Trains Cancelled: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో భారీగా రైళ్ల రద్దు…
28 July 2023, 8:56 IST
- Trains Cancelled:తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్న వర్షాలతో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. తెలంగాణలో భారీ వర్షాల కారణంగా రైల్వే ట్రాక్లపై నీరు ప్రవహిస్తుండటంతో రైళ్ల రాకపోకల్ని నిలిపివేశారు.
పలు రైళ్లు రద్దు
Trains Cancelled: భారీ వర్షాల కారణంగా హసన్పర్తి-కాజీపేట సెక్షన్ మధ్య రైల్వే ట్రాక్లపై ప్రమాదకర స్ధాయిలో నీటి ప్రవాహం చేరుకోవడంతో ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను పూర్తిగాను, పాక్షికంగా రద్దు చేశారు. మరి కొన్ని రైళ్లను దారి మళ్లించారు.
భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో 5 రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. దాదాపు 40 రైళ్లను దారి మళ్లించి నడిపించారు. గోరఖ్పుర్ ఎక్స్ప్రెస్ సహా పలు రైళ్లు గంటల తరబడి రైల్వేస్టేషన్లలోనే నిలిచిపోయాయి. గోరఖ్పుర్ ఎక్స్ప్రెస్ను పెద్దపల్లి స్టేషన్లో గురువారం మధ్యాహ్నం 6 గంటలపాటు నిలిపేశారు.
రైళ్లలో ప్రయాణికులు చిక్కుకుపోవడంతో పట్టణంలోని పలు సేవాసంస్థలు ప్రయాణికులకు అల్పాహారం అందించాయి. హనుమకొండ జిల్లా వడ్డేపల్లి వద్ద రైలు పట్టాల వరకు వరద ప్రవాహం చేరుకుంది. కోమటిపల్లి రైల్వే గేటు వద్ద పట్టాల మీదుగా వరద ప్రవాహించింది. హసన్పర్తి-కాజీపేట మధ్య వరదనీరు ప్రమాదకర స్థాయిలో పొంగి పొర్లింది.
భారీ వర్షాల కారణంగా భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ను జులై 27, 28 తేదీల్లో, సికింద్రాబాద్కి వచ్చి వెళ్లే బీదర్ ఇంటర్సిటీని 27, 28 తేదీల్లో ద.మ.రైల్వే రద్దు చేసింది. దిల్లీ నుంచి హైదరాబాద్ బయల్దేరిన తెలంగాణ ఎక్స్ప్రెస్ను బల్లార్ష నుంచి మంచిర్యాల, కాజీపేట వైపు కాకుండా దారి మళ్లించారు. మజ్రి, పింపల్కుట్టి మార్గంలో సికింద్రాబాద్కు చేరుకుంది.
సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన దానాపుర్ ఎక్స్ప్రెస్ని కాజీపేట నుంచి విజయవాడ, దువ్వాడ, విజయనగరం, సంబల్పుర్ మీదుగా మళ్లించి నడిపించారు. తిరువనంతపురం-దిల్లీ ఎక్స్ప్రెస్ని విజయవాడ నుంచి వరంగల్ వైపు కాకుండా దువ్వాడ, విజయనగరం, రాయగడ, రాయ్పుర్ నాగ్పుర్ వైపు మళ్లించారు.
నవజీవన్ ఎక్స్ప్రెస్ను కూడా దారి మళ్లించారు. తిరుపతి-కరీంనగర్, కరీంనగర్-తిరుపతి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను కాజీపేట-కరీంనగర్, కరీంనగర్-వరంగల్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. సికింద్రాబాద్-కాగజ్నగర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ సిర్పుర్ కాగజ్నగర్-ఘన్పుర్ల మధ్య పాక్షికంగా రద్దయింది.
బెంగళూరు-దానాపుర్ స్పెషల్ ఫేర్, యశ్వంత్పుర్-గోరఖ్పుర్, అండమాన్ ఎక్స్ప్రెస్, రామేశ్వరం-బనారస్, శ్రీవైష్ణోదేవి కట్రా-చెన్నై, నిజాముద్దీన్-విశాఖ, దానాపూర్-సికింద్రాబాద్ దారి మళ్లించారు.
హైదరాబాద్, విజయవాడ సహా పలు స్టేషన్లలో ద.మ.రైల్వే సహాయక కేంద్రాల్ని ఏర్పాటు చేసింది. సికింద్రాబాద్లో 040-27801111, 27786666, కాజీపేట 08702576430, విజయవాడ 08662576924, గూడూరులో 78159093300 హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటుచేసింది.
నిర్మాణ పనులతో పలు రైళ్ల రద్దు…
నిర్మాణ పనుల కారణంగా కొన్ని రైళ్లను రద్దుచేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ురువారం ప్రకటించింది. గుంటూరు-కాచిగూడ ఎక్స్ప్రెస్ జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు, కాచిగూడ-గుంటూరు ఆగస్టు 1-3 వరకు, కాచిగూడ-మెదక్, మెదక్-కాచిగూడ ప్యాసింజర్ ఆగస్టు 1-3 వరకు, సికింద్రాబాద్-గుంటూరు ఎక్స్ప్రెస్, గుంటూరు-సికింద్రాబాద్ జులై 31 నుంచి ఆగస్టు 2 వరకు రద్దయ్యాయి.
వర్షాల నేపథ్యంలో రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు వీలుగా విజయవాడ, ఒంగోలు, తెనాలి, సామర్లకోట, ఏలూరు, రాజమండ్రి స్టేషన్లతో పాటు గూడురు స్టేషన్లలో హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశారు. ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ నంబర్లు విజయవాడ 0866-2576924, గూడూరు 7815909300 స్టేషన్లలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రైల్వే అధికారులు తెలిపారు.