TS Inter Recounting : తెలంగాణ ఇంటర్ ఫలితాలు- మే 10 నుంచి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్
09 May 2023, 14:48 IST
- TS Inter Recounting : తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో సందేహాలున్న విద్యార్థులకు బోర్డు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అవకాశం కల్పించింది. మే 10 నుంచి అప్లై చేసుకోవచ్చని తెలిపింది.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు
TS Inter Recounting : తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ఉదయం విడుదల చేశారు. ఇంటర్ మొదటి సంవత్సవరంలో 63.85% మంది పాస్ కాగా, సెకండియర్లో 67.26 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ ద్వితీయ సంవత్సరం 63.49 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో మేడ్చల్, సెకండియర్ ఫలితాల్లో ములుగు జిల్లా మొదటి స్థానంలో నిలిచాయి. సెకండియర్ ఫలితాల్లో 1,73,61 మందికి గ్రేడ్-ఎ రాగా, 54,776 మంది విద్యార్థులకు గ్రేడ్-బి వచ్చిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. సెకండియర్ లో మొత్తం 2,56,241 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
మార్కుల జాబితా డౌన్ లోడ్
ఇంటర్ పరీక్షల ఫలితాల్లో తమ మార్కులపై సందేహాలున్న విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. మే 10వ తేదీ నుంచి నిర్ణయించబడిన ఫీజు చెల్లించి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ను అప్లై చేసుకోవచ్చని సూచించారు. సప్లిమెంటరీ పరీక్షల కోసం కూడా విద్యార్థులు మే 10 నుంచి 16 వరకు ఫీజు చెల్లించాలన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రుల సందేహాల కోసం హెల్ప్ లైన్ 14416 నెంబర్ అందుబాటులో ఉందని నవీన్ మిట్టల్ స్పష్టం చేశారు. జూన్ 4వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం నుంచి విద్యార్థులు మార్కుల జాబితాలను డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రకటించారు.
బాలికలదే హవా
తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాల్లో బాలికలదే హవా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు మొత్తం 4 లక్షల 33 వేల 82 మంది హాజరు కాగా వీరిలో 2,72,208 మంది పాస్ అయ్యారు. మొదటి సంవత్సరంలో మొత్తం 63.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 1,60,000 మంది ఏ గ్రేడ్లో పాస్ కాగా, 68,335 మంది బి గ్రేడ్లో పాస్ అయ్యారు. బాలికలు 68 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా, బాలురు 56.82 శాతం మంది పాస్ అయ్యారు. ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్(75.27 %) మొదటి స్థానం, రంగారెడ్డి (72.82 %), కొమరంభీమ్ ఆసిఫాబాద్ (72.96%) మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. సెకండియర్ ఫలితాల్లో ములుగు (85.08 %), కొమరంభీమ్ ఆసిఫాబాద్ (80.16 %), మేడ్చల్(72.27 %) జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.
తెలంగాణలో ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 9.47 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.