Bhatti Vikramarka : భట్టి పాదయాత్రపై రాహుల్ ప్రశంస, జులై 2న ముగింపు సభకు హాజరు
28 June 2023, 21:14 IST
- Bhatti Vikramarka : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర జులై 2న ముగియనుంది. ముగింపు సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. సుదీర్ఘంగా సాగిన పాదయాత్ర సక్సెస్ కావడంతో రాహుల్ గాంధీ భట్టిని అభినందినట్లు తెలుస్తోంది.
భట్టి విక్రమార్క పాదయాత్ర
Bhatti Vikramarka : తెలంగాణ కాంగ్రెస్ పై అగ్రనేత రాహుల్ గాంధీ దృష్టి సారించారు. రాష్ట్రంలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటున్నారు. ఆ నివేదికల ఆధారంగా నేతలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ యాత్రపై తాజాగా రాహుల్ గాంధీ ఆరా తీశారు. రాష్ట్ర ఇంఛార్జ్ థాక్రేతో పాటుగా ముఖ్య నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘంగా కొనసాగుతున్న భట్టి విక్రమార్క పాదయాత్రలో ప్రజలతో మమేకం అవుతున్నారు. వారి సమస్యల తెలుసుకుంటూ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. పాదయాత్రలో తాను ఇస్తున్న హామీలకు ఏఐసీసీ అనుమతి ఉందని భట్టి విక్రమార్త ఇటీవల తెలిపారు. భట్టి పాదయాత్ర కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశమని నేతలు రాహుల్ ఇటీవల జరిగిన సమావేశంలో వివరించినట్లు సమాచారం. భట్టి పాదయాత్ర గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా సాగుతుండడం...ప్రజల నుంచి మరింత ఆదరణ వస్తుందని కాంగ్రెస్ నేతలు రాహుల్ కు నివేదికలు అందించారు.
తెలంగాణ ఎన్నికలు కీలకం
కర్ణాటక ఎన్నికల తర్వాత దక్షిణాదిన తెలంగాణ ఎన్నికలు కాంగ్రెస్ కు కీలకంగా మారింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సక్సెస్ కావడంతో... స్థానిక నేతలు కూడా పాదయాత్రలు చేపట్టారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క పాదయాత్రలు చేపట్టారు. అయితే భట్టి విక్రమార్క పాదయాత్ర సుదీర్ఘంగా కొనసాగుతోంది. దీంతో భట్టి పాదయాత్రపై కాంగ్రెస్ అగ్ర నేతల దృష్టి పెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం, ప్రధానిగా రాహుల్ లక్ష్యమని భట్టి విక్రమార్క పాదయాత్రలో పదే పదే ప్రస్తావిస్తున్నారు. మార్చి 16న ఆదిలాబాద్లోని పిప్పిరి గ్రామంలో ప్రారంభమైన ఈ పాదయాత్ర జులై 2న ముగియనుంది. ఖమ్మంలో జరిగే ముగింపు సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. భట్టి పాదయాత్ర ద్వారా తెలంగాణ కాంగ్రెస్ కేడర్ లో జోష్ పెరిగిందని ఆ పార్టీ సర్వేలు చెబుతున్నాయి.
రాహుల్ గాంధీ ప్రశంసలు
పాదయాత్రలో బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తూ... ప్రజల సమస్యలు తెలుసుకున్నారు భట్టి విక్రమార్క. భట్టి పాదయాత్రలో పాల్గొని నేతలంతా సంఘీభావం ప్రకటించారు. పలువురు జాతీయ నేతలు కూడా పాదయాత్రలో హాజరై మద్దతిచ్చారు. రాష్ట్రంలోని సమస్యలపైన స్పందిస్తూ...కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరిగే ప్రయోజనం ప్రజలకు వివరిస్తూ భట్టి తన యాత్ర కొనసాగించారు. భట్టి పాదయాత్ర సక్సెస్ అయిందని అందిన నివేదికలతో.. రాహుల్ గాంధీ భట్టిని అభినందించారు. పార్టీ నాయకత్వం తోడుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. భట్టి లేవనెత్తిన సమస్యపై ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తుందని తెలుస్తోంది. ఖమ్మంలో కీలక నేతనై భట్టితో కలిసి సాగాలని పొంగులేటి నిర్ణయించుకున్నారు.