Congress Khammam Meeting : ఖమ్మంలో కాంగ్రెస్ మేనియా, హోరెత్తుతున్న భట్టి పాదయాత్ర
02 July 2023, 14:04 IST
- Congress Khammam Meeting : ఖమ్మంలో కాంగ్రెస్ సభకు శ్రేణులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భట్టి విక్రమార్క పాదయాత్ర ముగింపు, కీలక నేతల చేరికలతో జనగర్జన సభకు ప్రాధాన్యత సంతరించుకుంది.
భట్టి విక్రమార్క
Congress Khammam Meeting : ఖమ్మంలో కాంగ్రెస్ మేనియా కనిపిస్తుంది. కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో జనగర్జన సభకు హాజరవుతున్నారు. ఇప్పటికే సభకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానుండడంతో పార్టీ శ్రేణులు ఖమ్మం వైపే పరుగులు తీస్తున్నాయి. అగ్రనేత రాహుల్ గాంధీ భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభకు హాజరవుతుండడంతో కాంగ్రెస్ పార్టీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్షల మందితో జనగర్జన సభను విజయవంతం చేయాలనే లక్ష్యంతో అన్ని సిద్ధం చేశారు. ఈ సభలో పార్టీలో చేరికలు, భట్టికి రాహల్ గాంధీ సన్మానంతో పాటుగా ప్రజలకు కాంగ్రెస్ తరపున స్పష్టమైన హామీలు ప్రకటించనున్నారు.
1360 కి.మీటర్ల పాదయాత్ర
భట్టి విక్రమార్క పాదయాత్ర ఇప్పటికే రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 నియోజకవర్గాల మీదుగా 1360 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. భట్టి పాదయాత్రతో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో భట్టి కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. తెలంగాణ రాజకీయాలపై భట్టి పాదయాత్ర ప్రభావం చూపుతోందని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ ఎక్కడుందీ అన్న బీఆర్ఎస్ నేతలు...ఇప్పుడు హస్తం పార్టీ బలంగానే ఉందంటున్నారు. కారులో ఉక్కపోతకు గురవుతున్న నేతలకు కాంగ్రెస్ ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా కనిపిస్తుంది. దీంతో కాంగ్రెస్ లో చేరేందుకు నాయకులు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకోవడానికి భట్టి పాదయాత్ర కొంతమేర సాయపడిందంటున్నారు విశ్లేషకులు. ఇన్నాళ్లు మూడో స్థానానికే కాంగ్రెస్ పరిమితం అవుతుందన్న వాళ్లంతా ఇప్పుడు తమ అభిప్రాయం మార్చుకున్నాంటున్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భట్టి విక్రమార్క...నిరుపేద వర్గాలను నేరుగా కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ట్రెండింగ్ గా నిలిచారు. ప్రజా సమస్యలు గుర్తించడానికి భట్టి పాదయాత్ర వేదికగా నిలిచింది. భట్టి పాదయాత్ర ముగింపుతో ఖమ్మంలో కాంగ్రెస్ మేనియా మొదలైంది.
రాహుల్ గాంధీ హాజరు
ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న జనగర్జన సభ కోసం ఖమ్మం నగరం అందంగా ముస్తాబైంది. ఖమ్మం నగరంలో అడుగడుగునా మూడు రంగుల జండాలే దర్శనమిస్తున్నాయి. ఎటు చూసినా కాంగ్రెస్ ఫ్లెక్సీలే కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ జెండాలు, హోర్డింగ్ లతో అలంకరించారు. పట్టణంలో ప్రధాన రహదారులు, చౌరస్తాలు, కూడళ్లు, విద్యుత్ స్థంభాలను కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీలతో అత్యంత సుందరంగా అలంకరించారు. పట్టణంలో దాదాపు 45 అడుగుల కటౌట్స్, హోర్డింగ్ లు, భారీ కటౌట్ లు, పెద్దపెద్ద బెలూన్స్ ఎగరేశారు. రాహుల్ కు యూత్ కాంగ్రెస్ భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో స్వాగతం పలకనుంది. ఈ సభ వైపే యావత్ తెలంగాణ ఆసక్తిగా చూస్తోంది.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ట్వీట్
ఖమ్మం సభను ఉద్దేశించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జు్న్ ఖర్గే ట్వీట్ చేశారు. 3.8 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ జనగర్జన మహా సభలో ప్రజల ఆకాంక్షల కోసం రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని తెలిపారు. ఈరోజు ఖమ్మంలో 1360 కి.మీ సుదీర్ఘ పాదయాత్రను పూర్తి చేసుకున్నందుకు సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్కకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. పలువురు సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రజాకూటమిని బలోపేతం చేయనున్నారని పేర్కొన్నారు. సమిష్టి నాయకత్వం పట్ల కాంగ్రెస్ పార్టీ గర్విస్తోందన్నారు. తెలంగాణలో కొత్త ఆవిర్భావానికి బ్లూప్రింట్ సిద్ధమైందన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం ఆధారంగా తెలంగాణ అభివృద్ధి పురోగతికి గట్టిగా కట్టుబడి ఉన్నామన్నారు.