Crime News : జనగామ చిన్నారి హత్యకేసులో ఎవరూ ఊహించని ట్విస్ట్
01 August 2022, 22:28 IST
- జనగామ జిల్లాలో ఓ చిన్నారి దారుణంగా హత్యకు గురైంది. గొలుసు దొంగే చిన్నారిని హత్య చేసినట్టుగా అందరూ నమ్మారు. కానీ పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటకొచ్చాయి.
చిన్నారిని నీటి సంపులో పడేసి హత్య
జనగామ జిల్లాలో చిన్నారి హత్య కేసు సంచలనం సృష్టించింది. గొలుసు తీసుకెళ్తూ.. దొంగే చిన్నారిని నీటి సంపులో పడేశాడు అని అందరూ అనుకున్నారు. కానీ అదంతా నిజం కాదని పోలీసుల విచారణలో తేలింది. దర్యాప్తు చేసిన పోలీసులు.. అసలు విషయం తెలిసి షాక్ అయ్యారు.
ఉదయం నుంచి ఏం చెప్పారంటే?
జనగామ జిల్లా అంబేడ్కర్ నగర్లో ఓ చైన్ స్నాచర్ చేతిలో పది నెలల పసికందు ప్రాణాలు కోల్పోయింది. ప్రసన్న అనే మహిళ తన పాపను ఎత్తుకొని ఉంది. బైక్ మీద వచ్చిన దొంగ మెడలోని గొలుసు లాగేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ప్రసన్న తీవ్రంగా అడ్డుకుంది. దీంతో ఏం చేయాలో తెలియని దొంగ.. చేతిలోని చిన్నారిని లాక్కుని పక్కనే ఉన్న నీటి సంపులో పడేశాడు.
అప్పటి వరకూ అక్కడ జరుగుతున్న పరిస్థితిని చుట్టుపక్కల ఎవరూ పట్టించుకోలేదు. ప్రసన్న ఒక్కసారిగా కేకలు వేసింది. తన బిడ్డను దొంగ.. నీటి సంపులో పడేశాడని ఏడుస్తూ చెప్పింది. అప్పటికే పాప చనిపోయింది. పోలీసులు పాప మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఇది ఉదయం నుంచి చెప్పిన విషయం.
కానీ పోలీసులకు ఎక్కడో అనుమానం కలిగింది. ప్రసన్నపై నిజంగానే చైన్ స్నాచర్ దాడి చేశాడా? లేదా ఆమె అబద్ధం చెబుతోందా? అనే కోణంలో విచారణ మెుదలుపెట్టారు. పోలీసులు ప్రసన్నను పలు కోణాల్లో విచారించారు. మరోవైపు.. చైన్ స్నాచర్ దాడికి సంబంధించి సమీపంలోని సీసీటీవీ పుటేజీని పరిశీలించారు. దీంతో అసలు విషయం బయటపడింది.
అసలు జరిగింది ఇది..
మహిళ మెడలో నుంచి మంగళసూత్రం దొంగిలించడానికి ఎవరూ రాలేదని పోలీసులు గుర్తించారు. చిన్నారిని తల్లే చంపేసిందని నిర్ధారించారు. ప్రసన్న-భాస్కర్ దంపతులకు చనిపోయిన చిన్నారితో పాటు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. బాబుకు గుండె సంబంధిత జబ్బు ఉంది. ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించారు. చిన్నారి తేజస్వినిలో ఎదుగుదల లేదు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. మాటలు రావని వైద్యులు చెప్పారు. ఈ కారణంగా ప్రసన్న మానసింకంగా ఇబ్బందులు ఎదుర్కొంది. ఏం చేయాలో తెలియని పరిస్థితులోకి వెళ్లింది.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో పాపను నీటి సంపులో వేసి చంపేసింది. తర్వాత.. తనను అరెస్టు చేస్తారనే భయంతో గొలుసు దొంగ కట్టుకథ చెప్పింది. విచారణలో భాగంగా తల్లి చేసిన తప్పును ఒప్పుకుందని డీసీపీ సీతారాం తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.