Sircilla News : ఏ రాజకీయ పార్టీ అయినా సరే జెండా సిరిసిల్లదే!
06 September 2023, 16:59 IST
- Sircilla News : దేశంలో ఎక్కడ ఎన్నికల జరిగినా సిరిసిల్ల జెండా ఎగరాల్సిందే. సిరిసిల్ల నేతన్నల నైపుణ్యాన్ని మెచ్చిన జాతీయస్థాయి, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలు తమ ప్రచార జెండాలు, ఇతర సామాగ్రి సిరిసిల్లలోనే తయారు చేయిస్తున్నాయి.
సిరిసిల్ల నేతన్నలు
Sircilla News : దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎన్నికల ప్రచార సామాగ్రికి సిరిసిల్ల కేరాఫ్గా అడ్రస్ గా మారుతోంది. రాష్ట్ర, జాతీయ స్థాయి పార్టీల జెండాలు, కండువాలు, టోపీలు.. ఇతర ఎన్నికల సామాగ్రి సిరిసిల్లలోనే తయారవుతున్నాయి. అతి తక్కువ ధరలకే ఎన్నికల ప్రచార సామాగ్రిని సరఫరా చేస్తూ జాతీయ స్థాయి పార్టీల చూపు సిరిసిల్ల వైపు చూసేలా చేస్తున్నారు సిరిసిల్ల నేతన్నలు. ఇప్పటికే పలు పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఆర్డర్స్ వస్తుండడంతో పాటు వారికి కావాల్సిన ధరలో మన్నికతో అందిస్తున్నారు నేతన్నలు. దీంతో రాజకీయ పార్టీలు నేతలు ఇక్కడకు క్యూ కడుతున్నారు.
నేతన్నకు ముందే వచ్చిన ఓట్ల పండగ
తెలంగాణ రాష్ట్రంతో పాటు జమిలి ఎన్నికల వాతావరణం దేశ వ్యాప్తంగా ఉన్న తరుణంలో ఏ సమయంలో ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని అభ్యర్థులు పార్టీలు సూచిస్తున్నాయి. దీంతో పలు పార్టీలు అభ్యర్థులు ప్రచారానికి కావాల్సిన సామాగ్రి కోసం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి తరలివస్తున్నారు. అధికారం కోసం పోటీ పడుతున్న పార్టీలు... ప్రచారమే తమ గెలుపులో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. పార్టీ జెండాలతో ఈ ప్రచారం మరింత కలర్ ఫుల్ గా కనబడుతుంది. ఇందుకోసం రాజకీయ పార్టీలు జెండాలు, బ్యానర్స్, టీ.షర్ట్స్ ఇతర ఎన్నికల సామాగ్రిని సిరిసిల్ల నేతన్నలకు పెద్దఎత్తున ఆర్డర్ ఇస్తున్నారు. తక్కువ ధర, మన్నిక కలిగిన సరుకును సరఫరా చేస్తుండడంతో సిరిసిల్ల వైపే రాజకీయ నేతలు మొగ్గు చూపుతున్నారు. నిన్న మొన్నటి వరకు జాతీయ జెండాలు సిరిసిల్లలో తయారు చేసి మంచి పేరు సంపాదించుకున్నారు నేతన్నలు. దీంతో రానున్న ఎన్నికల్లో సిరిసిల్లకు చెందిన జెండాలే ప్రతిచోట దర్శనమిస్తాయని నేతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నాలుగు వేలమందికి ఉపాధి
సిరిసిల్లలో ఎటు చూసిన వివిధ పార్టీల జెండాలు, బ్యానర్లు, టోపీలు తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారవుతున్న ఎన్నికల ప్రచార సామాగ్రితో 4 వేల మందికి పైగా కార్మికులకు ఉపాధి పొందుతున్నారు. సిరిసిల్లలో తయారైన ఎన్నికల ప్రచార సామాగ్రిని వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. త్వరలో తెలంగాణలో జరిగే ఎన్నికల కోసం పెద్ద ఎత్తున ఆర్డర్స్ వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఎక్కడ జరిగినా ఇక్కడి నుంచే ప్రచార సామాగ్రిని పంపిస్తున్నామని నేతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్, వైసీపీ ఆర్డర్లు
ఏపీ, తెలంగాణకు చెందిన అధికార వైసీపీ, బీఆర్ఎస్ పార్టీలు సిరిసిల్ల నేతలన్నలకు ఆర్డర్లు ఇచ్చాయి. ఇప్పటికే నేతన్నలు ఉత్పత్తి ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి 5 లక్షల మీటర్ల ఆర్డర్లు వచ్చాయని నేతన్నలు అంటున్నారు. వైసీపీ కూడా 5 లక్షల మీట్లర్ల ఆర్డర్లు ఇచ్చిందన్నారు. ప్రస్తుతానికి ఈ రెండు పార్టీలకు సంబంధించి జెండాలు, కండువాలు తయారు చేస్తు్న్నారు.
రిపోర్టింగ్- గోపికృష్ణ, కరీంనగర్