MMTS Trains Cancelled : అలర్ట్… వారం రోజుల పాటు 22 MMTS రైళ్లు రద్దు - రూట్లు ఇవే
29 July 2023, 9:58 IST
- Hyderabad MMTS Trains Cancellation : భాగ్యనగరంలోని నగరంలోని పలు రూట్లలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు ఆయా రూట్ల వివరాలతో పాటు తేదీలను వెల్లడించింది.
ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు
Cancellation MMTS Train Services: ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. పలు రూట్లలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జులై 31 నుంచి వచ్చే నెల 6 వరకూ 22 ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. నిర్వహణ పనుల కోసం రద్దు చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఎంచుకోవాలని సూచించింది. రద్దు చేసిన వాటిలో లింగంపల్లి-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే 12 ఎంఎంటీఎస్ రైళ్లు ఉన్నాయి. మిగతా 10 ఎంఎంటీఎస్లు ఉందానగర్-లింగంపల్లి, ఫలక్నుమా-లింగంపల్లి మధ్య నడిచేవి రైళ్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
పలు రైళ్లు రద్దు:
వర్షాల దాటికి రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న నేపథ్యంలో… కీలక అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. 36 రైళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. తిరుపతి-కట్పాడి స్టేషన్ల మధ్య రెండు రైళ్లను రద్దు చేశారు. ఈ నెల 31 నుంచి ఆగస్టు 6 వరకు ఈ స్టేషన్ల మధ్య రైళ్ల రద్దు కొనసాగుతుంది తెలిపింది. ఇక కాజీపేట్-డోర్నకల్, విజయవాడ-డోర్నకల్, భద్రాచలం రోడ్-విజయవాడ, బల్హార్ష-విజయవాడ, కాజీపేట్-సిరిపూర్టౌన్, బల్హార్ష-కాజీపేట్, సిర్పూర్ టౌన్-భద్రాచలం రోడ్, సికింద్రాబాద్-వికారాబాద్, నిజామాబాద్-కరీంనగర్ మధ్య నడిచే పలు రైళ్లు రద్దు అయ్యాయి. జులై 31 నుంచి ఆగస్టు 7 వరకు రద్దు చేసినట్లు పేర్కొంది. ఇక గుంటూరు డివిజనల్ పరిధిలో చూస్తే…. గుంటూరు-డోన్, కాచిగూడ- నడికుడి, విజయవాడ-గుంటూరు, మాచర్ల-గుంటూరు, నడికుడి-మాచర్ల వంటి స్టేషన్ల మధ్య నడిచే పది రైళ్లను కూడా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. విజయవాడ-బిట్రగుంట, చెన్నై-బిట్రగుంట, రాజమండ్రి- విశాఖపట్నం, విజయవాడ-గూడూరు, విజయవాడ-ఒంగోలు మధ్య నడిచే సర్వీసులు రద్దు అయ్యాయి.
కొద్దిరోజులు కురుస్తున్న భారీ వర్షాలకు చాలా చోట్ల రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్న పరిస్థితి ఉంది. ఇటీవల వరంగల్ నగరంలోని కాజీపేట స్టేషన్ లోకి వరద నీరు భారీగా వచ్చి చేరింది. దీంతో రాకపోకలను కూడా నిలిపివేశారు. వీటన్నింటి నేపథ్యంలో… పూర్తి స్థాయిలో మరమ్మత్తులు చేసి రాకపోకలు చేసేలా దక్షిణ మధ్య రేల్వే చర్యలు చేపట్టింది. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది.
ట్రాఫిక్ ఆంక్షలు:
మొహర్రం పండుగ నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. చార్మినార్, గులార్హౌస్, పురాణ హవేలీ, చాదర్ఘాట్ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు ఆయా ప్రాంతాల్లో వాహనాల నిలిపివేత, దారిమళ్లింపు వంటివి ఉంటాయని వెల్లడించారు. వాహనాదారులు ఇబ్బందిపడకుండా…ప్రత్యామ్నాయమార్గాలను చూసుకోవాలని విజ్ఞప్తి చేశారు.