KTR On Steel Plant: ఏపీ వైఖరితో సంబంధం లేదు, ప్రైవేటీకరణపై పోరాడతామన్న కేటీఆర్
11 April 2023, 13:02 IST
- KTR On Steel Plant: ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరితో సంబంధం లేదని, తెలంగాణకు మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటమే ముఖ్యమని, ఏపీ ప్రభుత్వ స్పందనతో మాకు సంబంధం లేదని, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాడాలన్నది కేసీఆర్ విధానపరమైన నిర్ణయమని కేటీఆర్ స్పష్టం చేశారు.
కూల్ రూఫ్ పాలసీని ప్రకటిస్తున్నమంత్రి కేటీఆర్
KTR On Steel Plant: ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తే రిజర్వేషన్లు మాయం అవుతాయని, లక్షలాది మంది దళిత గిరిజన, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుందని కేటీఆర్ అన్నారు. పాలసీ పరంగా ప్రభుత్వ రంగ సంస్థలకు పెద్ద పీట వేయాలన్నదే తమ ప్రభుత్వ నిర్ణయమని మంత్రి కేటీఆర్ చెప్పారు.
విశాఖ స్టీల్ ప్లాంట్తో పాటు ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరితో సంబంధం లేదని, తెలంగాణకు మాత్రం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటమే ముఖ్యమని, ఏపీ ప్రభుత్వ స్పందనతో మాకు సంబంధం లేదని, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాడాలన్నది కేసీఆర్ విధానపరమైన నిర్ణయమని కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రాజెక్టుల విషయంలో గతంలో బిహెచ్ఈఎల్ సంస్థకు నేరుగా ఆర్డర్లు ఇచ్చారని, ప్రైవేట్ వ్యక్తులకు ఆర్డర్లు ఇచ్చే అవకాశాలు ఉన్నా, అలా ఇవ్వకుండా బిహెచ్ఇఎల్కు ఇచ్చామన్నారు ఎల్ఐసి ద్వారా రైతు భీమా చేయించామని, నేతన్నలకు బీమాను కూడా ఎల్ఐసి ద్వారా చేయించారని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడేందుకు కృషి చేసినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడటానికి వాటికి ప్రాధాన్యత ఇచ్చారన్నారు.
నష్టాలను జాతికి అంకితం చేసి, లాభాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడం కేంద్ర ప్రభుత్వ విధానంగా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పలుమార్లు ఆరోపించారని గుర్తు చేశారు. బీజేపీ ఎంపీ సంజయ్ విశాఖ ఉక్కుపై తెలంగాణ ప్రభుత్వం చూపిస్తున్న ఉత్సాహం, ఆసక్తి వ్యక్తీకరణలపై ఉన్న బయ్యారం ఉక్కు మీద ఎందుకు లేదని ప్రశ్నించారని, సంజయ్కు విషయ పరిజ్ఞానం లేదని, చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితి లేదని, ఆయనకు అసలు ఏ విషయ పరిజ్ఞానం లేదని విమర్శించారు.
బయ్యారం ఎందుకు ఇవ్వట్లేదో బీజేపీ చెప్పాలి….
విశాఖలో ఉక్కు కర్మాగారం, బయ్యారం స్టీల్ ప్లాంట్కు చత్తీస్ఘడ్లోని బైలా జిల్లాలో ఉన్న ఇనుప ఖనిజం ఉన్న గనులు చక్కగా ఉపయోగపడతాయని కేటీఆర్ చెప్పారు. 134కోట్ల మెట్రిక్ టన్నుల ఇనుపగని చత్తీస్గడ్ రాష్ట్రం బైలా జిల్లాలో ఉందన్నారు. బయ్యారం నుంచి 150కిలోమీటర్ల దూరంలో బైల ఉందని, విశాఖ నుంచి 600కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు.
ఏపీ రీఆర్గనైజేషన్ చట్టంలో సెయిల్ ద్వారా బయ్యారంలో, రాయలసీమ కడపలో స్టీల్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. చట్టబద్దంగా కేంద్రం ఇచ్చిన హామీ మేరకు స్టీల్ ప్లాంట్ ఏర్పాటు బాధ్యత కేంద్రానిదే అని కేటీఆర్ గుర్తు చేశారు. పార్లమెంటు సాక్షిగా రెండు తెలుగు రాష్ట్రాలకు ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారన్నారు.
బయ్యారం గురించి 2014 నుంచి అడుగడుగున తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తోందని చెప్పారు. పలుమార్లు సిఎం కేసీఆర్ లేఖలు రాశారని, మైనింగ్ మంత్రిగా 2018లొ బీరేంద్ర చౌదరిని తాను స్వయంగా విజ్ఞప్తి చేశానని చెప్పారు. బయ్యారం గురించి హామీ ఇవ్వకుండా కొత్తగూడెంలో ప్లాంటు పెడతామని, స్పాంజ్ ఐరన్ ప్లాంటు పెడతామని చెప్పారన్నారు.
