TS Eamcet: తెలంగాణలో ఇక ఎంసెట్ మాయం.. త్వరలో కొత్త పేరుతో ఎంట్రన్స్!
15 January 2024, 6:58 IST
- TS Eamcet: తెలంగాణలో ఇంజనీరింగ్, ఫార్మా,నర్సింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ పేరు ఈ ఏడాది నుంచి మారనుంది.ఇందుకోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
తెలంగాణ ఎంసెట్కు కొత్త పేరు ఖరారు చేయనున్న ఉన్నత విద్యా మండలి
TS Eamcet: తెలంగాణలో ఎట్టకేలకు ఎంసెట్ పేరు మార్పుకు రంగం సిద్ధమైంది. ఎంసెట్ ప్రవేశపరీక్షల్లో మెడికల్ అడ్మిషన్లను తీసేసి ఆరేడేళ్లు దాటినా పాతపేరునే కొనసాగిస్తున్నారు. ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్ పేరును అయా కోర్సులకు అనుగుణంగా పేరు మార్చనున్నారు. ఈ ఏడాది కొత్త పేరుతోనే ప్రవేశాలను నిర్వహించనున్నారు.
తెలంగాణలో ఇంజినీరింగ్,ఫార్మసీ, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ పేరిట నిర్వహిస్తున్న ప్రవేశపరీక్ష పేరును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 2017 నుంచి ఎంసెట్లో మెడికల్ సీట్ల భర్తీని తొలగించారు. దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్, ఇతర వైద్యకోర్సులను నీట్ ద్వారా కేంద్రం భర్తీ చేస్తోంది. మెడికల్ కోర్సులు లేకపోయినా ఎంసెట్ పేరులో మెడికల్ అనే పదం అలాగే కొనసాగుతోంది.ఇప్పటికే ఏపీలో ఆ పదాన్ని తొలగించి ఈఏపీ సెట్గా నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో కూడా ఎంసెట్లో మెడికల్ పదాన్ని తొలగించాలని ప్రభుత్వ స్థాయిలో చర్చ జరిగింది.ఈ మేరకు ఎంట్రన్స్లో మెడికల్ పేరును తొలగిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఎంసెట్లో మెడికల్ పదాన్ని సూచించే ఎం అక్షరాన్ని తొలగించి... ఇకపై టీఎస్ ఈఏపీ సెట్ లేదా టీఎస్ఈఏ సెట్ అని మార్చాలని ప్రతిపాదించారు. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా కోర్సులకు కలిపి ఈఏపీ సెట్ నిర్వహించాలని భావిస్తున్నారు.
2012-13లో దేశ వ్యాప్తంగా మెడికల్ సీట్ల భర్తీకి 'నీట్ యూజీ' ప్రవేశ పరీక్షను కేంద్రం ప్రవేశ పెట్టింది.రాష్ట్రాల అభ్యంతరాలు, న్యాయ వివాదాల కారణంగా ఈ పరీక్ష కొన్నాళ్లు ఆగింది. కేంద్రం చట్టం చేయడంతో 2016 నుంచి తెలంగాణసహా దేశవ్యాప్తంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి మెడికల్ డిగ్రీ కోర్సులు.. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ నుంచి దూరమయ్యాయి. ఏపీలో ఈ పేరును వెంటనే మార్చినా తెలంగాణలో మాత్రం ఎంసెట్ పేరునే కొనసాగిస్తున్నారు.
ఏపీలో ప్రస్తుతతం ఏపీ ఈఏపీ సెట్ అనే పేరుతో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఉన్నత విద్యామండలి అధికారులు ఇటీవలే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. గతంలో జారీచేసిన ఎంసెట్ జీవోను సవరించి, కొత్త జీవోను జారీ చేయాల్సి ఉంటుందని ఉన్నత విద్యామండలి అధికారులు ప్రభుత్వానికి తెలిపారు. ఎంసెట్ పేరు మార్పు జీవో త్వరలోనే ఖరారయ్యే అవకాశాలున్నట్టుగా అధికార వర్గాలు తెలిపాయి.ఈ ఏడాది మే 10 నుంచి ఎంసెట్ ప్రారంభం కానుండగా, 10, 11 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ 12 నుంచి ఇంజినీరింగ్ విభాగానికి ఎంసెట్ పరీక్షలను నిర్వహించేలా షెడ్యూల్ను రూపొందించారు. ఈ షెడ్యూల్ను కొత్త పేరుతోనే విడుదల చేస్తారని చెబుతున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1984-85లో అన్ని వర్సిటీల్లో మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశాలకు ఎంసెట్ ప్రారంభించారు. అంతకు ముందు ఏ యూనివర్సిటీకి పరిధిలో కోర్సులకు ఆ వర్సిటీ ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షను నిర్వహించేది.మొదట్లో ఇంజినీరింగ్ మెడికల్ డిగ్రీలకు నిర్వహించిన ఎంట్రన్స్ తర్వాత కాలంలో ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి కోర్సులు చేర్చారు. తర్వాత ఎంసెట్ అనే పేరును ఖరారు చేశారు.
saప్రస్తుతం ఎంపీసీ విభాగం విద్యార్థులకు ఇంజినీరింగ్, అండ్ టెక్నాలజీ కోర్సుల్లోని సీట్లను భర్తీ చేస్తున్నారు. ఇక బైపీసీ విభాగం విద్యార్థులకు బీ ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ బిఎస్సీ, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ వంటి కోర్సుల్లో సీట్లను భర్తీచేస్తున్నారు. బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో సీట్లను ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా భర్తీ చేస్తున్నారు.