Hyderabad Rapes : ఈ నగరానికి ఏమైంది.. మహిళా కమిషన్ సీరియస్
07 June 2022, 21:05 IST
- హైదరాబాద్లో వరుసగా బాలికలపై అత్యాచార ఘటనలు వెలుగుచూడటంపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. మైనర్ బాలికలపై అత్యాచార కేసులు నమోదుపై మండిపడింది.
ప్రతీకాత్మక చిత్రం
భాగ్యనగరంలో కొన్ని రోజులు అత్యాచార ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. రోజుల వ్యవధిలోనే.. ఇన్ని ఘటనలు చోటుచేసుకోవడంపై మండిపడింది. హైదరాబాద్లోని అమ్నేషియా పబ్కు వెళ్లిన బాలికపై కొందరు సామూహిక అత్యాచారం చేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. దీనిపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్గా స్పందించింది. కేసు విచారణకు సంబంధించి జాతీయ మహిళా కమిషన్ తెలంగాణ పోలీసులకు నోటీసులు జారీచేసింది.
నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని అడిగింది. తక్షణ చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రేఖ శర్మ తెలంగాణ డీజీపీకి లేఖ రాశారు. బాధితురాలి గుర్తింపును బహిర్గతం చేసే వీడియోలు ఏవీ.. ఆన్లైన్ ఉండకూడదని.. తొలగించాలని పేర్కొంది. ఈ వీడియోలను పోస్టు చేసే వ్యక్తులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపింది.
హైదరాబాద్లో రోజుల వ్యవధిలో మైనర్ బాలికలపై ఐదు అత్యాచార కేసులు నమోదయ్యాయని జాతీయ మహిళా కమిషన్ తెలిపింది. హైదరాబాద్లో మైనర్లపై అత్యాచారం జరిగిన ఘటనల్లో రెండు కేసులు సోమవారమే వచ్చాయని పేర్కొంది. హైదరాబాద్ పరిధిలో బాలికలు, మహిళలపై నేరాల రేటు పెరుగుతుండటంపై మండిపడింది. నేరాలను అరికట్టడం, మహిళలను కాపాడటం మాత్రమే కాకుండా ఇటువంటి విషయాలలో వేగంగా తగిన చర్యలు తీసుకోవడం పోలీసుల పాత్ర అని కమిషన్ గుర్తు చేసింది.
ఇన్ని ఘటనలు చోటుచేసుకోవడంపై.. వివరణ ఇవ్వాలని కమిషన్ చెప్పింది. బాలికలు, మహిళల భద్రత, నేరాల అదుపు కోసం తెలంగాణ రాష్ట్రం తీసుకున్న చర్యలపై ఏడు రోజుల్లోగా వివరణాత్మక నివేదిక పంపాలని చెప్పింది. ఈ విషయంలో నేరుగా జోక్యం చేసుకోవాలని డీజీపీకి కూడా ప్రత్యేకంగా జాతీయ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖా శర్మ లేఖ రాశారు. ఈ లేఖ కాపీని హైదరాబాద్ పోలీస్ కమిషనర్కు కూడా ఆమె పంపారు.
టాపిక్