అదానీకి దోచిపెట్టడానికే ప్లాంటు పెట్టట్లేదు…
2018 సెప్టెంబర్లో ప్రధానిని నేరుగా కలిసి బయ్యారం స్టీల్ ప్లాంట్ గురించి విజ్ఞప్తి చేశానని, బయ్యారంలో ఉన్న ఇనుప ఖనిజం గురించి అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని, బైలా జిల్లా నుంచి స్లర్రీ పైప్లైన్ వేసుకోడానికి 50శాతం ఖర్చు భరించడానికి కూడా తాము సిద్ధమేనని ప్రధానికి వివరించినట్లు చెప్పారు. ఖర్చులో భారం భరించడానికి సిద్ధమైనా కేంద్రం స్పందించలేదని ఆరోపించారు. బైలా జిల్లాలో ఉన్న ఇనుప ఖనిజం గురించి 2018 ఏప్రిల్ నెలలో పోస్కో, జపనీస్ స్టీల్ కంపెనీలకు కట్టెబెట్టారని చెప్పారు.
బయ్యారం విషయంలో కేంద్రం ఇచ్చిన హామీ గురించి తాము మాట్లాడగానే, అదానీ గ్రూపుకు 2018 సెప్టెంబర్లో బైలా జిల్లా ఐరన్ ఓర్ కంపెనీని పెట్టి అదానీ గనుల్ని మొత్తం కేటాయించారని ఆరోపించారు. బైల నుంచి బైల నుంచి 1800కిలోమీటర్ల దూరానికి వెళుతున్న ఇనుప ఖనిజం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి, బయ్యారానికి ఎందుకు రాలేదో కుట్రలు ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ప్రధాని స్నేహితుడు అదానీ కోసమే దుర్మార్గంగా వ్యవహరించారని కేటీఆర్ మండిపడ్డారు.
బైల జిల్లాలో ఉన్న ఇనుప ఖనిజం విలువ 6లక్షల కోట్ల రుపాయలని చెప్పారు. దానిని కొంత మందికి కట్టబెట్టడానికి కుట్రలు చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. బయ్యారం, విశాఖ స్టీల్ ప్లాంట్లను రెండు బతికించే అవకాశాలు ఉన్నా బీజేపీ అలా చేయడం లేదన్నారు. విశాఖలో ఏమి జరుగుతుందో తెలుసుకోడానికి సింగరేణి అధికారులు వెళ్లారని వివరించారు.
బయ్యారంలో స్టీల్ప్లాంట్ కోసం సజ్జన్ జిందాల్ను తాను కలసి నివేదికలు ఇస్తే, బయ్యారం కంటే తక్కువ నాణ్యమైన ఖనిజం ఉన్న చోట కూడా జిందాల్ పరిశ్రమలు పెట్టామని వెల్లడించారని, బయ్యారంలో ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారన్నారు. నవరత్న కంపెనీలను తన ఇష్టారీతిన కట్టబెట్టేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
ఆంధ్రా వైఖరితో సంబంధం లేదు….
ప్రభుత్వ రంగ సంస్థల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఖరితో మాకు సంబంధం లేదని, తెలంగాణకు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడటమే ముఖ్యమని కేటీఆర్ చెప్పారు. ఏపీ ప్రభుత్వ స్పందనతో సంబంధం లేదని, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాడాలన్నది కేసీఆర్ విధానపరమైన నిర్ణయమని కేటీఆర్ స్పష్టం చేశారు.
గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒడిశాలో గనులను దక్కించుకున్నట్టే తాము స్టీల్ ప్లాంట్ టెండర్లలో పాల్గొంటామన్నారు. బైలా జిల్లా గనుల్ని విశాఖ స్టీల్, బయ్యారంకు కేటాయిస్తే వాటిని కాపాడొచ్చన్నారు. క్యాప్టిమ్ మైనింగ్ అదానీ చేతుల్లో కట్టబెట్టిందని, అదానీకి దేశ సంపద దోచి పెడుతుంటే చూస్తూ ఉండాలా అని నిలదీశారు. ప్రభుత్వ సంస్థలు ఉండగా అదానీకి ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించారు.
ప్లాంటును విక్రయించి ఆ తర్వాత విశాఖ స్టీల్ ప్లాంట్ను తక్కువ ధరకు విక్రయించే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గంగవరం, కృష్ణపట్నం పోర్టులు పోయాయని, ఈడీ, సిబిఐలను వాడుకుని పోర్టులు లాక్కుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంటును ఎలాంటి ఇబ్బంది లేకుండా నడపొచ్చని, కావాల్సింది చిత్తశుద్ధి మాత్రమేనన్నారు. ప్రధాని అదానీ సంబంధాల కారణంగానే బయ్యారంలో కర్మాగారం పెట్టలేదని, విశాఖ ఉక్కును చంపేయాలని చూస్తున్నారని ఆరోపించారు.