TS RERA : ఉల్లంఘనలపై 'రెరా' కొరడా - రియల్ ఎస్టేట్ సంస్థకు రూ. 10 కోట్ల ఫైన్
23 September 2023, 8:26 IST
- Telangana RERA: రాష్ట్రంలోని పలు రియల్ ఎస్టేట్ సంస్థలపై తెలంగాణ 'రెరా' చర్యలు చేపట్టింది. సదరు కంపెనీలకు భారీ జరిమానా విధించింది. నిబంధనలు ఉల్లంఘించటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలంగాణ రెరా
Telangana Real Estate Regulatory Authority Latest News: గత కొద్దిరోజులుగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) దూకుడు పెంచింది. అనుమతులు లేకుండా లేదా రెరా నిబంధనలు ఉల్లంఘిస్తున్న పలు రియల్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝలిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలోని పలు రియల్ ఎస్టేట్ సంస్థలకు గట్టి షాక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించటంతో పాటు షోకాజ్ నోటీసులకు స్పందించకపోవటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రిజిస్ట్రేషన్ పొందకుండా ప్రకటనలు, మారెటింగ్ కార్యకలాపాలకు పాల్పడిన సాహితీ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్కు రూ.10.74 కోట్ల అపరాధ రుసుం విధించింది. రెరా నోటీసులను విస్మరించటాన్ని సీరియస్ గా పరిగణించింది.
మంత్రి డెవలపర్స్కు రూ.6.50కోట్లు పెనాల్టీని విధించింది రెరా. సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు రూ.25 లక్షల అపరాధ రుసుం విధించినట్టు రెరా ఛైర్మన్ సత్యనారాయణ తెలిపారు. జూబ్లీహిల్స్ చెక్పోస్టు సమీపంలో ప్రాజెక్టుపై జరిమానా విధించినట్టు పేర్కొన్నారు. ఇక సాహితీ గ్రూప్నకు చెందిన సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ‘రెరా’ రిజిస్ట్రేషన్ లేకుండా ‘సాహితీ సితార్ కమర్షియల్’ పేరుతో రంగారెడ్డిజిల్లా గచ్చిబౌలిలో కమర్షియల్, రెసిడెన్షియల్ ఫ్లాట్స్ కొనుగోలు చేపట్టింది. దీనిపై ఫిర్యాదులు అందటంతో రెరా దృష్టి పెట్టింది. ఇదే కాకుండా మరో రెండు చోట్లు కూడా సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్మాణాలు చేపట్టిన కొనుగోళ్లు చేపట్టిందని రెరా తెలిపింది. జరిమానాను 15రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది.
Telangana RERA : ఇటీవలే తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కీలక నిర్ణయం తీసుకుంది. రియల్ ఎస్టేట్ కేసుల సత్వర విచారణకు వర్చువల్ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఈ సేవలను ప్రారంభించింది. సీనియర్ సిటిజన్లు, దూరప్రాంతాల వారికి ఇబ్బందులు కలుగుతున్నందున.. వర్చువల్ విధానాన్ని ప్రారంభించింది. ఫిర్యాదుదారుల సౌలభ్యం కోసం నూతన టెక్నాలజీతో ఈ విధానాన్ని అమలు చేయనున్నామని వెల్లడించింది. ఫిర్యాదుదారులు ఎక్కడి నుంచైనా వర్చువల్ హియరింగ్కు హాజరుకావచ్చని స్పష్టం చేసింది
ఇప్పటివరకూ కేసుల పరిష్కారానికి ఫిర్యాదుదారులు, కక్షిదారులు వ్యక్తిగతంగా రెరా బెంచి ముందు హాజరు కావాల్సి వచ్చేది. ఫలితంగా కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకున్న రెరా... ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.