TS PGECET 2023 : పీజీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. జులై 31 నుంచి ప్రవేశాలు, ముఖ్య తేదీలివే
22 July 2023, 9:32 IST
- TS PGECET 2023 Updates: టీఎస్ పీజీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 28వ తేదీన పీజీ ఇంజినీరింగ్ సెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. కౌన్సెలింగ్ ప్రక్రియను జులై 31 నుంచి నిర్వహించనున్నారు.
టీఎస్పీజీఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్
TS PGECET 2023 Counselling: ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ ను విడుదల చేసింది ఉన్నత విద్యా మండలి. జులై 28వ తేదీన పీజీ ఇంజినీరింగ్ సెట్ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. కౌన్సెలింగ్ ప్రక్రియను జులై 31 నుంచి నిర్వహించనున్నారు. ఫలితంగా జులై 31 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్కు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు 21 నుంచి 23 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు అవకాశం ఇచ్చారు. వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకున్నవారికి జులై 26న మొదటి విడత సీట్లను కేటాయించనున్నట్లు అధికారులు ప్రకటించారు.
ముఖ్య తేదీలు:
నోటిఫికేషన్ -28.07.2023.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ - 31.07.2023 - 09.08.2023.
అర్హులైన వారి జాబితా - 20.08.2023.
వెబ్ఆప్షన్ల నమోదు ప్రక్రియ- 21. 08. 2023 - 23.08.2023.
తొలివిడత సీట్ల కేటాయింపు - 26.08.2023.
రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ - 04.09.2023 - 23.09.2023.
తరగతులు ప్రారంభం - 19.09.2023.
అధికారిక వెబ్ సైట్ - https://pgecet.tsche.ac.in/
గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా సుమారు 11 వేల సీట్లు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇందులో 70 శాతం(7700సీట్లు) వరకు కన్వీనర్ కోటా కింద కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేయనున్నారు. మరోవైపు గెట్, జీప్యాట్ ర్యాంకర్లకు ఊరట దొరికింది. ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్ కోర్సుల్లోని సీట్లను రెండు మార్గాల్లో భర్తీ చేస్తారు. జాతీయ స్థాయిలో నిర్వహించే గేట్, జీప్యాట్ ర్యాంకర్లకు తొలి ప్రాధాన్యం ఇచ్చేవారు. ఆ తర్వాత పీజీఈసెట్ ర్యాంకర్లతో భర్తీ చేస్తారు. గత ఏడాది వరకు నోటిఫికేషన్ రాక ముందే గేట్, జీప్యాట్ ర్యాంకర్లు తొలుత ర్యాంకు కార్డు, ఇతర వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉండేది. దానికి రూ.1200 ఫీజు చెల్లించాలి. మళ్లీ పీజీఈసెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అందుకు మరో రూ.1200లు చెల్లించాలి. అంటే రెండు సార్లు ఫీజు చెల్లించాల్సి వస్తుండటంతో కొందరు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. దీనిపై అనేక ఫిర్యాదులు వస్తుడంటంతో ఈ ఏడాది నుంచి ఒకేసారి రిజిస్ట్రేషన్కు అవకాశం ఇచ్చారు.
ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్
ఎంసెట్ ఇంజినీరింగ్ రెండో విడత కౌన్సెలింగ్ తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 24 నుంచి మొదలుకానుంది. జులై 24, 25న ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి, స్లాట్ బుక్ చేసుకోవచ్చు. 26న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 24 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు, 27న సీట్లను ఫ్రీజ్ చేస్తారు.జులై 31న సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన వారు 31 నుంచి ఆగస్టు 2 వరకు ఆన్లైన్లో సెల్ఫ్రిపోర్ట్ చేయాలి.