Hyderabad Crime: హత్య చేసి హార్ట్ స్ట్రోక్ గా నమ్మించారు… ఇలా దొరికిపోయారు
18 November 2022, 15:39 IST
- Murdering labourer in Hyderabad: తనపై యజమానికి ఫిర్యాదు చేస్తున్నాడన్న కక్షతో ఓ వ్యక్తిని చంపేశాడు. విషయం బయటకు రాకుండా... కొందరితో కలిసి పెద్ద నాటకానికే తెరలేపారు. కిల్లర్ క్రైమ్ స్టోరీని తలపించే ఈ కేసును హైదరాబాద్ పోలీసులు చేధించారు.
పహాడి షరీఫ్ లో వ్యక్తి హత్య
Murdering labourer in Pahadishareef: కక్షతో ఓ వ్యక్తిని చంపేశాడు మరో వ్యక్తి..! విషయం కాస్త వారు పని చేసే యజమానులకు తెలిసింది. బయటికి వస్తే ఇబ్బందిగా మారుతుందని... పెద్ద డ్రామకు తెరలేపారు. హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడని సీన్ క్రియేట్ చేశాడు. గుట్టుచప్పుడు కాకుండా... డెడ్ బాడీని మృతుడి సొంత గ్రామానికి తరలించారు. బాడీని చూసి కుటుంబసభ్యులకు గాయాలు కనిపించాయి. వెంటనే డౌట్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అక్కడి పోలీసులు... హైదరాబాద్ పోలీసులతో మాట్లాడారు. వివరాలను పంపించారు. సీన్ కట్ చేస్తే... సినిమా స్టోరీని తలపించేలా క్రైమ్ స్టోరీని రచించిన నిందితులను కటకటాలకు పంపించారు. ఇదంతా హైదరాబాద్ లోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం....
రాజస్థాన్ కు చెందిన ఓంప్రకాశ్, సునీల్ హైదరాబాద్లో ఉంటూ మీర్పేట్ లోని ఓ ప్రైవేట్ కంపెనిని నిర్వహిస్తున్నారు. ఇదే కంపెనీలో రాజస్థాన్ కు చెందిన జైతరణ్కు చెందిన మహేంద్రజీ చౌదరి, ఉత్తర్ప్రదేశ్ కౌశాంబి జిల్లా చందుపురంరాయన్కు చెందిన రోహిత్ కుమార్ పని చేసేవారు. అయితే రోహిత్ సరిగ్గా పని చేయడం లేదని తరుచూ అతనిపై యజమానికి మహేంద్రజీ ఫిర్యాదు చేసేవాడు. దీంతో మహేంద్రపై కక్ష పెంచుకున్న రోహిత్. ఇక లాభం లేదనుకొని మహేంద్రను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఓ రోజు పనిచేస్తుండగా సమయంలో స్పానర్తో మహేంద్ర తలపై గట్టిగా మోదాడు. తీవ్రంగా గాయపడిన మహేంద్రజీని కంపెనీ యజమానులు శివరాంపల్లిలోని చంద్రా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మహేంద్ర మృతి చెందాడు.
కొట్టిన విషయం బయటికి వస్తే ఇబ్బందిగా మారుతుందని ఓనర్లుగా ఉన్న ఓం ప్రకాశ్, సునీల్ భావించారు. వెంటనే ఓ ప్లాన్ రెడీ చేశారు. గుండె పోటుతో మహేంద్ర చనిపోయినట్లు ఆసుపత్రి నుంచి ఫోన్ చేయించారు. అక్టోబర్ 4న ఫోన్ ఇది జరిగింది. ఇదే సమయంలో హత్య విషయం... పోలీసులకు చేరకుండా... మ్యానేజ్ చేశారు. మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించకుండా జాగ్రత్త పడ్డారు. హత్యకు పాల్పడిన రోహిత్ ను యూపీకి పంపించారు. ఇదే సమయంలో డెడ్ బాడీని స్వస్థలానికి తరలించారు.
ఇంటికి చేరుకున్న డెడ్ బాడీని చూసిన కుటుంబ సభ్యులకు గాయాలు కనిపించాయి. తల, శరీరంపై బలమైన గాయాలున్నట్లు గుర్తించారు. దీంతో తమ తండ్రి గుండె పోటుతో మరణించలేదని, ఎవరో హత్య చేశారని భావించారు. దీనిపై అక్టోబర్ 31న రాజస్థాన్ లోని స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు... కేసును హైదరాబాద్ పరిధిలోని పహాడీషరీఫ్ ఠాణాకు బదిలీ చేశారు.
రంగంలోకి దిగిన ఇక్కడి పోలీసులు... ఫ్యాక్టరీని సందర్శించారు. వివరాలను సేకరించారు. కీలక ఆధారాలు దొరకడంతో రోహితే అసలు నిందితుడని.. హత్య చేశాడని నిర్థారిచారు. రోహిత్ ను అరెస్ట్ చేశారు. ఫ్యాక్టరీ యజమానులు ఓంప్రకాశ్, సునీల్ వ్యవహారం కూడా వెలుగులోకి రావటంతో వీరిని కూడా అదపులోకి తీసుకున్నట్లు... వనస్థలిపురం ఏసీపీ కె. పురుషోత్తమ్ రెడ్డి చెప్పారు.