Covid Cases in Telangana: కొవిడ్ టెస్టులు పెంచండి… హైకోర్టు ఆదేశాలు
09 June 2022, 8:22 IST
- కొవిడ్ కేసులు పెరుగుతుండడంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. కేసుల సంఖ్యను పెంచాలని ఆదేశించింది. 15 రోజుల్లో నివేదికను ఇవ్వాలని స్పష్టం చేసింది.
కొవిడ్ కేసులపై తెలంగాణ హైకోర్టు ఆదేశాలు
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైరస్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై 15 రోజుల్లో నివేదికను అందజేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సీజే జస్టిస్ సతీష్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. మరోవైపు కొవిడ్ టెస్టుల సంఖ్యను పెంచాలని స్పష్టం చేసింది.
ఎక్స్ గ్రేషియా చెల్లించండి....
కరోనా మృతుల కుటుంబాలకు 15 రోజుల్లో ఎక్స్గ్రేషియా చెల్లించేలా ప్రక్రియను వేగవంతం చేయాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, చర్యలపై నివేదిక సమర్పించాలని పేర్కొంది.. కరోనా కేసుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. కేంద్ర హెచ్చరికలపై దృష్టిపెట్టాలని సూచించింది. తదుపరి విచారణను ఈనెల 22కి వాయిదా వేసింది.
భారీగా కేసులు...
మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. ఆ తీవ్రత తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకలో ఎక్కువగా ఉంది. ఆయా రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో 13,149 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా అందులో 119 మందికి వైరస్ సోకినట్టు తేలింది. వీటిలోనూ అత్యధికంగా 79 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలోనివే. మార్చి 7 తర్వాత ఇదే అత్యధిక సంఖ్య కావటం గమనార్హం. ఫలితంగా ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 7,93,791కి పెరిగింది. వైరస్ నుంచి 7,89,022 మంది కోలుకోగా మరో 658 మంది మాత్రమే కొవిడ్ చికిత్స తీసుకుంటున్నారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు నిబంధనలను పాటించాలని వైద్యారోగ్య హెచ్చరించింది. మాస్కులు, శానిటైజర్లు వాడటం మంచిదని సూచిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించటం మంచిదికాదని హెచ్చరిస్తున్నారు.
టాపిక్