తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sunil Kanugolu Strategy: కర్ణాటకను కొట్టాడు... తెలంగాణలో'వ్యూహాలు' ఫలిస్తాయా..?

Sunil Kanugolu Strategy: కర్ణాటకను కొట్టాడు... తెలంగాణలో'వ్యూహాలు' ఫలిస్తాయా..?

03 June 2023, 5:30 IST

    • Telangana Congress News: కర్ణాటకలో కాంగ్రెస్ ను గెలుపు తీరాలకు చేర్చటంలో కీలక పాత్ర పోషించారు వ్యూహకర్త సునీల్ కనుగోలు. ఇటీవలే ఆయన్ను ప్రభుత్వ సలహాదారుగా కూడా నియమించింది అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే తెలంగాణలో కూడా కనుగోలు వ్యూహం వర్కౌట్ అవుతుందా అన్న చర్చ నడుస్తోంది.
సునీల్ కనుగోలు
సునీల్ కనుగోలు

సునీల్ కనుగోలు

Sunil Kanugolu Strategy: సునీల్ కనుగోలు..... ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద అసెట్ గా మారిపోయాడు. తన వ్యూహలు, ప్రతివ్యూహాలతో ప్రత్యర్థులను బోల్తా కొట్టించేస్తున్నాడు. ఈ మధ్యనే కర్ణాటకలో కూడా తన స్ట్రాటజీ వర్కౌట్ అయింది. ఏడాది కాలంగా పార్టీకి సేవలు అందిస్తున్న కనుగోలు.... పక్కగా ప్లాన్ అమలు చేసేశాడు. కట్ చేస్తే బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. మెజార్టీ ఫిగర్ కు మించి స్థానాలను గెలిచిన కాంగ్రెస్.... సింగిల్ గానే అధికారంలోకి వచ్చేసింది. ఇక పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించిన కనుగోలుకు పెద్దపీఠనే వేసింది సిద్ధా రామయ్య సర్కార్. ప్రభుత్వ మీడియా సలహాదారుడిగా నియమించింది. ఇదిలా ఉంటే... రాబోయే మరికొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కనుగోలు వ్యహం ఫలిస్తుందా..? నెక్ట్స్ టార్గెట్ గా భావిస్తున్న తెలంగాణను కూడా కొట్టేస్తారా...? అన్న చర్చ జోరుగా నడుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

TS TET 2024 Exams : రేపట్నుంచే తెలంగాణ టెట్ పరీక్షలు- ఎగ్జామ్ షెడ్యూల్, అభ్యర్థులకు మార్గదర్శకాలివే!

TG ITI Admissions 2024 : టెన్త్ విద్యార్థులకు అలర్ట్... ఐటీఐ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

Food Inspection in Hyderabad : పాడైపోయిన ఆహార పదార్థాలు, పాటించని ప్రమాణాలు - తనిఖీల్లో విస్తుపోయే విషయాలు..!

Karimnagar Tourism : చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రసిద్ధి చెందిన ఆలయాలు - కరీంనగర్ జిల్లాలో చూడాల్సిన ప్రాంతాలివే..!

ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో సునీల్ కనుగోలు కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ కు విజయం చేకూర్చడంలో ఆయన వ్యూహలు పక్కగా సక్సెస్ అయ్యాయి. 2022లో కర్ణాటక కాంగ్రెస్ కు వ్యూహకర్తగా జాయిన్ కాగా... పార్టీ ప్రచార తీరు నుంచి టికెట్ల పంపిణీ వరకు అన్నీ తానై వ్యవహరించారు. పార్టీ నేతల మధ్య గ్రూపు గొడవలను దారిలో పెట్టి వివిధ వర్గాలను ఏకతాటిపైకి తీసుకువచ్చారు. ముఖ్యంగా సిద్ధ రామయ్య, డీకే శివకుమార్ వర్గాల మధ్య విబేధాలు లేకుండా చేశారు. నేతలందర్నీ ఒకే మార్గంలో నడిపించటమే కాదు... స్పష్టమైన టార్గెట్ తో అడుగులు వేసేలా చేశాడు. ప్రధానంగా బీజేపీ అవినీతి పాలన అంశాన్ని కన్నడ ఓటర్ల దృష్టికి తీసుకెళ్లారు. కమీషన్ల సర్కార్ నినాదం బాగా వర్కౌట్ అయింది. ఇదిలా ఉంటే... వచ్చే సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెట్టే బాధ్యతలనూ చూస్తున్నారు కనుగోలు.

