Tammineni Health: విషమంగా తమ్మినేని ఆరోగ్యం.. ఐసియూలో చికిత్స
17 January 2024, 7:13 IST
- Tammineni Health: తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అనారోగ్యంతో హైదరాబాదులోని గచ్చిబౌలి ఏఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని ఏఐజీ ఆస్పత్రి హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
విషమంగా తమ్మినేని వీరభద్రం ఆరోగ్య పరిస్థితి
Tammineni Health: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం విషమంగా ఉందని ఏఐజీ ఆస్పత్రి ప్రకటించింది. ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో వీరభద్రంకు వివిధ రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు.
తమ్మినేని ప్రస్తుతం ఐ సి యు లో ఉన్నారు. ఇప్పటికే వైద్యులుపలు రకాల పరీక్షలు చేశారు. డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. పార్టీ కార్యకర్తలు ఆసుపత్రికి రావద్దని వైద్యులు సూచించారు. ఈ మేరకు మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
తమ్మినేని వీరభద్రం గత సోమవారం స్వగ్రామమైన ఖమ్మం జిల్లాలోని తెల్దారుపల్లిలో ఉన్న సమయంలో ఒంట్లో నలతగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ తమ్మినేనిని పరీక్షించిన వైద్యులు పల్స్ తక్కువగా ఉండటాన్ని గుర్తించి వెంటనే చికిత్స అందించారు.
తమ్మినేని గుండె కొట్టుకోవడంలో తేడాలున్నాయని ప్రాథమిక పరీక్షల్లో వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని సూచించడంతో కుటుంబసభ్యులు తమ్మినేనిని వెంటిలేటర్ సపోర్టుతో ఖమ్మం నుంచి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.
తమ్మినేని వీరభద్రంకు గుండె పని చేయకపోవడం, గుండె కొట్టుకోకపోవడంతో అసాధారణ పరిస్థితి నెలకొందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. దీంతోపాటు మూత్ర పిండాలు పనిచేయకపోవడం, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం వల్ల ఇన్వాసివ్ వెంటిలేషన్ అవసరమైందని వివరించారు.
బ్లడ్ ప్రెషర్ మెరుగుపరిచేందుకు మందులు అందిస్తున్నారు. ఊపిరితిత్తుల నుంచి నీరు తొలగించి, గుండె సాధారణ స్థితికి వచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. డాక్టర్ సోమరాజు, డాక్టర్ డీఎన్ కుమార్ మార్గ దర్శకత్వంలో తమ్మినేనికి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి ఇంకా విషమంగా ఉందని, వెంటిలేటర్పై ఉన్నారని హెల్త్ బులెటిన్లో ఏఐజీ వెల్లడించింది.
ఆస్పత్రిలో తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో సంప్రదించి తగిన వైద్యం అందించడానికి సిపిఎం పార్టీ కార్యదర్శివర్గ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు తమ్మినేనిని మాజీ మంత్రి హరీశ్రావు పరామర్శించారు. తమ్మినేని ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తమ్మినేని వీరభద్రంకు 2004లో వైద్యులు స్టంట్స్ వేశారు.