Water for NSP Left canal: నేటి నుంచి సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదల, రాయలసీమ లిఫ్ట్పై తెలంగాణ ఫిర్యాదు
06 October 2023, 8:51 IST
- Water for NSP Left canal: నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పరిధిలో పంటలు ఎండిపోయే పరిస్థితులు ఉండటంతో నేటి నుంచి నీటిని విడుదల చేయాలని సిఎం కేసీఆర్ ఆదేశించారు. మరోవైపు పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచి చేపట్టిన రాయలసీమ లిఫ్ట్పై కృష్ణాబోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది.
సీఎం కేసీఆర్
Water for NSP Left canal: నేటి నుంచి సాగర్ ఎడమ కాల్వకు సాగు నీరు విడుదల కానుంది. ఈ మేరకు ఎడమ కాలువ కింద ఉన్న వరి పొలాలకు శుక్రవారం నుంచి నీరు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు.
నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో కూడా సాగర్ ఎడమ కాల్వ పరిధిలో ఆయకట్టు ఉంది. ఈ ఏడాది సాగర్ ఆయకట్టు కింద సరైన వర్షాలు కురవకపోవడంతో వరి పొలాలు దెబ్బతినే ప్రమాదం ఉందంటూ ఆ ప్రాంతాల రైతులు, ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి ఇటీవల పెద్ద ఎత్తున విజ్ఞప్తులు అందాయి.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గురువారం సీఎం నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. తెలంగాణ వాటా కింద ఉన్న కృష్ణా నీటినే పంటలను రక్షించుకునేందుకు వినియోగించాలని సీఎం అధికారులకు సూచించారు.
ఈ ఏడాది ఎగువ రాష్ట్రాల్లో తగినంత వర్షాలు కురవకపోవడం, రెండు తెలుగు రాష్ట్రాల్లో తగినన్ని వర్షాలు లేకపోవడంతో నాగార్జున సాగర్ జలాశయంలో తగినంత నీటి నిల్వ లేదని అధికారులు వివరించారు. రైతాంగం ఎదుర్కొంటున్న పరిస్థితుల దృష్టిలో పెట్టుకుని సాగునీటిని పొదుపుగా వినియోగించుకుని పంటలను కాపాడుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు.
ఎడమ కాలువకు విడుదల చేసే నీటిని జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో పర్యవేక్షిస్తూ చివరి ఆయకట్టు వరకు అందేలా చూడాలని ఆయన సూచించారు. ఇరవై రోజుల తరువాత మరో తడి కోసం అవసరమైన నీరు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
రాయలసీమ లిఫ్ట్ నిర్మాణంపై తెలంగాణ ఫిర్యాదు
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులను ఖాతారు చేయకుండా ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని కొనసాగిస్తోందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు తెలంగాణ ఈఎన్సీ ఫిర్యాదు చఏశారు.
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, బనకచర్ల కాంప్లెక్స్ల ఆధునికీకరణ పనులు చేపట్టి 800 అడుగలకు దిగువ నుంచి నీటిని లిఫ్ట్ చేయడంపై కృష్ణా బోర్డు ఛైర్మన్కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ లేఖ రాశారు. 'చెన్నై నగర తాగునీటి సరఫరాకు 15 టీఎంసీలు, రాయలసీమ తాగునీటి అవసరాలకు 8.6, చెన్నై తాగునీటి సరఫరాకు కావాల్సిన కనీస నిల్వల కింద 35.23టిఎంసిలు (వెలిగోడు 9.5, సోమశిల 17.33, కండలేరు 8.4టిఎంసిల నీటిని కలిపి.. మొత్తం 58.83 టీఎంసీలను శ్రీశైలం నుంచి మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం పనులు చేపట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంలో ఆరు పంపులను 17,500 క్యూసెక్కుల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తోంది.
గత నెలలోనే ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. కృష్ణా నదీ జల వివాదాల ట్రైబ్యునల్-1 ఆదేశాలను ఉల్లంఘించి కృష్ణా బేసిన్ వెలుపలకు నీటిని తరలిస్తోందని తెలంగాణ ఆరోపించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ఎత్తిపోతల నిర్మాణాలు చేపట్టరాదని ఎన్జీటీ గతంలో ఇచ్చిన ఆదేశాలను ధిక్కరిస్తోందని ఆరోపించారు.
1977 అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం శ్రీశైలం జలాశయం నుంచి కాలువ ద్వారా చెన్నై నగరానికి 1,500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేసేందుకు అంగీకారం కుదిరిందని అనంతర ఆ కాలువ సామర్థ్యాన్ని 44వేల క్యూసెక్కులకు, ఇప్పుడు 80 వేల క్యూసెక్కులకు విస్తరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ నిర్మాణాలకు కేంద్ర జల సంఘం అనుమతులు లేవని, ఈ అంశం కృష్ణా వాటర్ డిస్పూట్స్ ట్రిబ్యునల్-2 పరిశీలనలో ఉందని వివరించారు.ఏపీ చేపట్టిన నిర్మాణాలను అడ్డుకోవాలని కోరారు. కట్టడి చేయండి' అని ఈఎన్సీ ఆ లేఖలో బోర్డును కోరారు.