తెలంగాణలో వర్కౌట్ అవుతుందా..?

ఇక ఇదే ఏడాది తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ కూడా పార్టీని గెలిపించే బాధ్యతలను భుజాన వేసుకున్నారు సునీల్ కనుగోలు. చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు కొన్ని నెలల్లోనే ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ కూడా బాధ్యతలు చూడనున్నారు. 2024 పార్లమెంట్ ఎన్నికలకు సంబధించి కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఎలక్షన్ టాస్క్ ఫోర్స్ లో కూడా సభ్యుడిగా ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ...తెలంగాణలోని పరిస్థితులే కాంగ్రెస్ హైకమాండ్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి వైఖరిపై సుముఖంగా లేని పలువురు సీనియర్ నేతలను ఏకతాటిపైకి తీసుకువస్తారా...? నేతల మధ్య అంతర్గత విబేధాలు పరిష్కరించడం అంత సులువేనా? అన్న టాక్ మొదలైంది. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికీ... నేతల మధ్య సయోధ్య అనేదే అతిపెద్ద సవాల్. కర్ణాటక మాదిరిగానే ఇక్కడ కూడా నేతలను కరెక్ట్ గా సమన్వయం చేస్తే విక్టరీ కొట్టొచ్చు. అయితే ఇలాంటి అంశాలను కనుగోలు ఎలా డీల్ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. కర్ణాటకలో మాదిరిగా అవినీతి అస్త్రాన్ని కూడా ఇక్కడ కూడా అమలు చేస్తారా...? అనేది చూడాలి. ఇక ముఖ్యంగా యువతను ఆకట్టుకునేలా కనుగోలు వ్యూహాలు ఉండొచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే పలు డిక్లరేషన్లు చేస్తున్న కాంగ్రెస్... వాటికి అనుబంధంగా ఏమైనా మేనిఫెస్టోను విడుదల చేస్తుందా..? కర్ణాటకలో మాదిరిగానే కొన్ని ప్రధాన అంశాలతోనే ప్రజల్లోకి వెళ్లాలని చూస్తుందా అన్న అభిప్రాయాలు కూడా తెరపైకి వస్తున్నాయి.

కర్ణాటకలోని బళ్లారిలో పుట్టిన కనుగోలు.… అమెరికాలో ఉన్నత చదువులు చదివారు. గ్లోబల్ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ మెకిన్సేలో పని చేశారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన గుజరాత్‌లో రాజకీయ వ్యూహాలలో పాలుపంచుకున్నారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీకి వ్యూహకర్తగా వ్యవహరించిన వారిలో ఒకరిగా ఉన్నాడు. 2017 ప్రారంభంలో యూపీ అసెంబ్లీ ఎన్నికలలో కనుగోలు అత్యంత విజయవంతమైన బీజేపీ ప్రచారాన్ని నిర్వహించారు. తమిళనాడు సీఎం స్టాలిన్‌తో కూడా కనుగోలుకు మంచి రిలేషన్ ఉంది. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో దాని ‘నమక్కు నామం’ (మనం కోసం మనమే) ప్రచారాన్ని పర్యవేక్షించారు. ఆ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని కూటమి మొత్తం 39 పార్లమెంట్ స్థానాల్లో 38 స్థానాలను గెలుచుకుంది. మొత్తంగా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న వ్యూహకర్తగా పేరొందిన సునీల్ కనుగోలు... తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించడానికి ఎలాంటి వ్యూహలను అమలు చేస్తారనేది చూడాలి...!

తదుపరి వ్యాసం