TS Medical Seats Issue: ఆ కోటా లెక్కలు చెప్పాలన్న తెలంగాణ హైకోర్టు
07 September 2023, 9:26 IST
- TS Medical Seats Issue: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో లోకల్ కోటా సీట్లు మొత్తం తెలంగాణ స్థానికులకే కేటాయిస్తూ ప్రభుత్వం జీవో 72 జారీ చేసింది. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీల సీట్ల లెక్కలు చెప్పాలని కాళోజీ యూనివర్శిటీతో పాటు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
తెలంగాణ హైకోర్టు
TS Medical Seats Issue: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నిర్మించిన వైద్య కళాశాలల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని మెడికల్, డెంటల్ కోర్సుల్లో పూర్తి సీట్లను తెలంగాణ విద్యార్థులకే కేటాయించేలా జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టులో విచారణ జరిగింది.
మెడికల్, డెంటల్ సీట్ల భర్తీకి సంబంధించిన నిబంధనలను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం జులై 3న జారీ చేసిన జీవో 72ను సవాలు చేస్తూ ఏపీకి చెందిన పలువురు విద్యార్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ ఎన్.వి.శ్రవణ్కుమార్లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పును వాయిదా వేసింది.
తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేసిన 34 కళాశాలల్లోని 8,215 సీట్లలో ఆలిండియా రిజర్వేషన్ 15 శాతానికి, తెలంగాణ స్థానికులకు కేటాయించిన 85 శాతానికి ఎన్ని సీట్లు ఉంటాయో గణాంకాలు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 72 , 1974 జులై 3న విడుదలైన రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని పిటిషనర్ల తరపు న్యాయవాది వివరించారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95 ప్రకారం రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్ 2 నుంచి 2024 జూన్ 1వ తేదీ వరకు విద్యాసంస్థల్లో రెండు రాష్ట్రాల విద్యార్థులకు రిజర్వేషన్లు యథాతథంగా కొనసాగిస్తూ సీట్లు కేటాయించాల్సి ఉందన్నారు.
విభజన చట్టంలోని ఈ నిబంధనను మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపారు. రాష్ట్రంలో 2014 జూన్ తర్వాత ఏర్పాటు చేసిన వైద్య కళాశాలల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని వంద శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేయడం చట్ట ప్రకారం చెల్లదని వివరించారు.
ప్రదీప్ జైన్ కేసులో సుప్రీంకోర్టు ఇదే విషయం స్పష్టం చేసిందని, ప్రభుత్వం, కాళోజీ విశ్వవిద్యాలయం తరఫున అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్, ప్రభాకర్రావులు వాదనలు వినిపించారు.
ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన తెలంగాణ స్థానికత కలిగిన రాష్ట్ర విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వడానికే ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. సందీప్ వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు నేపథ్యంలో ప్రదీప్ జైన్ కేసులో ఇచ్చిన తీర్పు తెలంగాణకు వర్తించదన్నారు.
ఆర్టికల 371(డి) కింద స్థానిక రిజర్వేషన్లు పొందే హక్కు రాష్ట్రానికి ఉందన్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంల, రాజ్యాంగానికి విరుద్ధంగా గాని ప్రభుత్వ నిర్ణయం లేదని వివరించారు. రాష్ట్ర విభజనకు ముందు ఉన్న 20 కళాశాలల్లో 2,850 సీట్లు ఉన్నాయని, వీటిని రెండు రాష్ట్రాల విద్యార్థులను స్థానికులుగానే పరిగణనలోకి తీసుకుని కేటాయిస్తున్నట్లు చెప్పారు. కొత్త కాలేజీల్లో మాత్రమే జీవో 72 వర్తింప చేస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వ పెట్టుబడితో ఏర్పాటు చేసిన 34 కాలేజీల ద్వారా పెరిగిన 5,365 సీట్లలో 85 శాతం సీట్లను తెలంగాణ స్థానికులకే కేటాయిస్తున్నామని తెలిపారు. మిగిలిన 15 శాతం ఆలిండియా కోటా సీట్లను మెరిట్ కింద ఎవరైనా పొందవచ్చన్నారు.
ఏపీ ప్రభుత్వం కూడా ఇలాగే 103, 104, 105 జీవోలను తీసుకువచ్చిందని, ఈ ఉత్తర్వులపై ఏపీ హైకోర్టు జోక్యం చేసుకోకపోవడంతో వివాదం సుప్రీంకోర్టుకు చేరిందని తెలిపారు. అక్కడ ఇంకా పెండింగ్లో ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. లోకల్ నాన్లోకల్ రిజర్వేషన్ల ప్రకారం సీట్ల కేటాయింపు గణాంకాలను సమర్పించాలని ప్రభుత్వాన్ని, కాళోజీ వర్శిటీని ఆదేశించింది.