TS Green Apple Awards : తెలంగాణ నిర్మాణాలకు ఐదు అంతర్జాతీయ అవార్డులు, 16న లండన్ లో ప్రధానోత్సవం!
14 June 2023, 14:07 IST
- TS Green Apple Awards : తెలంగాణలోని ఐదు నిర్మాణాలకు అంతర్జాతీయ అవార్డులు వరించాయి. యాదాద్రి ఆలయం, సచివాలయంతో పాటు మరో మూడు నిర్మాణాలకు గ్రీన్ యాపిల్ అవార్డులు దక్కాయి.
తెలంగాణకు అంతర్జాతీయ అవార్డులు
TS Green Apple Awards :తెలంగాణలోని ప్రతిష్ఠాత్మక నిర్మాణాలకు ఐదు అంతర్జాతీయ అవార్డులు లభించాయి. యాదాద్రి ఆలయం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, తెలంగాణ సచివాలయం, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్, మొజాంజాహీ మార్కెట్ భవనాలకు ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డులు వరించాయి. లండన్కు చెందిన గ్రీన్ ఆర్గనైజేషన్ తెలంగాణలోని నిర్మాణాలకు అవార్డులను ప్రకటించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ నిర్మాణాలకు గ్రీన్ యాపిల్ అవార్డులు దక్కాయి. లండన్లో ఈ నెల 16న జరిగే కార్యక్రమంలో గ్రీన్ ఆర్గనైజేషన్ ఈ అవార్డులను అందజేయనుంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ అవార్డులను అందుకోనున్నారు.
ఐదు నిర్మాణాలకు అవార్డులు
రాష్ట్రంలోని ఐదు నిర్మాణాలకు 5 అంతర్జాతీయ అవార్డులు వరించాయి. లండన్లోని గ్రీన్ ఆర్గనైజేషన్ అందిస్తున్న ప్రతిష్ఠాత్మక గ్రీన్ యాపిల్ అవార్డులు తెలంగాణకు దక్కాయి. రాష్ట్ర సచివాలయం, యాదాద్రి ఆలయం, మొజంజాహీ మార్కెట్, దుర్గం చెరువు, కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణాలకు ఈ అరుదైన గుర్తింపు లభించింది. భారత్కు గ్రీన్ యాపిల్ అవార్డులు రావడం ఇదే మొదటిసారి అని గ్రీన్ ఆర్గనైజేషన్ ప్రకటించింది. బ్యూటిఫుల్ వర్క్స్పేస్ బిల్డింగ్ కేటగిరీలో తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి, హెరిటేజ్ కేటగిరీలో మొజంజాహీ మార్కెట్కు, యూనిక్ డిజైన్ కేటగిరీలో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జికు, స్పెషల్ ఆఫీస్ కేటగిరీలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు, అద్భుతమైన మతపరమైన నిర్మాణాల విభాగంలో యాదాద్రి ఆలయానికి గ్రీన్ యాపిల్ అవార్డులు దక్కాయి. మే 16న లండన్లో జరిగే అవార్డుల కార్యక్రమంలో స్పెషల్ సీఎస్ అర్వింద్ కుమార్ ఈ అవార్డులను అందుకోనున్నారు.
గ్రీన్ ఆర్గనేషన్ ఏంచేస్తుంది ?
గ్రీన్ ఆర్గనైజేషన్ అనే స్వచ్ఛంద సంస్థను 1994లో లండన్లో ఏర్పాటుచేశారు. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణను ప్రచారం చేయడం, ఇందుకు కృషి చేస్తున్న వారిని గుర్తించి అవార్డులు అందిస్తుంది ఈ సంస్థ. 2016 నుంచి గ్రీన్ యాపిల్ అవార్డులు అందిస్తుంది. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థలు, కౌన్సిల్స్, కమ్యూనిటీలకు గ్రీన్ యాపిల్ అవార్డులను అందజేస్తుంది. ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన నిర్మాణాలకు పలు విషయాలను పరిగణలోకి తీసుకుని ఇంటర్నేషనల్ బ్యూటిఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డులను అందిస్తుంది. నివాసాలు, కోటలు, మ్యూజియం, బ్రిడ్జిలు, మతపరమైన కట్టడాలు, వారసత్వ కట్టడాలు పలు కేటగిరీల్లో అవార్డులు అందిస్తారు. లండన్లోని బాఫ్టా, నేషనల్ మ్యూజియం ఆఫ్ ఖతార్, మలేసియాలోని జలాన్ మహ్కోటకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులు దక్కాయి.
సీఎం కేసీఆర్ హర్షం
తెలంగాణలో 5 నిర్మాణాలు అంతర్జాతీయ అవార్డులను దక్కించుకోవడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఇందులో డా.బీఆర్.అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం, యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనం, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీ, మొజం జాహీ మార్కెట్ లు ‘ఇంటర్నేషనల్ బ్యూటీఫుల్ బిల్డింగ్స్ గ్రీన్ యాపిల్ అవార్డుల’ను అందుకోవడం గొప్ప విషయమని సీఎం అన్నారు. పర్యావరణ రంగంలో ప్రపంచంలోనే పేరొందిన లండన్ కు చెందిన ప్రతిష్టాత్మక ‘గ్రీన్ ఆర్గనైజేషన్’ ఈ అవార్డులను ప్రకటించడం తెలంగాణకు గర్వకారణమని అన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఈ గ్రీన్ అవార్డులను దక్కించుకున్న రాష్ట్రంగా తెలంగాణ నిలవడం ద్వారా, తెలంగాణతో పాటు దేశ ఖ్యాతి ఇనుమడించిందని సీఎం తెలిపారు.