MLC Kavitha | మేడారం జాతర డాక్యుమెంటరీని విడుదల చేసిన ఎమ్మెల్సీ కవిత
12 February 2022, 17:21 IST
- తెలంగాణ జాగృతి సమర్పణలో ప్రముఖ డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ బాలాజీ దూసరి దర్శకత్వంలో నిర్మించబడిన సమ్మక్క సారక్క జాతర డాక్యుమెంటరీని హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కవిత విడుదలచేశారు. సమ్మక్క సారక్క జాతర డోలు వాయిద్య కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్యను కవిత సత్కరించారు.
మేడారం సమ్మక్క సారక్క జాతర డాక్యుమెంటరీని విడుదల చేస్తున్న ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్: తెలంగాణ కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హైదరాబాద్ లోని నివాసంలో మేడారం సమ్మక్క సారక్క జాతర డాక్యుమెంటరీని ఎమ్మెల్సీ కవిత విడుదల చేశారు. అనంతరం పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య గారిని ఘనంగా సత్కరించారు. అంతరించిపోతున్న కళను బతికించడానికి రామచంద్రయ్య గారు చేస్తున్న కృషి మరువలేనిదని ఎమ్మెల్సీ కవిత కొనియాడారు. సమ్మక్క సారక్క జాతరలో రామచంద్రయ్యకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ వనదేవతలకు ఆయన డోలు వాయిద్యం వాయిస్తూ పూజలు నిర్వహిస్తారు. ఈసారి కూడా జాతరలో ఆయన డోలు మోగనుంది.
బాలాజీ దూసరిని అభినందించిన కవిత
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన ఆదివాసీ జాతర మేడారం సమ్మక్క సారక్క జాతరపై ప్రత్యేక డాక్యుమెంటరీ రూపొందించిన ఫిల్మ్ మేకర్ బాలాజీ దూసరిని ఎమ్మెల్సీ కవిత అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను ప్రోత్సహించడానికి అన్ని విధాలుగా సహకారం అందిస్తోందని సకిని రామచంద్రయ్య గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, పినపాక ఎంఎల్ఎ రేగా కాంతారావు సైతం పాల్గొన్నారు. ఆయనతో పాటు తెలంగాణ జాగృతి జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి , ఉపాధ్యక్షులు మేడే రాజీవ్ సాగర్ , సాంస్కృతిక విభాగం కన్వీనర్ కోదారి శ్రీను , తెలంగాణ జాగృతి రంగారెడ్డి అధ్యక్షురాలు అర్చన , మేడ్చల్ జిల్లా అధ్యక్షులు సంతోష్ పాల్గొన్నారు.