TRS Kavita : లిక్కర్ స్కాంతో ఎలాంటి సంబంధం లేదన్న కవిత
22 August 2022, 13:19 IST
- ఢిల్లీ లిక్కర్ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ సిఎం కేసీఆర్ కుమార్తె కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ను ఎదుర్కోలేక తనపై విమర్శలు చేస్తున్నారని, ఏ దర్యాప్తుకైనా తాము సహకరిస్తామని ప్రకటించారు.
లిక్కర్ స్కాంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన కవిత
లిక్కర్ స్కాం వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. బట్టకాల్చి మీదేసి తుడుచుకోమనేలా బీజేపీ నేతల వ్యవహార శైలి ఉందని, అవి నిరాధార ఆరోపణలని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం ఇలాంటి ఆరోపణలు చేయడం ఆరోగ్యకరమైన వైఖరి కాదన్నారు.
మద్యం పాలసీ, లిక్కర్ వేలం వ్యవహారాల్లో తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. కేసీఆర్ బిడ్డను కాబట్టి, తనపై విమర్శలు చేస్తే కేసీఆర్ ఆగం అవుతారని, బీజేపీని విమర్శిస్తున్న కేసీఆర్ వెనక్కి తగ్గుతారని వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ను మానసికంగా కుంగదీసే ప్రయత్నాలలో భాగంగానే బీజేపీ నేతలు కట్టుకథలు అల్లుతున్నారని కవిత ఆరోపించారు. ఈ ఆరోపణలతో ప్రతినిత్యం మీడియాలో ఏదో కథనం ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని, అవన్నీ వృధా ప్రయత్నాలుగా మిగిలిపోతాయన్నారు.
తమ గురించి తెలంగాణ ప్రజలకు, దేశ ప్రజానీకానికి తెలుసని బీజేపీ నేతల బెదిరింపులకు భయపడేది లేదన్నారు. ఉద్యమ కాలంలో కూడా కేసీఆర్ మీద, తమ కుటుంబం మీద ఇలాంటి ఆరోపణలు చేశారని ప్రజలు వాటిని విశ్వసించలేదన్నారు. అప్పుడు ఇప్పుడు మొక్కువోని ధైర్యంతో ముందుకు సాగుతామని తేల్చి చెప్పారు. తాము కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తామని, బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా వెనక్కి తగ్గేది లేదన్నారు.
బిల్కిజ్ బానో విషయంలో అడిగిన ప్రశ్నలకు, ఉద్యోగాల కల్పన విషయంలో అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో అన్ని దర్యాప్తు సంస్థలు వారి చేతుల్లో ఉన్నాయని, ఎలాంటి విచారణకైనా తాము సిద్ధమని చెప్పారు. బీజేపీ విధానాలను విమర్శిస్తున్నందుకే తమ కుటుంబ ప్రతిష్టను దిగజార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, బీజేపీ నిరాధార ఆరోపణలకు తాము బెదిరిపోమని కవిత చెప్పారు.తమ కుటుంబానికి పోరాట చరిత్ర ఉందని, ఇలాంటి ఆరోపణలకు బెదిరిపోయేది లేదన్నారు.లిక్కర్ స్కాం గురించి తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
టాపిక్