KTR: 'రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తున్నాం.. గవర్నర్ ను ఎక్కడా అవమానించలేదు'
08 April 2022, 6:36 IST
- టీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు.గవర్నర్ను తాము ఎప్పుడూ ఎక్కడా అవమానించలేదని స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై కూడా కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.
గవర్నర్ వ్యాఖ్యలపై కేటీఆర్ రియాక్షన్
తెలంగాణ సర్కార్ పై గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు చేశారు. కనీసం ప్రోటో కాల్ పాటించకుండా గవర్నర్ వ్యవస్థను అవమానిస్తున్నారంటూ ఆమె ఢిల్లీలో మాట్లాడారు. అయితే గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. గురువారం సిరిసిల్లలో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా గవర్నర్ పదవికి భంగం కలిగించేలా వ్యవహరించలేదని స్పష్టం చేశారు. గవర్నర్ను తాము ఎప్పుడూ ఎక్కడా అవమానించలేదన్నారు. ఆమె ఊహించుకుని మాట్లాడుతున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
మేం ప్రతివిషంలో రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తున్నామని మంత్రి కేటీఆర్ చెప్పారు. రాజకీయ నేపథ్యం ఉంది కాబట్టి ఎమ్మెల్సీగా కౌశిక్ రెడ్డిని అనుమతించలేదని ఆమె చెప్పారని మీడియాలో వచ్చిన కథనాలను బట్టి తెలిసిందని గుర్తు చేశారు. ఆమె కూడా గతంలో బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారని.. కానీ గవర్నర్గా నియమితులు కావడానికి అది అడ్డు కాలేదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు తొలిసారి జరిగినప్పుడు గవర్నర్ ప్రసంగం ఉండాలని రాజ్యాంగంలో ఉందన్న ఆయన.. ఇటీవల జరిగింది తొలి సమావేశం కాదని తేల్చి చెప్పారు. సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డాయని ప్రోరోగ్ కాలేదన్నారు. అందువల్లే గవర్నర్ ప్రసంగం పెట్టలేదని క్లారిటీ ఇచ్చారు.
గవర్నర్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే...
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళి సై... ప్రధాని మోడీ, అమిత్ షా లను వేర్వురుగా మాట్లాడారు. పలు అంశాలపై చర్చించారు. నిన్న అమిత్ షాతో భేటీ తరువాత మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ సర్కార్ పై ప్రశ్నలు సంధించారు. తన విషయంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని ప్రజలు, మీడియా గమిస్తున్నారని చెప్పారు. భద్రాచలంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు హాజరవుతానని పేర్కొన్నారు. రోడ్డుమార్గంలోనే భద్రాచలం వెళ్తానని స్పష్టం చేశారు. మేడారం జాతరకు కూడా రోడ్డుమార్గంలోనే వెళ్లానని 5 గంటలపాటు ప్రయాణించి చెప్పుకొచ్చారు.
రాజ్భవన్ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయని గవర్నర్ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, సీఎస్ ఎప్పుడైనా రావొచ్చన్నారు. తాను రాజ్యాంగబద్ధమైన, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నానని తెలిపారు. రాజ్భవన్కు ఏ పార్టీతోనూ సంబంధం ఉండదని స్పష్టం చేశారు. ఉగాది వేడుకలకు ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించానని.. కావాలనే రాజ్భవన్, గవర్నర్ను అవమానిస్తున్నారని పునరుద్ఘాటించారు. ఒక మహిళను గౌరవించే విధానం ఇది కాదన్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై అమిత్షాతో చర్చించినట్లు తెలిపారు.
మోడీతో భేటీ..
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ గవర్నర్ తమిళి సై.. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అనంతరం బయటికి వచ్చిన ఆమె.. మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగానూ తెలంగాణ సర్కార్ ను ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణ, పుదుచ్చేరికి సంబంధించిన నివేదికలను ప్రధానికి అందజేశాను. ప్రభుత్వంతో సత్సంబధాలు కోరుకునే ఫ్రెండ్లీ వ్యక్తిని నేను. ప్రధానికి అన్ని విషయాలు తెలుసు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణలో ఏం జరుగుతోందో అందరికీ తెలుసు. వ్యక్తిగా నాకు గౌరవం ఇవ్వకపోయినా పర్లేదు... కానీ గవర్నర్ వ్యవస్తకు గౌరవం ఇవ్వాలి. గౌరవం ఇవ్వకపోడవాన్ని ప్రజలకే వదిలేస్తున్నా. ఈ విషయం నన్ను కాదు ప్రభుత్వాన్నే అడగాలి. నేను రాజ్యాంగబద్ధమైన వ్యక్తిని.. చట్ట ప్రకారమే నడుచుకుంటాను. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గవర్నర్ ప్రోట్ కాల్ తెలియదా..? పదే పదే ఇలా చేయడం సరికాదు. మీరు చెప్పినట్లు చేయకపోతే అవమానిస్తారా..?' అని గవర్నర్ అన్నారు.
మొత్తంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ తమిళి సై కీలక వ్యాఖ్యలు చేయటం చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కేటీఆర్... ఎక్కడా అవమానించలేదంటూ క్లారిటీ ఇచ్చారు.
టాపిక్