాగా, తెలంగాణ లో రెండో అతి ఎక్కువ ధరగా చెబుతున్నారు. కాగా, హైదరాబాద్ బండ్లగూడా రిచ్ మండ్ విల్లాలో గణేష్ లడ్డూ రూ1.26 కోట్లు రికార్డ్ ధర పలికినట్లు సమాచారం. కాగా, నల్లగొండ పాతబస్తీ వినాయకుడి లడ్డూకు ఇంత ధర పలకడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
రూ.36 లక్షల ధర ఎలా పలికింది..?
మునుపెన్నడూ లేని రీతితో నల్లగొండ పాతబస్తీ గణేష్ లడ్డూ రూ.36 లక్షల ధర పలకడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ అసమ్మతి నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ తమ్ముడు పిల్లి క్రిష్ణం రాజు రూ.31 లక్షల దాకా పాటపాడి వెనక్కి తగ్గారు. గతేడాది ఈ సోదరులిద్దరూ పాతబస్తీ గణేష్ లడ్డూను దక్కించుకున్నారు. ఈ సారి ఎన్నికల ఏడాది కావడంతో ఒక ప్రజాప్రతినిధి తన సెంటిమెంట్ కోసం తెరవెనుక ఉండి ఈ పాట పాడించారని ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తనకు కలిసి రావాలంటే లడ్డూను దక్కించుకోవాలని వచ్చిన సూచన మేరకే అత్యధిక ధర పెట్టి లడ్డూను దక్కించుకున్నారని అంటున్నారు. లడ్డూ వేలం పాటలో పాల్గొంది కరణ్ జయరాజ్ అనే భక్తుడే అయినా.. ఆయనతో పాట పాడించింది మాత్రం ఓ ప్రజాప్రతినిధిగా తెలుస్తోంది.