TS RERA : 'రెరా' కొరడా... 3 రియల్ ఎస్టేట్ కంపెనీలకు భారీగా జరిమానా
20 September 2023, 10:38 IST
- Telangana RERA: రాష్ట్రంలోని మరో మూడు రియల్ ఎస్టేట్ సంస్థలపై తెలంగాణ 'రెరా' చర్యలు చేపట్టింది. సదరు కంపెనీలకు భారీ జరిమానా విధించింది.
రెరా చర్యలు
Telangana RERA Latest News: గత కొద్దిరోజులుగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) దూకుడు పెంచింది. అనుమతులు లేకుండా లేదా రెరా నిబంధనలు ఉల్లంఘిస్తున్న పలు రియలస్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝలిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలోని మరో మూడు రియల్ ఎస్టేట్ సంస్థలపై సీరియస్ అయింది. నిబంధనలకు విరుద్ధంగా రియల్ ఎస్టేట్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలపై భారీగా జరిమానా విధించింది.
ఇటీవలే సదరు కంపెనీలకు 'రెరా' అనుమతులు లేకుండా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుండటంచో షోకాజు నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా సంజాయిషీ సమర్పించాలని ఆదేశించినప్పటికీ స్పందించలేదు. గడువులోగా సమాధానాలు ఇవ్వకుండా నిర్లక్షంగా వ్యవహరించటంతో భారీగా జరిమానా విధించింది. ఇందులో శ్రీనివాసం డెవలపర్స్(రూ.3 లక్షలు), డీఎన్ఎస్ ఇన్ఫ్రా(36.50 లక్షలు), సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్(రూ.25 లక్షలు) కంపెనీలు ఉన్నాయి.
Telangana State Real Estate Regulatory Authority : ఇటీవలే తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కీలక నిర్ణయం తీసుకుంది. రియల్ ఎస్టేట్ కేసుల సత్వర విచారణకు వర్చువల్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఈ సేవలను ప్రారంభించింది. సీనియర్ సిటిజన్లు, దూరప్రాంతాల వారికి ఇబ్బందులు కలుగుతున్నందున.. వర్చువల్ విధానాన్ని ప్రారంభించినట్లు రెరా ఛైర్మన్ పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల సౌలభ్యం కోసం నూతన టెక్నాలజీతో ఈ విధానాన్ని అమలు చేయనున్నామని వెల్లడించారు. ఫిర్యాదుదారులు ఎక్కడి నుంచైనా వర్చువల్ హియరింగ్కు హాజరుకావచ్చని స్పష్టం చేశారు.
ఇప్పటివరకూ కేసుల పరిష్కారానికి ఫిర్యాదుదారులు, కక్షిదారులు వ్యక్తిగతంగా రెరా బెంచి ముందు హాజరు కావాల్సి వచ్చేది. ఫలితంగా కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకున్న రెరా... ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.